ఆదివారం 5 ఫిబ్రవరి 2012

పాడుతా తీయగా బృందానికి బహిరంగ లేఖ

 ప్రియమైన బాలసుబ్రహ్మణ్యం గారూ, పాడుతా తీయగా కార్యక్రమపు ఇతర నిర్వాహకులారా,

మీకు ఇవే నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా వీక్షిస్తున్న  ప్రేక్షకుడిగా, ఆ కార్యక్రమపు అభిమానిగా నాలుగు  మాటలు మీకు అందచేద్దామని  ఈ చిన్ని  ప్రయత్నం. మీకే నా మాటలు సూటిగా పంపకుండా, ఇక్కడ బ్లాగులో ఎందుకు వ్రాయటం అని మీకు అనిపించవచ్చు. ఒకటి, మీకు పంపాల్సిన చిరునామా నాకు తెలియదు. పంపినా మీకు వచ్చే అసంఖ్యాకమైన ఉత్తరాల్లో నాదొకటి అయిపోతుంది. రెండు, నాలాగా అనుకుంటున్న వాళ్ళు, నేను అనుకుంటున్నది బాగుంది అనుకున్న వాళ్ళల్లో ఎవరన్న మీ చెవిన నేను వ్రాసిన నాలుగు మాటలు వెయ్యకపోతారా అని ఒక ఆశ. అంతే.

పాడుతా తీయగా కార్యక్రమం సంగీత ప్రియులకు, ముఖ్యంగా సినిమా పాటల ప్రియులకు ఎంతో అభిమానమైన కార్యక్రమంగా మారింది.  ఈ కార్యక్రమంలో సంగీతం నేర్చుకుంటూ చక్కగా పాడగలిగిన చిన్నారులెందరినో వయస్సులవారీగా పోటీలు ఏర్పరిచి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండటం  ఎంతో ఆనందాన్నిస్తున్నది.  ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులుగా సుబ్రహ్మణ్యం గారూ, మీదైనా ఒక ప్రత్యెక ముద్ర ఈ కార్యక్రమం మీద ఎంతగానో కనబడుతూ ఉంటుంది. కార్యక్రమం మధ్యమధ్య మీరు చెప్పే  "అప్పటి" విశేషాలకోసమే  నేను ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాను. పాటలు మొదటి రౌండ్లల్లో కొంత విసుగెత్తించినా, దాదాపు ప్రేక్షకులు అందరూ  గుర్తించిన గాయనీ గాయకులే సెమి ఫైనల్ దాకా రావటం ఇక అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రతిభ మరింత పదును పెట్టుకుని ఫైనల్స్ లో నెగ్గటం  ఇప్పటి దాకా అనేక సార్లు చూడటం జరిగింది. 

నేను ఈ లేఖ వ్రాద్దామని మొదలు పెట్టినది ఒకే ఒక్క విషయం చెప్పటానికి. ఇప్పటి దాకా పాడుతా తీయగా కార్యక్రమం మొత్తం ఫోకస్ సినిమా పాటలమీదే ఉన్నది.  సినిమా పాటల మీదుగా  ప్రేక్షక ఆదరణ, వాళ్లకు సంగీతం మీద అభిరుచి కలిగించటంలో  ఈ కార్యక్రమం ఎంతగానో విజయం సాధించింది. ప్రేక్షక ఆదరణే  ఏ కార్యక్రమానికైనా పట్టుకొమ్మ. మీ కార్యక్రామానికి ఉన్న ఆదరణ దృష్ట్యా, మీరు కొత్తగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ విషయంలో ఈ కింది సూచనలు మీ ముందు ఉంచుతున్నాను. 

  1. ఇప్పటి వరకూ బాల బాలికలకు సంవత్సరాలుగా ఆవకాశం ఇచ్చి వాళ్ళల్లో నిజమైన ప్రతిభ కలిగిన వాళ్ళను గాయకులుగా చేయటం జరిగింది. ఇప్పుడు, కొంచెం పెద్ద వాళ్ళను అంటే ముఫ్ఫై-నలభై పైబడి పాడగలిగి ఉన్న వాళ్ళను, ముఖ్యంగా మహిళలకు ఆవకాశం ఇచ్చి, సినిమా పాటలు కాకుండా లలిత సంగీతం, పెళ్లి పాటలు, మంగళ హారతులు వాళ్ళ చేత పాడించి, ఆ పోటీలో నెగ్గిన వారికి  బహుమతులు ఇస్తే ఎంతైనా బాగుంటుంది. 
  2. ఇలా చెయ్యటం వల్ల, మన సాంప్రదాయం లో ఉన్న అనేకానేక అద్భుతమైన పాటలు ఇప్పటికి దాదాపుగా కనుమరుగయ్యి పోతున్న వాటిని మళ్ళి ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చి, ఆ పాత పాటలను పునరుద్ధరించిన వారు అవుతారు. 
  3. అనేకానేక పెళ్లి పాటలు, మంగళహారతులు మొదలైన వాటి  సాహిత్యం కూడా ఇప్పుడు పెద్దగా దొరకటం లేదు. మరికొంత కాలం జరిగితే, అసలు కనపడకుండా పొయ్యే ప్రమాదం ఉన్నది. మీరు ఈ కార్యక్రమం ద్వారా మన సాంప్రదాయక పాటలను ప్రోత్సహిస్తే, ఆ విధమైన సంగీతాన్ని పెంచి పోషించిన వారు  అవుతారు, ఈ పాటలు ఆ సంస్కృతీ మళ్ళి పునరుద్ధరించిన వారు అవుతారు.
 పై సూచనల వంటివి ఇప్పటికే మీకు వచ్చి ఉంటాయి ఆపైన మీకే ఆ ఆలోచన ఉండి ఉండవచ్చు. ఒక్కసారి ఆలోచించి వీలయితే పాడుతా తీయగా కార్యక్రమానికి కొంత కాలం పైన సూచించిన విధంగా కొత్త రూపు ఇచ్చి ప్రేక్షకులను అలరించమని నా కోరిక, నా ఆకాంక్ష ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియచేస్తున్నాను. 

ఇట్లు
శివరామ ప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారత్ 


శనివారం 4 ఫిబ్రవరి 2012

కిషోర్ కుమార్ తో ఇంటర్వ్యూ

 అవునండి అవును! కిషోర్ కుమార్ తో ఇంటర్వ్యూ. చేసింది  ఎవరంటారా! నేను కాదు లెండి.  అప్పట్లో (1985 కు ముందు) రేడియో హేమా హేమీలు, అప్పుడప్పుడే పెరుగుతున్న (కలుపు) మొక్క టి వి లో వాళ్ళు అంతకంటే కాదు. మరెవరు? మరింత చదవాలి, కిషోర్ కుమార్ ను ఎవరు ఇంటర్వ్యూ చేశారో తెలుసుకోవాలంటే!

కిషోర్ కుమార్ ఎంతటి అద్భత గాయకుడో అందరికీ తెలుసు. ఆయన నిజ జీవితం లో ఎన్నో మలుపులు ఉన్నాయి. షష్టిపూర్తి చేసుకోకుండానే "వెళ్ళిపోయిన" ఒక చక్కటి గాయకుడు. ఆయన మీద అనేక అపప్రధలు ఉన్నాయి, మాట వినడాని, తిక్క తిక్కగా ప్రవర్తిస్తాడని ఇంకా ఇలా ఎన్నో ఆయన్ను మనిషిగా అర్ధం చేసుకోలేని వాళ్ళు ప్రచారంలో పెట్టినవి.  ఎన్ని ఉన్నా సరే, అసలు విషయాలు చెప్పటానికి ఎప్పుడూ ఆయన మీడియా ముందుకు రావటం కాని ఇంటర్వ్యూలు ఇవ్వటం కాని జరగలేదట .   ఆయన ఇంటర్వ్యూలకు దూరం, మీడియాని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. అప్పట్లోనే ఇంకా ఆరోగ్యం పూర్తిగా కోల్పోని మీడియానే ఆయన అసహ్యించుకుని  దరిచేర నిచ్చేవాడు కాదు. కిషోర్ కుమార్ ఇప్పుడు జీవించి ఉంటే (ఎనభై ఏళ్ళు పైబడి ఉండేవారు) ఇప్పటి మీడియా వాళ్ళు చేసే అల్లరి చూసి ఏమనుకుని ఉండేవారో. ఎలా స్పందించేవారో  మరి!! ఊహించుకోవలసినదే కాని  చూసే అవకాశం లేకుండా పోయింది. 

మొత్తానికి, ఆయన ఇంటర్వ్యూలు ఎవ్వరికీ ఇచ్చేవారు కాదు. కాని చివరకు  వెంటపడగా, పడగా, విసిగి, "సరే నన్ను లతా మంగేష్కర్ ఇంటర్వ్యూ చేస్తే ఒప్పుకుంటాను" అన్నారట మన కిషోర్. అంటే ఇంటర్వ్యూ ఇవ్వాలని కాదు! ఎలాగో లతా మంగేష్కర్ వచ్చి తనను ఇంటర్వ్యూ చేయ్యోచ్చారా,  తప్పింకోవచ్చు  అని అయ్యి ఉంటుంది.


కాని, లతా మంగేష్కర్ ఎటువంటి భేషజాలు, అహంకారం చూపకుండా, ఆ టివి వారు (ఏ టి వి నో ఆ వీడియో చూస్తె తెలియటం లేదు) అబ్యర్ధనను  అంగీకరించి, కిషోర్ కుమార్ ను ఇంటర్వ్యూ చెయ్యటానికి అనే కంటే, కెమెరా ముందు ఆయనతో మాట్లాడటానికి ఒప్పుకున్నారు. 



ఎంతో మంది ఆవిడను ఇంటర్వ్యూ చేసారు. కాని లతా మంగేష్కర్ మరొకరిని ఇంటర్వ్యూ చెయ్యటం! ఒక చిత్రం, విచిత్రం కూడాను. ఈ చిత్రమైన ఇంటర్వ్యూ  అంటారో లేక వీడియో సంభాషణ అంటారో, ఏదైనా సరే మనకు కిషోర్ మాట్లాడటం హాయిగా చూడవచ్చు ఈ యు ట్యూబ్ వీడియోలో. చూసి ఆనందించండి.

ఈ వీడియోను మనకు అందించిన  mohdikram09కు అభినందనలు

 లతా కిషోర్ లు కలిసి ఎన్నెన్నో యుగళ గీతాలు పాడారు. ఇద్దరూ లబ్ధ ప్రతిష్టులే. ఒక ప్రముఖ వ్యక్తి  మరొక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చెయ్యటం, లేదా శ్రోతలు/ప్రేక్షకుల కోసం ఇద్దరు ప్రముఖు వీడియో సంభాషణ చెయ్యటం నాకు తెలిసి ఇదే ప్రధమం ఆ తరువాత మరేమన్నా జరిగాయేమో మరి తెలియదు. లతా  మంగేష్కర్ చేత , కిషోర్ కుమార్ ను ఇంటర్వ్యూ చేయించటం ఒక చక్కటి ప్రయోగం ఆలోచన కిషోర్ దే అయ్యినా, ఆయన దుస్సాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసినా ఆ టి వి వారికి అభినందనలు.

నెట్లో వెతుకుతూ ఉంటే కిషోర్ కుమార్ కు సంబంధించి ఆయన బంధువులు నడుపుతున్న ఒక చక్కటి వెబ్ సైట్ దొరికింది. అందులో ఎన్నెన్నో కిషోర్ కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. అన్నిటి కంటే చాలా అరుదైన ఒక ఇంటర్వ్యూ (వీడియో కాదు) ఉన్నది. ప్రముఖ జర్నలిస్ట్, కుష్వంత్  సింగ్ తరువాత అప్పట్లో ఎంతో ప్రాచుర్యం కలిగిన ఇల్లస్ట్రెటడ్ వీక్లీ కి సంపాదకత్వం వహించిన ప్రితేష్ నందీ కిషోర్ కుమార్ ను ఇంటర్వ్యూ చేసారు. అది కూడా కిషోర్  మరణానికి కొద్దిరోజుల ముందు అయ్యి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూను ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు. 

కిషోర్ కుమార్ పాటలు (ఇక్కడ క్లిక్ చెయ్యండి) 

అదే వెబ్ సైటులో కొద్దిగా అటూ ఇటూ తిరుగాడితే కిషోర్  గురించిన ఎంతో సమాచారం  ఉంటుంది. 

నాకు బాగా గుర్తు, అక్టోబర్ 1987  లో ఆయన మరణించారు. ఆరోజున సినిమా కార్యక్రమం లేకపోయినాసరే, దూరదర్శన్  వారు కిషోర్ తన సోదరులతో నటించిన "चलती का नाम गाडी" సినిమాను,  మధ్య  మధ్య వాళ్లకు తప్పనిసరి అయిన తమ వార్తలను చూపిస్తూనే   (హిందీ వార్తలు, ఆంగ్ల వార్తలు, పరమ పీడగా ఉండే పార్లమెంట్ వార్తలు. ఇప్పటిలాగా పార్లమెంట్ ప్రత్యెక చానెల్ అప్పట్లో లేదు) పూర్తిగా చూపించి కిషోర్ కు నివాళి అర్పించారు. 

విచిత్రం అప్పటికి ఒక పుష్కరం క్రితం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పా పెట్టకుండా కిషోర్ కుమార్ పాటలను  అనధికారికంగా బాన్ చేసి వివిధభారతిలో వెయ్యటం మానేశారు. కారణం, అప్పట్లో వాళ్ళ యువరాజు సంజయ్ గాంధీ (ఇప్పటి "మరో గాంధీ" లాగ, వీళ్ళ పేర్ల చివర గాంధీ తగిలించుకోవటం  ఎప్పటికి మానుతారో కదా!) సభల్లో పాడటానికి కిషోర్  నిరాకరించారుట.  ఆయన పాటలు వెయ్యకుండా వివిధభారతి రుచిపచి లేకుండా దాదాపు రెండు సంవత్సరాల  దీర్ఘకాలం "తీసుకున్నది". 


1977 లో ఎవరి సలహానో కాని, అప్పటి ప్రధాని, ఎన్నికలు జరిపి మరింత మెజారిటీతో తన యువరాజుకు పట్టాభిషేకం చెయ్యాలని కాబోలు, లేదా ఎన్నికల్లో ఓడిపోయి వాడి పీడ వదిలించుకోవాలానో  మరి, చరిత్రకారులే చెప్పాలి, ఎన్నికలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 

1977 మార్చ్ నెల పదహారో, పదిహేడో సరిగ్గా గుర్తు లేదు, ఎన్నికల ఫలితాలు రావటం మొదలయ్యాయి. ప్రజలందరూ రేడియోల దగ్గర (ప్రతి గంటకూ వచ్చే ప్రత్యెక ఎన్నికల వార్తల కోసం) కాచుకుని ఉన్నారు. ప్రతి పెద్ద పట్టణం లోనూ ఇంఫర్మేషన్ సెంటర్ వాళ్ళు, ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి ప్రజల కు ఎన్నికల సమాచారం అందిస్తూ  మైకుల్లో ప్రకటనలు కూడా చేసారు. 


రాత్రి పదకొండు, పదకొండున్నర అయ్యేప్పటికి ఎన్నికల ఫలితాల తీరు తెలిసిపోయింది, కాంగ్రెస్ ఘోర పరాజయం, జనతా పార్టీ గెలుపు ఖాయం అని. అప్పటికి ఇంకా ఎమర్జెన్సీ అమలులోనే ఉన్నది. అయినా సరే ఆకాశవాణి విజయవాడ వారు ఎన్నికల వార్తల ప్రసారాల మధ్య కిషోర్ కుమార్ పాటలు వెయ్యటం మొదలు పెట్టారు. ప్రజలందరూ కిషోర్ పాటలు మళ్ళీ విని ఆ ఎన్నికల వార్తలు వింటూ ఎంతో ఆనందించారు. అధికారికంగా ఇంకా ఎమర్జెన్సీ ఉండగా, కిషోర్ పాటలు వెయ్యద్దు అని వాళ్లకు "ఆర్డర్స్" ఉన్నా కూడా, ప్రజా తీర్పు చూసి, అప్పటి ఆకాశవాణి విజయవాడ వారు హాయిగా కిషోర్ పాటలు వేసి, ప్రజలతో మమేకమైన సంఘటన ఎప్పటికీ మరువలేను. అప్పటి ఆ అధికారులను అభినందించి తీరాలి. 


మొత్తం మీద కిషోర్ కుమార్ ప్రఖ్యాతి అటువంటిది. ఎన్నికల ఫలితాల్లో ఒక నియంత పాలన అంతానికి సూచనగా, గుర్తుగా ఆయన పాటలు చరిత్రలో  నిలిచిపొయినాయి. 


నాదగ్గర కిషోర్ కుమార్ తాను పనిచేసిన సంగీత దర్శకుల గురించి చెప్పిన సంగతుల ఆడియో ఉన్నది. అందులో ముఖ్యంగా సచిన్ దేవ్ బర్మన్ గురించి ఆయన గొంతును శైలిని అనుసరిస్తూ కిషోర్ అద్భుతంగా చెప్పారు. ఆ ఆడియో వెతికితే కాని దొరకదు! వెతుకులాట పూర్తయినాక మీ ముందుకు తీసుకువస్తాను.











శుక్రవారం 3 ఫిబ్రవరి 2012

సరదాగా చరిత్ర

సరదాగా అలా "స్టంబుల్" చేస్తూ ఉంటే, ఒక వెబ్సైట్ దొరికింది. ఆ వెబ్ సైట్ పేరు డిపిటీ ట అందులో చరిత్ర ను ఒక విన్నోత్న పద్ధతిలో చూపించారు. సాంకేతికంగా ఉన్న అవకాశాలు వాడుకుని తమ చరిత్రను అందరికీ తెలియచేసే ప్రయత్నం బాగున్నది.

ఈ కింది ఇచ్చిన నమూనాతో ఆ వెబ్ సైట్ చూడవచ్చు

గురువారం 2 ఫిబ్రవరి 2012

రామాయణ రంకట! భారతం బొంకట!! ఎలా??

"రామాయణం రంకు భారతం బొంకు" అనేటువంటి నానుడి ఆ మాటలు ఎందుకు వచ్చాయో కూడా తెలియకుండా వాడెయ్యటం దశాబ్దాలుగా జరుగుతున్నది. 

తరచి చూస్తె రామాయణంలో  రంకు ఎక్కడ ఉన్నది? ఒకవేళ అలాంటిది ఉండి ఉంటే అది రామాయణం అయ్యి ఒక ఇతిహాసంగా ఇన్నాళ్ళు ప్రజల మనస్సుల్లో పవిత్రంగా ఉండి ఉండేది కాదు, అనేకమంది కవులు కవయిత్రులు తమ తమ పద్ధతుల్లో రామాయణాన్ని వ్రాసి ఉండేవారు కాదు. 

మరి రామాయణం రంకు అనేయ్యటం ఎంతవరకూ మర్యాద, సమంజసం. 

ఇక భారతంలో బొంకు అంటే అబద్ధం ఉన్నదా? ఉండి ఉండవచ్చు. ఏక్కడో ధర్మరాజు తన గురువు గారైన ద్రోణుడిని క్రుంగదీసి దెబ్బ కొట్టటానికి ఒక అబద్ధం లాంటిది ఆడాడు అని ఒక అపప్రధ. అంత మాత్రాన మహాకావ్యం మొత్తం "బొంకు" అనేస్తే ఎలా.

ఈ సందేహాలన్నిటికి కూడా జవాబులు తెలుసుకోవాలని ఉన్నా ఎవరిని అడిగితె ఏమనుకుంటారో, "ఓశ్ ఈ మాత్రం తెలియదుటోయ్" అంటూ ఎద్దేవా చేస్తారేమో అని ఒక బిడియం. ఏతావాతా చెప్పొచ్చేది  ఏమంటే రామాయణం రంకు, భారతం బొంకు అని ఎందుకు వాడుకలోకి వచ్చిందో నాకు తెలియలేదు. 

కాని  తాడేపల్లి పతంజలి గారు ఈ విషయంలో చక్కటి వివరణ ఇచ్చి నా అనుమానాన్ని రామాయణం వరకు నివృత్తి చేసారు. ఇలా నాలాగా ఈ విషయంలో పైన చెప్పిన నానుడి  ఎలా వచ్చింది అని తెలియక కొట్టుమిట్టాడుతున్న  వారి కోసం, పతంజలిగారు చెప్పిన విశేషాలు ఆయన గొంతులోనే వినండి:

video

  తాడేపల్లి పతంజలి గారు  తెలుగు లెక్చరర్

ఒక్క ధర్మరాజు చెప్పాడు అన్న ఒక్క అబద్ధం ఉదహరిస్తూ  భారతం బొంకు అని అనేయ్యటం సమంజసం అనిపించటం లేదు. పైగా ధర్మరాజు అబద్ధం ఆడటం వల్ల మహాభారతం నడవలేదు. యుద్ధం లో చివరలో ఆయన ఒక అబద్ధం చెప్పి ఉండవచ్చు. 


కాబట్టి పైన ఉదాహరించిన నానుడిలో రెండో భాగం ఇంకా "క్లారిఫై" అవ్వవలసే ఉన్నది.







బుధవారం 1 ఫిబ్రవరి 2012

ఏది నిజం!

నిన్నటి  పేపర్లల్లో పై వార్త లోపలి పేజీల్లో ప్రముఖంగా ప్రచురించారు. సార్జెంట్ దేవరాజ్ సింగ్ గాడ్సే ను ఎంతో సాహసం చూపి పట్టుకున్నారని, ఆ పట్టుకున్న సాహస కార్యానికి ఆయనకు అశోకచక్ర 1952  లో బహూకరించారని. 

గాంధీని హత్య చెయ్యటం ఆ హత్య వెనుక ఉన్న కుట్ర ఎవరెవరు ఈ కుట్రలో భాగస్వాములు. ఎవరి పాత్ర ఎంతవరకు చివరకు ఎవరికీ శిక్ష పడింది వంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి పరిశోధన చేసి, పోలీసు, కోర్టు రికార్డ్లను కూడా ఉదాహరిస్తూ ప్రముఖ రచయిత మనోహర్ మల్గొంకర్ "The Men Who Killed Gandhi" అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం చాలా ప్రజాదరణ పొంది అనేకసార్లు పున:ముద్రణ చేయబడింది.

పై పుస్తకంలో గాడ్సే గాంధీ ని కాల్చిన తరువాత జరిగిన ఉదంతం గాడ్సే మాటల్లోనే ఈ కింది విధంగా ఇవ్వబడింది:

పిస్టల్ నా కుడి అరచేతిలోఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి 'నమస్తే' అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేసాను. ఆ తరువాత కాల్పులు జరిగాయి, తుపాకీ దానంతటే పేలిందనిపించింది. నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయం. గాంధీ గుండు దెబ్బ తగలగానే 'హెరామ్' అని కిందపడిపొయ్యారు.  నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని 'పోలీస్ పోలీస్" అని అరవటం మొదలు పెట్టాను.నాకు కావలిసింది అందరూ, నేను ఈ పని ముందుగావేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేసానని అనుకోవాలి, అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదు. అక్కడనుంచి తప్పించుకుని పారిపోవటానికి పయత్నించాననిగానీ, తుపాకీ వదిలించుకొవలని అనుకుంటున్నానని గాని అవరూ అనుకోకూడదు. తుపాకీతోసహా పట్టుబడతమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషందాకా, ఎవరూ కదలలేదు". నాథూరామ్ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపొయ్యే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు, అతన్ని నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. అక్కడ డి ఎస్ పి సర్దార్ జస్వంన్త్ సింగ్ చేత మొదటి సమాచార నివేదిక తయారు చేయబడింది. 


పై పుస్తకం ప్రకారం ఇప్పుడు పత్రికల్లో వ్రాసిన విధంగా గాడ్సేను వీరోచితంగా పట్టుకున్నది ఎక్కడ? మనోహర్ మల్గోంకర్  పుస్తకం లో ఉన్నది నిజమా, ప్రస్తుతం వార్తా పత్రికల్లో వచ్చినది నిజమా?

ఒక వార్త వ్రాస్తున్నపుడు ఆ విషయం మీద కూలంకషంగా పరిశోధన చేసిన పుస్తకం లో ఉన్న విషయాలను కూడా ఉదహరించవలసిన అవసరం ప్రస్తుతం మీడియాకు అనిపించక  పోవటం శోచనీయం.  లేదా వార్త వ్రాస్తున్న  చోటు ఎక్కువై, ప్రకటనలకు స్థానం తక్కువవుతున్నదని తీసుకున్న సంపాదక నిర్ణయమా!!!