23, సెప్టెంబర్ 2009, బుధవారం

అమరావతి కథలు

అమరావతి కధలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కధాసంపుటి . అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కధలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి.ఏ కథా కూడ ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో కాయితం (News Print) కరువు ఉండేది. ఆ కారణాన,ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడ రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడ ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు. చక్కని తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ, ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులం వ్రాసారు శంకరమంచి సత్యం .

ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

రచయిత శ్రీ సత్యం శంకరమంచి ఈ కథలు తను ఎలా వ్రాసారో, తన కథా సంపుటి మొదటిలో కృతజ్ఞతలులో ఈవిధంగా తెలియ చేసారు- "ఓ సాయంవేళ పురాణం సుబ్రహ్మణ్య శర్మ (అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక సంచాలకులు) ఉన్నట్టుండి మీరు అమరావతి కథలు అని ఎందుకు
రాయకూడదు? అన్నారు ఓ క్షణం అవాక్కయి పోయాను. ఎప్పటిమాట! పన్నెండేళ్ళ క్రితం జైపూర్ లో పని చేసేటప్పుడు అమరావతి కథల పేరిట కొన్ని కథలు రాద్దామని నోట్సు రాసుకోటమేమి, ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఈయన అడగటమేమి! తేరుకుని వరసగా నాలుగు కథలు ఆశువుగా చెప్పాను." ఆ తరువాత జరిగినది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అనగా 100 వారాలపాటు అమరావతి కథలు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ప్రచురించబడి ఎంతగానో ప్రజాదరణ, సాహిత్యవేత్తల గౌరవం పొందటం.

అమరావతి కథలు అన్న పేరు ఎందుకు?
రచయిత సత్యం శంకరమంచి పుట్టి పెరిగింది అమరావతి గ్రామంలో. ఆయన చిన్నతనంలో ఉన్న సామాజిక పరిస్థితులు, జీవన విధానాలు తో పాటు, ఆ ప్రాంత చరిత్రలో పరిశొధన చేసి వ్రాసిన కథలు అమరావతి కథలు. అన్ని కథలు అమరావతిలో జరిగినవే. ఊహాజనిత గ్రామమో లేక పట్టణమో తన కథలకు వేదికగా రచయిత సత్యం తీసుకోలేదు. తనకు తెలిసిన అమరావతి గ్రామం తరువాత పట్టణమయినా, తన కథలన్ని అక్కడజరిగిన సంఘటనలుగానే తీర్చి దిద్దారు. అందుకనే, ఈ కథలకు మరే పేరు నప్పదు, అమరావతి కథలే సరయిన పేరు. ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ అన్నట్టు, "అమరావతి కథలు అపురూప శిల్పాలు".
కధా వస్తువు
ఈ కథలలోని పాత్రలు రాజులున్నారు, స్వాములవార్లు ఉన్నారు, దొంగలు, భక్తులు, నాస్తికులు, దాతలు, లోభులు ఒకరేమిటి మనకు సామాన్యంగా ప్రతిరోజు తారసపడే వారందరూ ఈ కథలలో పాత్రలే. కథలన్నీ కూడ చాలా చిన్న చిన్నవి. మరింత ఉంటే బాగుండునేమో అనిపించేవే. ఎంతటి సామాన్య ప్రజలను పాత్రలు చేసి కథలు వ్రాసినా, కథాంశం మనిషిలోని ఔన్నత్యాన్ని మాత్రం వదిలి పెట్టదు.


కథలకు బాపు బొమ్మలు"బంగారానికి చక్కటి సువాసన అబ్బితే" అని సామెత చెప్పుకుని ఆశ పడే వారు, ఈ కథా సంపుటిలోని కథలను, వాటికి ప్రముఖ సినీ దర్శకుడు మరియు చిత్రకారుడయిన బాపు వేసిన బొమ్మలు చూసిన తరువాత ఈ సామెత నిజమవ్వచ్చు అనుకోవటంలో తప్పు లేదు. ప్రతి కథకు మొదట బాపు వేసిని బొమ్మ, కథను దాదాపు చెప్పకనే చెప్తుంది. కథ చదివిన తరువాత చూస్తే ఆ బొమ్మ తప్ప మరే బొమ్మయిన వెయ్యగలమా అని చూస్తే ఎమీ తట్టదు. కథలకు బొమ్మలు అంత బాగా సరిపొయ్యాయు. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన బుడుగు కు చక్కటి బొమ్మలు వేసి చిన్నలనే కాక పెద్దలనే ఎక్కువ అలరించిన చిత్రకారులు బాపు, ఈ కథలకు తన ప్రతిభకు పూర్తి తార్కాణంగా, బొమ్మలను వేసి చదువరులను అలరించాడు.

కథాసంపుటి ముఖ చిత్రం చూస్తేనె తెలుస్తుంది బాపు చిలిపితనం, నిండుతనం. రచయిత, పార్వతీ పరమేశ్వరుల సరసన కూర్చుని, చాలా సావకాశంగా, వారికి తన కథలను వినిపిస్తున్నట్టు, తన ఆజ్ఞకానిదే చీమనుకూడ కుట్టనివ్వని పరమేశ్వరుడు, పార్వతీ సమేతుడయి చిద్విలాసంగాను,నందీశ్వరుడు మరియు గోపన్నలు పారవశ్యంగానూ, వింటున్నట్టు చిత్రీకరించారు. అమరావతిలోని అదిదేవుడయిన అమరేశ్వరుడే దిగివచ్చి ఈ కథలు వింటున్నాడని స్పురింప చేశారు.

అమరావతి కథల జాబితా
1.వరద
2.సుడిగుండంలొ ముక్కుపుడక
3.పుణుకుల బుట్టలో లచ్చితల్లి
4.రెండుగంగలు
5.బంగారు దొంగ
6.ముక్కోటి కైలాసం
7.అరేసిన చీర
8.శివుడు నవ్వాడు
9.ఒక రోజెళ్ళి పోయింది
10.హరహర మహాదేవ
11.ధావళీ చిరిగిపోయింది
12.రాగిచెంబులో చేపపిల్ల
13.అద్గద్గో బస్సు
14.పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి
15.పందిరిపట్టి మంచం
16.అన్నపూర్ణ కావిడి
17.చెట్టు కొమ్మనున్న కథ
18.అఖరి వేంకటాద్రినాయుడు
19.ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే
20.పచ్చగడ్డి భగ్గుమంది
21.లేగదూడ చదువు
22.ఆవతలొడ్డు పొంగింది
23.మే!మే! మేకపిల్ల
24.కాకితో కబురు
25.తులసి తాంబూలం
26.భోజన చక్రవర్తి
27.నావెళ్ళిపోయింది
28.నీరు నిలవదు
29.ఎంగిలా?
30.బాకీ సంతతి
31.మాయ
32.నివేదన
33.ధర్మపాలుడు
34.నాన్న-నది
35.కీలుగుర్రం
36.అచ్చోసిన ఆంబోతులు
37.వయసొచ్చింది
38.లంకల్లపుట్టింది లచ్చితల్లి
39.ఇద్దరు మిత్రులు
40.పున్నాగ వాన
41.ఖాళీ కుర్చీ
42.రాజహంస రెక్కలు విప్పింది
43.ఎవరా పోయేది?
44.ముద్దులల్లుడు
45.ముద్దేలనయ్య - మనసు నీదైయుండ
46.వంశాంకురం
47.బలి
48.అటునుంచి కొట్టుకురండి
49.మనసు నిండుకుంది
50.అబద్ధం - చెడిన ఆడది
51.దొంగలో? దొరలో?
52.కానుక
53.తల్లి కడుపు చల్లగా
54.విరిగిన పల్లకి
55.నావెనుక ఎవరో....
56.సిరి - శాంతి
57.గుండె శివుడి కిచ్చుకో
58.సంగమం
59.అంతా సామిదే? నేనెవర్ని ఇవ్వడానికి
60.మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ
61.అంపకం
62.నిండుకుండ బొమ్మ
63.గాయత్రి
64.మౌన శంఖం
65.అదుగో - అల్లదుగో...
66.అప్పడాల అసెంబ్లీ
67.మాట్టి..ఒఠిమట్టి..
68.వేలం సరుకు
69.నిలబడగలవా?
70.సాక్షాత్కారం
71.ఎవరికీ చెప్పమాక!
72.జ్ఞానక్షేత్రం
73.ఏక కథాపితామహ
74.తృప్తి
75.ఆగని ఉయ్యాల
76.తెల్లవారింది
77.తంపులమరి సోమలింగం
78.ఏడాదికో రోజు పులి
79.దూరంగా సారంగధర
80.అమావాస్య వెలిగింది
81.త, థి, తో, న
82.స్తంభన
83.పట్టుత్తరీయం
84.మృత్యోర్మా...
85.అంతా బాగానే ఉంది
86.దీపం - జ్యోతి
87.కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి
88.పూల సుల్తాన్
89.పక్క వీది జన్మంత దూరం
90.టపా రాలేదు బొట్టు చెరగలేదు
91.భొజనాంతే...
92.ఓ నరుడా! వానరుడా!
93.బిందురేఖ
94.నేనూ మేల్కొనే వున్నాను
95.ఏడుపెరగనివాడు
96.అరుగరుగో సుబ్బయ్య మేష్టారు
97.ప్రణవమూర్తి
98.సీతారామాభ్యాం నమ:
99.శిఖరం
100.మహా రుద్రాభిషేకం



అభిప్రాయాలు
ముళ్ళపూడి వెంకటరమణ
-"అమరావతి కథలు అపురూప శిల్పాలు....ఊత్తమశ్రేణి ఆధునిక కధావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే.....వేయిపుటల వేయిపడగల కథలో సత్యనారాయణగారు చిత్రించిన తెలుగుజీవన విశ్వరూపానికి మూడు వాక్యాలో-మూడు మాటలలో ఈ కథలు అద్దం పట్టి చూపాయి......త్యాగరాజస్వామి - కీర్తనలతో, స్వరాలతో, అక్షరాలతో, స్వరాక్షరాలతో, రాగభావాలతో కీర్తనలు అల్లి రామచంద్రుడిని అలంకరించుకున్నట్టే ఈయన అంత జాగ్రత్తగా, ప్రేమతో అమరేశ్వరుడిని, ఆయనను సేవించుకునే తెలుగువాడిని అర్చించారు.....పట్టరాని అనందం కొద్దీ మనసులో వెయ్యి పేజీలు రాసుకున్నాను. చదివిన ప్రతివాళ్ళూ పదివేల పేజీలు రాసుకోగలరు కూడా......తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండజ్యోతి పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివి తీరని అమృత కలశం, అక్షయమైన అక్షరపాత్ర. శిల్ప సౌదర్యానికి పరమావధి, పపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం.


వావిలాల సుబ్బారావు".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు"
**************************************************************

ఈ వ్యాసం ఇంతకు ముందు, తెలుగు వికీపీడియాలో నేను వ్రాసినది, ఇక్కడ పున:ప్రచురణ. చక్కటి ఈ అమరావతి కథలను అన్నిటిని సమీక్షాపూర్వకంగా సంగ్రహంగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను. కొన్ని ఇప్పటికే తెలుగు వికీలో వ్రాసాను, వాటిని నా బ్లాగులో పున:ప్రచురించి, మిగిలిన కథలగురించి కూడా ఇక్కడే వ్రాస్తాను.
**************************************************************

**************************************************************

4 కామెంట్‌లు:

  1. ‘అమరావతి కథలు’ అచ్చ తెలుగు కథలు. కృష్ణా నదీ తీరంలో ఊపిరి పోసుకున్న సజీవ అక్షర కావ్యాలు.

    ఈ వంద కథల్లో ఎప్పటికీ గుర్తుండేవి ఎన్నో. వాటికి బాపు వేసిన బొమ్మలు కూడా మరపురావు.

    ‘భోజన చక్రవర్తి’ కథ ఎంత వినోదభరితంగా ఉంటుందో అంతగా చివర్లో విషాదం మనసును మెలితిప్పుతుంది.

    మంచి పుస్తకం గురించి సమగ్రంగా, వివరంగా రాశారు. అభినందనలు!

    రిప్లయితొలగించండి
  2. బాగుందండీ వ్యాసం.
    మీరు పుస్తకం.నెట్ కు రాయగలరా?

    రిప్లయితొలగించండి
  3. నిత్య జీవితంలో ఎక్కడో ఒక చోట ఈ కథల్లో పాత్రల్లాంటి మనుషులు మనకి కనిపిస్తూనే ఉంటారు.. ప్రతి కథా దేనికదే సాటి.. బాపు బొమ్మలు లేకుండా ఈ కథలని ఊహించలేం.. మరోసారి చదవాలి అమరావతి కథలని...

    రిప్లయితొలగించండి
  4. మాది అమరావతి. మా ఇల్లు శివాలయం నుంచి అర నిమిషం దూరం. మా వూరి గురించి రాసినందుకు ధన్యవాదాలు. మా వూరు ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సివుంది. ముఖ్యం గా కృష్ణా నీటిని సరిగా ఉపయోగించటం లేదు. టూరిజం కూడా పెంచాల్సి వుంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.