20, నవంబర్ 2009, శుక్రవారం

చందమామ సంపాదకులు శ్రీ కొడవటిగంటి


శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
చందమామ అభిమానులుగా మనం ఇన్నాళ్లూ చిత్రా, ఆచార్య, శంకర్, వపా వంటి అలనాటి అపరూప చిత్రకారుల జ్ఞాపకాలను తల్చుకుంటున్నాం, రాస్తున్నాం, సమాచారం పంచుకుంటున్నాం. కాని చందమామ అనధికారిక సంపాదకుడిగా 30 ఏళ్లపాటు అవిశ్రాంతంగా కృషి చేసి చందమామకు రూపురేఖలు దిద్దిన ఓ గొప్ప మనిషి పాత్ర గురించి తెలుసుకున్నది తక్కువేనేమో అనిపిస్తుంది.

కథా సాహిత్య చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం ఓ పత్రిక సంపాదకీయ బాధ్యతలు స్వీకరించి అజ్ఞాతంగా, నిరామయంగా, నిర్విరామంగా కృషి చేసిన ఘటనలు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఉంటాయి. ఆయన కుటుంబరావు గారు. చందమామ అనధికారిక సంపాదకులుగా పనిచేసినవారు. చనిపోయేంతవరకు తాను ఏ బాధ్యతలలో ఉన్నది కూడా బయటి ప్రపంచానికి తెలియనంత అజ్ఞాత వాసంలో ఆయన ఉండిపోయారు.

కథకుడిగా, వ్యాసరచయితగా, సాహిత్యకారుడిగా, నవలాకారుడిగా గల్పికా కర్తగా, సైన్స్ వ్యాసాల రచయితగా ఆయనను ఈ ప్రపంచం చాలా కాలంగా గుర్తు పెట్టుకునే వస్తోంది. కానీ ఇన్ని వ్యాపకాల మధ్య, వ్యాసంగాల మధ్య 30 ఏళ్ల పాటు తాను జీవిక కోసం చేస్తూ వచ్చిన ఓ అద్భుత కృషిని ఈ ప్రపంచం మర్చిపోయిందేమో..

అలా అని ఈ సుదీర్ఘ అజ్ఞాతవాసంలో తాను చేసిన, చేస్తూ వచ్చిన పని చిన్నదేం కాదు. తెలుగు కథా ప్రపంచాన్ని ఉద్దీప్తం చేసిన ఓ గొప్ప చరిత్రలో ఆయన కీలక భాగస్వామి. భారతీయ కథా సాహిత్య వినీలాకాశంలో చందమామను సమున్నతంగా నిలిపిన ఓ అద్భుత మానవ కృషిలో ఆయనది శిఖరస్థానం.

గాంధీగారి శైలిగా చక్రపాణి గారి వంటి చండశాసనులనుంచే పొగడ్తలందుకున్న రచనాశైలి ఆయనకే స్వంతం. చందమామ స్వర్ణయుగంగా చరిత్రకెక్కిన ఆ మూడు దశాబ్దాల కాలంలో చందమామలో ప్రచురించిన ప్రతి కథను ఆయన శ్వాసించారు. చందమామ ప్రతిపేజీలో, ప్రతి కథలో, ప్రతి దిద్దుబాటులో ఆయన మార్కు జగత్ప్రసిద్ధం.

కాని చందమామకు ఆయన అందించిన “గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్” చరిత్ర పుటలలో మరుగునపడింది. 1940-1960ల నాటి కోస్తా మధ్యతరగతి సామాజిక జీవితానికి సాహిత్య రూపమిచ్చిన మేటి రచయితగా, శాస్త్రసాంకేతిక విషయాలపై మేటి రచనలు చేసి మెప్పు పొందిన పాపులర్ సైన్స్ రచయితగా, సంగీతంలో అభినివేశం కలవాడిగా, సినీ విమర్శకుడిగా ఇలా సాహిత్యానికి చెందిన పలు విశేషణాలతో ఆయనను ప్రపంచం గుర్తు పెట్టుకొందే కాని చందమామకు ప్రాణప్రతిష్ట చేసిన ఆయన సంపాదక ప్రతిభను ఈలోకం తగినంతగా గుర్తించలేదనే అనుకోవాలి.

ఇప్పుడు శత జయంతి ఉత్సవ సందర్భంగా కూడా అక్కడక్కడా కొన్ని చోట్ల ఆయన చందమామలో పనిచేశారట వంటి పొడిపొడి మాటలు చెప్పి, రాసి తప్పించుకుంటున్నారు తప్పితే చందమామతో ఆయన అనుబంధం గురించి ఎవరూ పెద్దగా ప్రస్తావన తేలేదు.

చందమామ ప్రియులు, శ్రీ రోహిణీ ప్రసాద్ గారి వంటి వ్యక్తులు మాత్రమే చందమామతో కుటుంబరావు గారి సంబంధం గురించి గత కొన్ని సంవత్సరాలుగా రాస్తూ వచ్చారు తప్పితే ప్రధాన స్రవంతికి చెందిన వారు, పేరు మోసిన విమర్శకులు, సాహిత్య సంస్థలు చందమామతో కుటుంబరావు గారి బంధం గురించి దాదాపుగా విస్మరించారనే చెప్పాలి. చందమామలో తొలినుంచి ఎవరు ఏ పనులు చేసారు అనే కనీసపాటి వివరాలను కూడా బయటి ప్రపంచానికి తెలియనీకుండా చేసిన చందమామ అలనాటి యాజమాన్యం పాలసీ కూడా ఇందుకు తోడయిందేమో చూడాలి.

అందుకే కుటుంబరావు గారి ఈ శతజయంతి ఉత్సవ సందర్భంగా అయినా సరే, మళ్లీ ఓసారి ఆయన దార్శనికతకు నిదర్శనంగా నిలిచిన ఇతర సాహిత్య ప్రక్రియలను అలా పక్కన బెట్టి -వాటిపై చాలా మందే రాస్తున్నారు కదా- చందమామ సంపాదకుడిగా ఆయన మిగిల్చిపోయిన ఓ గొప్ప ట్రెండ్‌ను మరోసారి మననం చేసుకుందాం.

ఈ క్రమంలో దీన్నొక స్వంత రచనగా కాక చందమామ ఉజ్వల చరిత్రలో కుటుంబరావుగారి పాత్ర, ప్రభావాల గురించి ఇప్పటికే చందమామ అభిమానులు, చందమామ ప్రియులు పేర్కొంటూ వచ్చిన పలు అంశాల సమాహారంగా మాత్రమే ఈ కథనాన్ని చూస్తే మంచిదనుకుంటున్నాను.

కొడవటిగంటి శ్రీ రోహిణీ ప్రసాద్(కుటుంబరావుగారి కుమారుడు)జ్ఞాపకాలు


పిల్లల మాసపత్రికగా దాదాపు అరవయ్యేళ్ళుగా అగ్రస్థానంలో ఉన్న “చందమామ”కు మా నాన్న కొడవటిగంటి కుటుంబరావుగారు “పేరు లేని” ఎడిటర్‌గా చాలా ఏళ్ళు పని చేశారు…. “చందమామ” తొలి సంచిక 1947 జూలైలో విడుదలైంది. ఆ పత్రిక పూర్తిగా చక్రపాణిగారి మానసపుత్రిక. తెనాలిలో ఆయనకు మా నాన్నగారితో చిన్నతనం నుంచీ పరిచయం ఉండేది. “చందమామ” ప్రారంభించినప్పుడు మా నాన్న ఆంధ్రపత్రికలో పనిచేస్తూ ఉండేవారు.

అందువల్ల “చందమామ” పెట్టినప్పటినుంచీ చక్రపాణిగారు పిలుస్తూనే ఉన్నప్పటికీ 1951దాకా అందులో చేరలేదు. పైగా ఎక్కువ జీతం కూడా ఆఫర్‌ చేశారు. అప్పట్లో నాలుగు రాళ్ళ కోసం తరుచుగా ఉద్యోగాలు మారడం మర్యాదగా అనిపించేది కాదేమో….. “చందమామ” తొలిసంచికల్లో పిల్లల ముద్దుమాటలుండేవి. “చూశారా పిల్లలూ”, “ఏమోయి నేస్తం” వగైరా. ఇది చక్రపాణిగారికి అంతగా నచ్చినట్టులేదు.

మా నాన్నగారికి బాధ్యత వప్పచెప్పాక కథల తీరు మారిపోయింది. కథలన్నీ సాఫీగా, పెద్దల భాషలోనే రావడం మొదలైంది. క్లుప్తంగా, ఏ విధమైన యాసా చోటు చేసుకోకుండా సూటిగా సాగే మా నాన్న శైలిని చక్రపాణిగారు “గాంధీగారి భాష” అని మెచ్చుకునేవాడట. ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు.

దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో దాసరి సుబ్రహ్మణ్యం గారొకరు. మొదటి రంగుల సీరియల్‌ ఆయన స్పెషాలిటీ. తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణిగారికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్‌ తగ్గింది. దాంతో దాసరివారికి మళ్ళీ పనిపడింది. చక్రపాణిగారి టేస్టూ, పాఠకుల టేస్టూ వేరువేరని రుజువయింది.

ఇక తక్కిన కథలూ, శీర్షికలూ అన్నీ మా నాన్నే రాసేవారు. రచయితలుగా పత్రికలో మాత్రం కల్పితమైన పేర్లు పడేవి. పత్రికకు పేరు రావాలి తప్ప రచయితలకు పేరు రాకూడదనేది చక్రపాణిగారి సిద్ధాంతం. అదే జరిగింది కూడా. కొద్దిమంది రచయితలూ, జర్నలిస్టులూ, పరిచయస్థులూ తప్ప తక్కినవారికి ఎవరు రాస్తున్నారో తెలిసేదికాదు. మా నాన్న కూడా తన ఒరిజినల్‌ రచనలేవీ వెయ్యలేదు. మొత్తం మీద “చందమామ”కు త్వరలోనే ఎనలేని ప్రజాదరణ లభించసాగింది.

మొదట్లో పాఠకులు పంపిన కథలవంటివి దాదాపుగా ఏవీ ఉండేవి కావు. ఒకవేళ ఎవరైనా స్వంతంగా కథలు రాసి పంపినా అందులో సెలెక్టయిన వాటిని అవసరమనిపిస్తే “మెరుగుపరిచి” మా నాన్న తిరగరాసేవారు. మరే భాషలోనైనా ఎవరైనా కథ పంపితే అది క్లుప్తంగా ఏ ఇంగ్లీషులోకో అనువాదం అయి వచ్చేది. అది నచ్చితే తెలుగులో తిరగరాయబడి, మళ్ళీ మామూలు ప్రోసెస్‌ ద్వారా అన్ని భాషల్లోకీ తర్జుమా అయేది.

ఈ తతంగమంతా జరుగుతున్నట్టు ఎవరికీ తెలియకపోయినా తాము పంపిన కథ తమ పేరుతోనూ, కొంత పారితోషికంతోనూ, తాము పంపినదానికన్నా మెరుగైన రూపంలోనూ అచ్చయేది కనక ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.

“చందమామ” ఆఫీసులో అన్ని ప్రపంచదేశాల జానపద కథలూ ఉండేవి. ఏ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకూ సరిపోయేట్టు మలిచి రాయడం మా నాన్నగారి పని. అంతేకాక ఒరిజినల్‌ బేతాళ కథలన్నీ అయిపోయాక మామూలు కథలను ఎంపిక చేసి, అందులోఒక క్విజ్‌ ప్రవేశపెట్టి, దానికి విక్రమార్కుడి చేత సమాధానం చెప్పించడం ఆయనకు ఒక కసరత్తుగా ఉండేది. బేతాళ కథలు మొత్తం ఇరవై అయిదేనని చాలామందికి తెలియకపోవచ్చు కూడా. కథల క్వాలిటీ ఎంత బావుండేదంటే విశ్వనాథ సత్యనారాయణగారు క్రమం తప్పకుండా ప్రతి సంచికనూ తెప్పించుకుని చదివేవారట.

ఇక సర్క్యులేషన్‌ విషయంలో హిందీ ఎడిషన్‌ అన్నిటికన్నా ఎక్కువగా అమ్ముడయేది. 1966లో మా కుటుంబమంతా ఢిల్లీ, బెనారస్‌ మొదలైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా నాన్నకు తెలుగు రచయితగా కాక హిందీ చందమామ వల్ల ప్రతి చోటా ఘనస్వాగతం లభించింది. 1957 ప్రాంతాల్లో “చందమామ” ఇంగ్లీష్‌ ఎడిషన్‌ కూడా వేశారు. అది అన్ని విధాలా తక్కిన సంచికల్లాగే ఉండేది. అదంతా మా నాన్నగారే రాసేవారు.

1952 ప్రాంతాల్లో నాగిరెడ్డిగారు కినిమా అనే సినీ మాసపత్రికను మొదలుపెట్టారు. అందులో కూడా శీర్షికలూ, వ్యాసాలూ అన్నీ మా నాన్నగారే రాసేవారు. అది రెండు మూడేళ్ళకే ఆగిపోయింది. రంగులు లేకపోయినా కంటెంట్‌ విషయంలో అది ఆ తరవాత వచ్చిన విజయచిత్ర కన్నా ఎన్నో రెట్లు బావుండేది. అప్పుడే పైకొస్తున్న నటీనటులూ, సినీ గాయనీ గాయకులూ అనేకమందితో మా నాన్న జరిపిన ఇంటర్వ్యూలు ఇప్పుడు చదవటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

తెలుగులో మాట్లాడడం అలవాటైన మా పిల్లలవంటివారికి “చందమామ” చదువుతూ ఉంటే భాషతో మరికొంచెం పరిచయమూ, తెలుగు నుడికారమూ పట్టుబడతాయని నా ఉద్దేశం. పిల్లలను తెలుగు చదవమని ప్రోత్సహించడానికి “చందమామ” మంచి సాధనమని నాకనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉంటూ ఇంటర్నెట్ మీద తెలుగు టీవీ వార్తలను చూస్తున్న నాకు ఆంధ్రప్రదేశ్‌లోనే తెలుగు మరిచిపోతున్నారన్న వాదనలో కొంత నిజం లేకపోలే దనిపిస్తోంది. పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాటు తెలుగు చదవడం రావాలంటే “చందమామ” వంటిది చదవడం ఒక్కటే మార్గమేమో.

“చందమామ” మొదలుపెట్టినప్పుడు తెలుగుభాషను గురించిన ఇటువంటి భయాలేవీ ఉండేవి కావుగాని పిల్లలకు ఆరోగ్యకరమైన సాహిత్యం అందించాలనే ఉద్దేశం మాత్రం ఉండేది. భూతప్రేతాల గురించిన భయాలు తగ్గడానికీ, జానపద సాహిత్యంలో తప్పనిసరిగా ఉండే కొన్ని మూఢవిశ్వాసాలు మితిమీరకుండా చూడడానికీ గట్టి ప్రయత్నాలే జరిగాయి. సర్కార్‌ వంటివారి చేత ఇంద్రజాలం గురించిన వివరాలను ప్రచురించడంతో పిల్లలకు కొన్ని కిటుకులు తెలుస్తూ ఉండేవి. పురాణాల్లో కూడా వాల్మీకి రామాయణాన్నే అనుసరిస్తూ, ఇతర రామాయణాల వెర్రిమొర్రి అంశాలేవీ కథలోకి రాకుండా చూసే ప్రయత్నం జరిగింది.

1969లో బాలసాహిత్యం గురించి రాసిన ఒక వ్యాసంలో మా నాన్నగారి దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన లెక్కన “బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లలలో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. ఇది “చందమామ” కథల్లో ఎక్కువగా కనబడుతుందని అందరికీ తెలిసినదే….”


శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి చందమామ జ్ఞాపకాలు


శ్రీ రావి కొండలరావు (ప్రముఖ నటులు,సినీ చరిత్రకారులు)

చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన -కుటుంబరావుగారు- అగ్రగణ్యుడు. 1952, జనవరి 1 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటాని ఎంతో కృషి సలిపాడు. విజయచిత్ర పత్రిక ఆరంభం కాబోతున్న రోజుల్లో నేను ఆంధ్రజ్యోతి కి సినిమా కాలం రాస్తూ ఉండేవాడిని. మా వాళ్లు సినిమా పత్రిక ఆరంభిస్తున్నారు. మీరేమైనా రాస్తారా? అని అడిగారు ఒకసారి. తప్పకుండా అన్నాను. ఆయనే నన్ను తీసుకువెళ్లి ప్రొప్రయిటర్లకి పరిచయం చేసి చెప్పారు. నేను చందమామ పబ్లికేషన్స్ లోకి రావడానికి ఆ విధంగా ఆయన కారకులైనారు. పదిహేను సంవత్సరాలపాటు పక్కపక్కగా ఉన్న ఆఫీసుల ద్వారా మా పరిచయాలు, స్నేహాలు మరింత పెరిగాయి.

చందమామ ప్రధాన సంపాదకుడిగా ఆయనకున్న స్థాయి, గౌరవం ఎనలేనివి. అందరికీ ఆయనంటే గౌరవం, భక్తీ, తన స్థాయికి ఉండవలసిన కనీసపు అహంకారం లేని మనిషి ఆయన. సినిమా మీద ఏదైనా వ్యాసం తడితే రాసుకొచ్చి నాకిస్తూ ఏమండీ మీ పత్రికలో వేసుకుంటారా, చూడండి అనేవారు నాకు దిమ్మ తిరిగేలా. ఆయన దగ్గరికి కథలు పట్టుకు వెళ్లిన వాడిని, ఆయన ద్వారానే చందమామ పబ్లికేషన్స్‌లోకి వచ్చిన వాడిని, ఎన్నే అడిగి తెలుసుకుంటున్న వాడిని, ఒకసారి కొండలరావును రమ్మను అని కబురు చేసి ఆ వ్యాసం నాకు ఇచ్చి మీ పత్రికలో వెయ్యండి అని చెప్పగల హక్కు అధికారం ఉన్న మనిషి ఆయన. రమ్మంటే వెళ్లమూ! వెయ్యమూ!

(రావి కొండలరావు -కౌముది అక్టోబర్ 2007 సంచికనుంచి)

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు (ప్రముఖ సంగీత దర్శకులు)జ్ఞాపకాలు


వాహినీ, విజయావారికి అత్యంత సన్నిహితుడుగాను, చందమామ, యువసంపాదక వర్గంలో నాగిరెడ్డి, చక్రపాణిలతో సగౌరవంగా ఉంటూ ఉండి కూడా ఆయన సినిమాలకు రాసినదాని కన్నా ఆ పత్రికలకు ఇంకా భారతి వంటి ఇతర పత్రికలకు కూడా ఎన్నో కథలు రాసాడు. తన పేరుతోను, మారుపేర్లతోను రాసినా, కొడవటిగంటి తర్కబద్దమైన వాక్యరచన, కథాకథన పద్ధతి, కొన్ని రకాల పాత్రల మూసపోతా – ఇది కొడవటిగంటి రచనే అని తెలిసిపోయేటంతటి వ్యక్తిగత శైలి ఆయనది. ఆయన వ్రాసిన మానవ సమాజ పరిణామ చరిత్ర చాలా హేతుబద్దంగాను, కాదనడానికి వీలు లేనట్లుగాను ఉంటుంది.

(బాలాంత్రపు రజనీకాంతరావు – కౌముది.నెట్ అక్టోబర్ 2007)

మాధవపెద్ది గోఖలే గారి జ్ఞాపకాలు


పిల్లల మాసపత్రిక ‘చందమామ’ను కూడా చక్రపాణి అప్పుడే ప్రారంభించారు. అప్పటికి ఇంకా ఏ ఉద్యోగమూ దొరకని కక్కయ్య 1949లో ఈసారి ‘ఆంధ్ర దినపత్రిక’లో చేరి, 1952 నాటికి ‘చందమామ’కు ఎడిటరుగా చేరాడు. ఆయన జీవితంలో ఈ ఒక్క ఉద్యోగమే 1952 నుండి 1980 వరకు స్థిరంగా నిలిచిపోయింది. ఆయన చాలా గట్టి స్వతంత్రభావాలు గలవాడు. తన రచనల విషయంలో, ప్రత్యేకించి జీతండబ్బుల కోసం ఏనాడూ తన అభ్యుదయ పంథానుండి దిగజారలేదు.

ఆయన భావాలు తన ఉద్యోగాలు ఊడేందుకు ఎక్కువచోట్ల పనిచేసినై. ‘నాకు ఉద్యోగాలు అచ్చిరావు’ అని ఆయన అన్నాడంటే రచయితగా తన స్వాతంత్ర్యానికీ, చేసే ఉద్యోగాలకూ వైరుధ్యాలొస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఆయన సత్ఫలితాలకు “ఆంధ్రవారపత్రిక’ తరఫున కక్కయ్యకో చిన్న యోగ్యతాపత్రం లభించింది. ‘మీ హయాంలో వారపత్రిక కవరుపేజీ చాలా ముచ్చటగా ఉంటున్నదండీ’ అన్నదే ఆ పత్రం. అంటే పత్రిక విలువా (పాఠకుల లేఖల్లో ఈ విషయం వ్యక్తమయేది), సర్కులేషనూ పెరగటం పరిగణనలోకి రాక, ఆయన మెరుగుపరచింది కేవలం అట్టమీద బొమ్మ మటుకేనని చెప్పటం. కక్కయ్య వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.


కొడవటిగంటి కుటుంబరావు–జీవితపు పరవళ్లు">

శ్రీ శివరాం ప్రసాద్(సాహిత్య అభిమాని)జ్ఞాపకాలు

చక్రపాణి-నాగిరెడ్డి గార్లచే 1947లో మొదలు పెట్టబడినప్పటికీ, 1952లో కుటుంబరావుగారు సంపాదకుడిగా ఆయన ఆద్వ్యర్యం లోకి చందమామ (ఒకప్పటి ప్రముఖ మాస పత్రిక) వచ్చేవరకు, ఒక అనామక పత్రికగానే ఉన్నది. సంపాదకుడిగా ఆయన పేరును చందమామ వారు ఎప్పటికి ఆ పత్రికలో ప్రచురించకపోయినా, కుటుంబరావుగారు తీసుకున్న శ్రధ్ధ (చక్రపాణి నాగిరెడ్డిగార్ల సహకారంతో) చందమామను తెలుగు పత్రికా లోకంలో తలమానికంగా నిలబెట్టింది. ఆయన చందమామను నడిపిన కాలం 1952 నుండి 1980లో ఆయన మరణించేవరకు, ఆ పత్రికకు స్వర్ణయుగమే.

చిన్న పిల్లల మనస్సులు ఎంతో సున్నితంగా ఉండి, విషయాలను ఎల్లకాలం గుర్తు పెట్టుకునే దశలో ఉంటాయి. ఆ విషయం బాగా తెలిసిన కో.కు గారు, ఆ చిన్నారి పాఠకులకోసం అన్ని కథలను, తన శైలిలో చెక్కి కథా శిల్పాలుగా చేసి వదిలేవారు. ప్రతి కథ (ఎవరు వ్రాసినా సరే) కుటుంబరావుగారి చేతిలో పడి ఆణిముత్యంగా మారిపొయ్యేది. ఇవ్వాల్టికి పాఠక ఆదరణ కోసం వెంపర్లాడుతూ ఆ పత్రిక దశాబ్దాలనాటి కథలనే మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణ చేస్తోంది అంటే ఆ కథల గొప్పతనం అర్ధం చేసుకోవచ్చును

అంతర్లీనంగా ప్రతి కథలోను, ఒక నీతి సూత్రం, సంభాషణల్లో తర్కం, మూఢనమ్మకాలను మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించటం వంటివి ఆ రోజులలో చందమామ చదువుతూ పెరిగిన పిల్లలకు (మూదు నాలుగు తరాలవరకు) దొరికిన పెన్నిధి, వారి జీవితాలను ప్రభావితం చేసి నలుగురూ కలసి జీవించే సరైన పధ్ధతిలోకి మళ్ళించినాయి. ప్రభుత్వం వారు పిల్లలకు ఇది మంచి, ఇది కూడదు అని నిర్దేసించిన పాఠ్య పుస్తకాలకంటే, భాషా పరంగాను, అలోచనా పరంగాను, చందమామ కథలు అప్పటి పిల్లలకు (అనేకమార్లు పెద్దలకు కూడ) చక్కటి “చదువు” నేర్పాయి.

చందమామ పత్రికకు ఆయన దిద్దిన మెరుగులలో అన్నిటికన్నాఎక్కువగా తళతళలాడేది బేతాళ కథల శీర్షిక , అసలులో కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం,

తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు (పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం, తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా కుటుంబరావుగారు నభూతో నభవిష్యతిగా రూపొందించారు ఈ బేతాళ కథలు. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ఉన్నది మన కుటుంబరావుగారే.

ఈ మొత్తం ప్రక్రియ తానేదో గొప్పపని చేస్తున్నాని అనుకుంటూ చెయ్యలేదు. తన ఉద్యోగ ధర్మంగానే చేశారు.

మీకు తెలుసా! ఒక మహా రచయిత శతజయంతి ఈరోజు

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు వ్యాఖ్యలు


సాహిత్యం నుండి ప్రజల్నీ, రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది.
నియంతల మీదా, నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు.., అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం. అణగదొక్కాలనుకునేవారే ఇలాంటి తలతిక్కవాదం చేస్తారు.
ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు.......మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే.....కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం (పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది.

చివరగా…

చందమామలో కుటుంబరావు గారి గురించి నా బ్లాగులో, చందమామ వెబ్‌సైట్‌లో ఈ 28న -ఆయనకు నూరేళ్లు- పరిచయం లేదా కథనం రాయమని ప్రోత్సహించిన ఘనత పూర్తిగా శివరాం ప్రసాద్ ‌గారికే దక్కుతుంది. నిన్ననే ఆయన “మీకు తెలుసా! ఒక మహా రచయిత శతజయంతి ఈరోజున” అనే పేరిట తన బ్లాగులో కుటుంబరావు గారి గురించి పెద్ద పరిచయం చేయడమే కాక చందమామ ఆన్‌లైన్‌లో, నా బ్లాగులో కూడా రాయమని పలుసార్లు ప్రోత్సహించారు.

గత పది రోజులుగా చందమామ కలెక్టర్స్ ఎడిషన్ తెలుగు అనువాదాల పనిలో ఉండి ఇక ఏపని కూడా పట్టించుకోకుండా ఉన్న సందర్భంలో ఈ మెయిల్స్ ద్వారా నాలుగైదు సార్లు హెచ్చరించి మరీ శివగారు నన్ను ముగ్గులోకి దింపారు. చందమామకు కుటుంబరావుగారు చేసిన దోహదం గురించి ఇంతవరకు లభ్యమవుతున్న సమాచారాన్ని అయినా ఒక చోట చేర్చాలనే ప్రయత్నంలో ఈ పరిచయంతో పాటు పెద్దల మాటలను కూడా ఈ పో‌స్ట్‌లో చేర్చాను. వీరందరి రచనలలోంచి విషయాన్ని తీసుకున్నందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదనే భావిస్తున్నాను.

Rajugaru, please do write in your excellent language about Kodavatiganti in YOUR BLOG.. Kodavatiganti was THE ONLY Editor of Chandamama. If you write an article in your Blog and also in online Chandmama, atleast now, after 29 years after the great writer and Editor’s demise (on the eve of his birth Centinary), the sin committed by Chandamama for not publishing his name as Editor can be exonerated to some extent.

You are free to use any of the articles I had written in my blog. Please do that.

I feel proud if contents in my blog are taken and quoted in online Chandamama when you write about the Centinary year of Shri Kodavatiganti Kutumbarao-the longest serving Editor by far. I am sure nobody can beat his record now!!!

Please do write an article on Shri Kodavatiganti Kutumbarao in Chandamama Online(Ko Ku being the longest serving Editor-unnamed of course).

Regards,
SIVARAMAPRASAD KAPPAGANTU
FROM BANGALORE, INDIA

శివరాం ప్రసాద్ గారూ, కుటుంబరావు గారిపై ఈ పరిచయం కాసింతైనా ఉపయోగకరంగా ఉంటుందనుకుంటే ఆ ఘనత పూర్తిగా మీకే చెందాలి. సమయాభావం పేరుతో రాయలేనేమో… కనీసం అందుబాటులో ఉన్న సమాచారాన్నయినా ఒకచోట చేర్చలేనేమో అని వెనుకాడుతున్న సమయంలో మీ ప్రోత్సాహమే నన్ను ఈ పనికి పురికొల్పింది. మీకు కృతజ్ఞతాభివందనలు.
(ఈ వ్యాస రచయిత శ్రీ కే రాజశేఖరరాజు-చందమామ చరిత్ర బ్లాగులో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.