9, మే 2010, ఆదివారం

రచన -దాసరి- ప్రత్యేక సంచిక : అపూర్వ స్పందనలు

పిల్లలను, పెద్దలను ‘చందమామ’ ద్వారా కొన్ని దశాబ్దాలపాటు అలరించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అద్భుత అజ్ఞాత రచయిత గురించి తెలుగు పాఠకలోకానికి ‘చాటి’ చెప్పాలన్న తపనతో సర్వశక్తులూ ఒడ్డి నభూతో అన్న చందంగా రచన శాయి గారు తీసుకువచ్చిన మే నెల రచన ప్రత్యేక సంచిక పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..

ప్రస్తుతానికి శాయి గారు ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ శేషు గారి అద్భుతమైన స్పందనను చందమామ బ్లాగుకోసం పంపారు.. ‘ఒక పత్రిక గురించి మరొక పత్రికలో ఊసే లేని (ఈసు తప్ప) తెలుగు పత్రికా లోకంలో ఇలాంటి ప్రయోగం జరగటం ఇదే మొదలనుకుంటాను.’ అంటున్న శేషుగారు మే నెల రచన ప్రత్యేక సంచిక తీసుకురావడంలో శాయి గారు పడ్డ కష్టం గురించి విచారం వ్యక్తం చేశారు.

రచన వంటి పత్రికలు వ్యాపార ఒడిదుడుకులను తట్టుకుని నిలబడాలని మనస్పూర్తిగా కాంక్షిస్తూ రచనకు త్వరలో చందా కడతానని కూడా చెప్పారు. సదాశయంతో, ఉత్తమాభిరుచితో లాభాపేక్ష అనే పదానికి అర్ధం ఏమిటో తెలియని తత్వంతో పత్రిక నడిపిస్తున్న వారికి పత్రిక విడివిడిగా కొనడం కాకుండా చందా రూపంలో తీసుకుంటే ఎంత ఊపిరి పోస్తుందో, మనకు తెలియని విషయం కాదు. అందుకే శేషుగారితో నూటికి నూరుపాళ్లూ ఏకీభవిస్తూ నేను కూడా ఈ నెల నుంచి రచనకు చందా పంపిస్తున్నాను.

నిజం చెప్పాలంటే మూడు నెలల క్రితం వరకు రచన శాయి గారి గురించి నాకు పెద్దగా పరిచయం లేదు. చందమామ వీరాభిమానుల్లో. అగ్రగణ్యుడిగా 8 నెలల క్రితం త్రివిక్రం గారు ఆయన గురించి చెప్పడం వరకే నాకు గుర్తుంది. ఎందుకో శాయిగారితో పరిచయం చాలా ఆలస్యంగా జరిగింది. కానీ గత మూడు నెలలుగా దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం మన రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల్లోని, ప్రపంచంలోని తెలుగు వాళ్లను, దాసరి గారి అభిమానులను సంప్రదించడంలో, దాసరి జ్ఞాపకాలు, అరుదైన అంశాలను పంపమని తాను ఎంత తీవ్రస్థాయిలో శ్రమించారో చందమామ -దాసరి- అభిమానులకు తెలుసు.

మొదట అనుకున్న పథకాన్ని మించి దాసరిగారిపై విశేష స్పందనలు రచన కార్యాలయానికి వెల్లువెత్తడంతో ఏప్రిల్ సంచిక ముద్రణను సైతం ఆపివేసి ప్రత్యేక సంచికకు ప్రాధాన్యత ఇవ్వడంలో శాయిగారు రచన ఉనికినే సవాలుగా పెట్టారు. సాహిత్య అధ్యయనాన్ని సీరియస్‌గా తీసుకునే వారికోసం, రచన కంట్రిబ్యూటర్లకోసం ఉత్తమ పుస్తకాలను బహుమతిగా ఉచితంగా అందిస్తున్న సత్సంప్రదాయం కూడా రచన శాయిగారికే సొంతమనుకుంటాను.

కాళీపట్నం రామారావు గారి సాహిత్య సంచికలను 150 కాపీలకు పైగా తాను స్వయంగా కొనుగోలు చేసి రచన కంట్రిబ్యూటర్లకు ఉచితంగా అందించడం, తన అబిరుచికి తగిన పుస్తకాలను ముందే కొనుగోలు చేసి తదనంతర కాలంలో వాటిని అవసరమైన వారికి అందించడం, ఏ పుస్తకం కావాలన్నా దానికి సోర్స్ చెప్పి సహకరించడం.

ఇవన్నీ ఒక ఎత్తైతే తెలుగు బాల సాహిత్యం మర్చిపోలేని గొప్ప పనులు మూడు శాయిగారి స్వంతమయ్యాయి. అవి చందమామ పత్రికకు ముందు ప్రారంబించబడి 1945 నుంచి 59 వరకు బాలసాహిత్యానికి ఊపిరులు పోసిన ‘బాల’ పత్రికలోని ముఖ్యమైన కథలు, తదితర అంశాలను 1300 పైజీలకు పైగా క్రోడీకరించి నాలుగు పుస్తకాలుగా -కావాలంటే హార్డ్ బౌండ్‌గా కూడా దొరుకుతోంది- ప్రచురించడం, తెలుగు బొమ్మల రేడు బాపూ బొమ్మల సర్వస్వాన్ని పుస్తకంగా అచ్చేసి బాపూగారికి శాశ్వత గౌరవం కల్పించడం, ఇప్పుడు ప్రపంచ చందమామ అభిమానులంతా గర్వించదగిన దాసరి గారి జీవిత, సాహిత్య విశేషాల మే నెల రచన ప్రత్యేక సంచికను నభూతో న భవిష్యతి లాగా అతి తక్కువ ధరకు అందించడం…

ఒక్క మాటలలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో ఏ పత్రికా ప్రచురణ సంస్థకూ సాధ్యంకాని, కాలేని మూడు గొప్పపనులు రచన పత్రిక మాత్రమే చేయగలిగింది. ఈ మూడు పుస్తకాల ప్రచురణ విషయంలో పైసా ఆదాయం ఆయనకు రాకపోవడం గమనార్హం. మే నెల రచన ప్రత్యేక సంచిక ఉత్పత్తి ఖర్చులే ఒక్కో పత్రికకు రూ.46లు అయ్యాయనే చేదునిజం ఇవ్వాళే ఆయన బయటపెట్టారు. ముద్రణా సంస్థ ఎంత తక్కువ వ్యయంతో ముద్రించినా విడి పత్రిక ఉత్పత్తి ధర రూ.46లకు చేరుకుందట. మార్కెట్‌లో మే నెల ప్రత్యేక సంచిక వెల రూ.50లు. ఈ వార్త వినగానే మనసంతా చేదయిపోయింది. ఈ విపత్కర పరిణామాలను రచన తట్టుకుని నిలబడుతుందా..

రచన బతకడం, మనగలగడం, మిగలడం…. కావాలిప్పుడు. ఇందుకు రచనకు చందాలు, ప్రకటనలు కావాలి. అవి మాత్రమే రచనను పది కాలాలపాటు బతికిస్తాయి. రచన పాఠకులు, చందమామ అభిమానులు, ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించగల సంస్థలు తమ వంతు సాయం ఈ విషయంలో అందించగలిగితే ఎంత బావుణ్ణు. రచన బతకాలి. శాయి గారు రచన పత్రికను పది కాలాల పాటు నడపగలగాలి. ఇప్పుడు రచనకు ఆపన్న హస్తాలు నిజంగా కావాలి. చందాల రూపంలో… ప్రకటనల రూపంలో.. ఇంకా వీలైతే పెద్ద పెద్ద సంస్థల, వ్యక్తుల ఆర్థిక ఔదార్యం రూపంలో….

యునెస్కో వారు ప్రపంచంలోని కొన్ని పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంటారు. పత్రికలకు సంబంధించి అలాంటి విధానమేదైనా ఉంటే, ‘చందమామకు’ ఆ గౌరవం దక్కాలి అంటూ రచన ప్రత్యేక సంచికపై మేడేపల్లి శేషు గారు పంపిన హృదయ స్పందనను ఇక్కడ చదవండి.

చందమామ ప్రపంచ వారసత్వ సంపద కావాలి!
రచన శాయి గారికి,
నమస్కారం (ఆంధ్రాలో ‘సాయి’ కాని ‘శాయి’ మీరొక్కరే అనుకుంటాను).

‘రచన’పత్రికకు నేను చాలాకాలంగా దూరమైనా, మళ్ళీ ‘చందమామ’ పత్రిక్కి సంబంధించిన ఒక గొప్ప రచయితను (ఆయన దాసరి సుబ్రహ్మణ్యం గారని ఇప్పుడే తెలిసింది) గురించి మీరేదో ప్రత్యేక సంచిక వేశారని తెలిసి (రామవరపు గణేశ్వర రావు గారు ఫార్వర్డ్ చేసిన మెయిల్ ద్వారా) మళ్ళీ మీ దగ్గరకొచ్చాను.

ఈ ‘రచన’ ప్రత్యేక సంచిక గురించి మీరు పడ్డ కష్టం బాగా తెలిసొచ్చింది. ఒక పత్రిక గురించి మరొక పత్రికలో ఊసే లేని (ఈసు తప్ప) తెలుగు పత్రికా లోకంలో ఇలాంటి ప్రయోగం జరగటం ఇదే మొదలనుకుంటాను. పిల్లలను, పెద్దలను ‘చందమామ’ ద్వారా కొన్ని దశాబ్దాలపాటు అలరించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అద్భుత అజ్ఞాత రచయిత గురించి తెలుగు పాఠకలోకానికి ‘చాటి’ చెప్పాలన్న మీ తపనకు జోహార్లు. తీగ లాగితే, డొంకంతా కదిలినట్లు (అలా కదిలించటం అంత తేలికపని కాదని తెలుసు), ‘చందమామ’ తో సంపర్కమున్న ఎంతోమందిని కదిలించి అచిరకాలంలో వారి దగ్గరనుంచి ఎన్నో అనుభవాలను పోగుచేసి, వాటిని ఏర్చి, కూర్చి ఒక ప్రత్యేక సంచిక రూపంలో మా ముందుంచిన మీ కృషి అభినందనీయం. యునెస్కో వారు ప్రపంచంలోని కొన్ని పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంటారు. పత్రికలకు సంబంధించి అలాంటి విధానమేదైనా ఉంటే, ‘చందమామకు’ ఆ గౌరవం దక్కాలి. ఇన్ని భాషల్లో ప్రచురింపబడే ‘చందమామ’ మన తెలుగువాళ్ళ సృష్టి అనుకున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది.

నేను ‘చందమామ’ లోని అన్ని సీరియళ్ళూ చదవకపోయినా, దాసరి వారి ‘భల్లూక మాంత్రికుడు’ మాత్రం చిన్నప్పుడు చదివాను. అది మొత్తం బైండు చేసిన కాపీ కూడా మా ఇంట్లో ఉండేది. వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఉండే మేము (నేను, మా చెల్లెలు) సెలవుల్లో ఖమ్మంలోని మా మేనత్తగారింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళమ్మాయి దగ్గర ‘చందమామ’ చూసేవాళ్ళం. రంగులతో తళతళలాడే కొత్త కాపీని ముట్టుకుంటేనే జన్మ ధన్యమైనట్టు ఉండేది. జానపద సీరియల్ కింద రచయిత పేరు స్థానంలో ‘చందమామ’ అని ఉండేది కనుక, అసలు రచయిత పేరు తెలిసేది కాదు. కొ.కు గారివంటి గొప్ప రచయిత కూడా ‘చందమామ’లో పనిచేశారని చాలాకాలానికి తెలిసి అలాంటి పత్రికను చదవగలిగినందుకు గర్వంగా అనిపించింది. నేను డిల్లీలో ఉద్యోగంలో చేరిన తర్వాత కన్నడ, తమిళ, మళయాళ చందమామలు కొని ఆ భాషలు కొంతవరకూ నేర్చుకున్నాను.

ఈ ‘రచన’ ప్రత్యేక సంచిక చదవకపోయి ఉంటే, దాసరి సుబ్రహ్మణ్యం గారివంటి గొప్ప రచయితగురించి నాకు తెలిసి ఉండేది కాదు. ఆయన గురించి ప్రముఖులందరూ రాసిన వ్యాసాలు ఎంతో అపురూపంగా ఉన్నాయి. ఆ కథలను ఎంతగానో మెచ్చుకుని ఆసక్తిగా చదివిన మేము ఆ రచయిత ఎవరో ఇంతకాలంగా తెలుసుకునేందుకు ప్రయత్నించనందుకు ఎంతో సిగ్గుగా కూడా ఉంది. ఇంతకాలంగా ‘రచన’కు దూరంగా ఉండటంవల్ల ఇంకా ఇటువంటి ఎంతెంత విలువైన సమాచారం కోల్పోయానో అని బాధపడుతున్నాను. చిన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సీరియళ్ళు ‘చందమామ’లో చదివినందువల్లనేమో, కొందరు రాసినట్టు, హారీ పాటర్ నవలలుగాని, ‘అవతార్’ వంటి సినిమాలుగాని పెద్ద అద్భుతాలని అనిపించలేదు. వీలైనంతవరకూ పాత చందమామలన్నీ కొనేసి ఇంట్లో ఒక ర్యాక్ లో పెట్టేస్తే, పిల్లలు టి.వి. వైపు కన్నెత్తి కూడా చూడరనుకుంటాను.

పిల్లలకు మెదడు ఒక్కటే కాదు, మనసూ ఉంటుందని గ్రహించకుండా వాళ్ళను ‘చదువుల యంత్రాలుగా’ మారుస్తున్న మన ప్రస్తుత విద్యవిధానమంటే నాకు మొదటినుంచీ అసహ్యమే. వాళ్ళను మరింత అసహ్యకరమైన వినోద (?) కార్యక్రమాలకు బలికావించే టి.వి. చానెల్సు అన్నా, ఇప్పటి సినిమాలన్నా నాకు మరింత అయిష్టం. నాకే కనుక విద్యావిధానాన్ని నిర్ణయించే అధికారమిస్తే, నెలకో రోజు ‘చందమామ’ చదివే పీరియడ్ పెడతాను. మార్కులతో పనిలేకుండా, వాళ్లకు కొన్ని పాఠ్య అంశాలు ప్రవేశాపెడతాను. మంచి పుస్తకాలు చదివిస్తాను. మంచి చలన చిత్రాలు చూపిస్తాను. పరీక్షలకు బదులు వాటిగురించి చర్చ పెడతాను. జ్ఞానంతోపాటు పిల్లల్లో మనసూ, బుద్ధీ కూడా వికసించాలి. అప్పుడే వాళ్లకు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఏ చదువు చదివితే ఎంత సంపాదించవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తోంది మన ప్రస్తుత విద్యావిధానం. ఇది ఎటు వెళ్లి ఎటు తేలుతుందో అర్థం కాకుండా ఉంది. భాష, సాహిత్యం, కళలు అనేవి ఉపయోగంలేని వ్యాపకాలు అనే ధోరణి బాగా ప్రబలుతోంది. ఇది ముందు తరాలకు చాలా ప్రమాదం.

ఎన్నో వ్యాపార ఒడిదుడుకులను తట్టుకుని ‘రచన’ వంటి ఉత్తమాభిరుచులుగల పత్రికను ఇంతకాలంగా నిర్వహిస్తున్నందుకు మీకెలా అభినందనలు తెలియజేయాలో తెలియటంలేదు (‘ఆహ్వానం’, ‘హాసం’ వంటి పత్రికలూ ఈ పోటీ ప్రపంచంలో అంతరించిపోయాయి). త్వరలో మళ్ళీ ‘రచన’కు చందా కడతాను. మరెందరో దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అజ్ఞాత రచయితలు తెలుగు సాహిత్య లోకంలో ఉండవచ్చు. అటువంటి వారిని కూడా వెలుగులోకి తెస్తారని ఆశిస్తాను.
- మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ

M. Seshu,

ఈ వ్యాసం రాజశేఖర రాజుగారి బ్లాగు చందమామ చరిత్ర నుండి పున:ముద్రణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.