14, అక్టోబర్ 2009, బుధవారం

అమరావతి కథలు సమీక్ష 4

పొద్దున్నే స్కూలుకి వెళ్లేముందు, అన్నంలో ఆంధ్ర మాత (అదెనండి గోంగూర పచ్చడి) కలిపి అందులో మీగడో అప్పుడే తీసిన వెన్నో మిళాయించుకుని తింటూ ఉంటే కలిగే ఆనందం, తిన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు అటువంటి అవకాశం ఎక్కడో మారుమూల గ్రామాల్లో తప్పితే లేదు కదా! శారీరక జిహ్వకు కలిగే ఆ ఆనందం తృప్తి, సుఖం మనం ఇప్పుడు కొనుక్కుందామన్నా లేదు. కాని, మానసిక జిహ్వకు అటువంటి, అంతకంటే ఎక్కువ ఆనందం కలిగించేవి అమరావతి కథలు మనకు అందుబాటులోనే ఉన్నాయన్న విషయం ఎవరూ అంతగా గమనించినట్టు లేదు. మానసిక వికాసానికి ఏవేవో విదేశాలనుండి దిగుమతి అయిన పుస్తకాలు వాటి తెలుగు అనువాదాల హోరులో, చక్కటి కథల రూపంలో మానవ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటే అందరూ కలసి సుఖంగా బ్రతక గలరు అన్న విషయాన్ని అలవోకగా తెలియచేసే ఈ కథలు మరుగున పడిపోయాయేమో అనిపిస్తుంది. పెద్దల మాట, చద్దన్నం మూటలని అన్న వాడుకలో ఉన్నా పెద్ద అర్ధం ఏమిటో అని అయోమయంలో ఉన్నవారికి ఆ అర్ధాన్ని చెప్పకుండానే చెప్పగలవు ఈ చక్కటి కథలు. సత్యం శంకరమంచి గారు అతి చిన్న వయస్సులోనే తనను అలరించటానికి ఆ పరమేశ్వరుడు తీసుకుని వెళ్ళిపోవటం తెలుగు సాహితీప్రపంచానికి జరిగిన, తెలుసుకోలేని నష్టం. ఆ అద్భుత రచయితను తలుచుకుంటూ మరో ఐదు కథలు.

16.అన్నపూర్ణ కావిడి
*ముఖ్య పాత్ర-శరభయ్య
*బాపుబొమ్మ-అన్నపూర్ణ తల్లి దగ్గరనుండి ఆహారాన్ని ఆర్తితో స్వీకరిస్తున్న శరభయ్య
*కథ-తల్లి తండ్రులు చూసిన సంబంధం కాదని, పైపై అందం చూసి పెళ్ళిచేసుకున్న అమ్మాయి అతన్ని ఛీత్కరింస్తూంటుంది. భార్య అనురాగం చూరగొనలేని అభాగ్యుడైన శరభయ్య, భార్యతో పడలేక అతను వారణాశి పారిపోవట, ఆ తరువాత "అన్నపూర్ణ కావిడి" వేసుకుని అడుక్కుని తినటం, అప్పటికి, భార్య కాంతం మీద మమకారం చావక అమరావతి తిరిగి వచ్చి, ఆమె ఇక లేదని తెలుసుకుని, ఖిన్నుడై, నిజమైన వైరాగ్యం పొందటం కధలో చక్కగా వివరించారు. చివరలో తన తదనంతరం 'అన్నపూర్ణ కావిడి' కోసం వెంపర్లాడుతున్న అవిటి సిద్ధయ్యకు శరభయ్య ఇచ్చిన సందేశపూర్వక సమాధానం కధకు మకుటం. 'అన్నపూర్ణ కావిడి" అంటే ఏమిటి, ఆ కావిడి వేసుకున్న బైరాగి జీవన విధానం ఎలా ఉంటుంది కళ్ళకు కట్టినట్టు, ఈ విషయం మీద ఏవిధమైన సమాచారం తెలియని ప్రస్తుతపు తరానికి, రచయిత తెలియచేసారు.

17.చెట్టుకొమ్మనున్న కథ
*ముఖ్య పాత్ర-ముక్కంటి
*బాపు బొమ్మ-నది రెండుగా విడివడి తరలివస్తున్న జనానికి దారి ఇస్తున్నట్టు, కదాంశ ప్రతిబింబం
*కథ-సరైన అధారలు లేని చారిత్రకాంశం పుక్కిటి పురాణంగా ఉన్న వివరాలను చక్కటి కథగా వ్రాశి ఉంచారు రచయిత. ముక్కంటి చిన్నతంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ తెంపరితనానికి అలవాటుపడి, ఆ తెంపరితనంతోనె ఒక రాజ్యాన్ని స్థాపించటం, తనకు తన భార్యకు వచ్చిన ఒక సున్నిత సమస్య పరిష్కరించినవారిని వారి అవసర కాలంలో ఆదుకోవటం కథ. కథలో "ఆరువేల" కుటుంబాలు కాశినుండి తరలి తెలుగు కోస్తా ప్రాంతానికి రావటం,ఇప్పటికి అదే పేరుతో ఉన్న బ్రాహ్మణ శాఖ మూలాలకు చెందిన కథ కావచ్చుననిపిస్తుంది. అటు ఆకాశం కాక, ఇటు భూమి మీద కాక, ఎటుపడితే అటు గాలికి ఆడే చెట్టుకొమ్మ మీద కథ ఉన్నదంటూనే, రచయిత గడుసుగా అధారాలులేని చారిత్రిక విషయం, పుక్కిటి పురాణం, కట్టుకథ దశనుండి, వ్రాయబడ్డ కథగా మలిచారు.

18.అఖరి వేంకటాద్రి నాయుడు
*ముఖ్య పాత్ర-వేంకటాద్రి నాయుడు
*బాపు బొమ్మ-తాళంచెవులు ఎత్తుకుని అల్లరికి పారిపోతున్న మనవణ్ణి పట్టుకోవటానికి పంచ ఒక చేత పట్టుకుని వడివడిగా పరుగెత్తుతున్న వేంకటాద్రి నాయుడు, కథాంశపు చిత్రం
*కథ-అమరావతి పూర్వపు పాలకుల వంశజుడు రాజ్యాలు, జమీలు అన్నీ పోయినాక కూడ ప్రజలందరి మన్ననలు పొందుతూ జీవించిన విధం కధాంశం

19.ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే
*ముఖ్య పాత్రలు-పానకాలు, పరమేశు, పెద్ద దొరగారు, వీరాస్వామి
*బాపు బొమ్మ-సన్నాయిలే ఆయుధాలుగా కొట్టుకుంటున్న పరమేశు, పానకాలు. కథలోని సంఘటనకు హాస్యపూరక చిత్రీకరణ
*కథ-దేవుడి ఊరేగింపులో,గుడి వాయిద్య గాళ్ళు చేసిన గలాభా, వాళ్ళ సంగీత విద్యారాహిత్యం, ఒకళ్ళమీద ఒకరికి పడక, చివరికి వాళ్ళ సన్నాయిలతోనే కొట్టుకోవటం చక్కగా వర్ణించారు. పెద్దదొరగారు గుడి వాయిద్యగాళ్ళకు ఇచ్చిన మాన్యాలకు తగ్గ ఫలితం దేవుడిగుడికి అవసరానికి రాకపోవటం చూసి, వెరొక వాయిద్యగాణ్ణి తయారు చెయ్యటానికి, వీరాస్వామిని తంజావూరు పంపి పదివేలు ఖర్చుచేసి విద్య చెప్పించినా ఫలితం లేక అతని విద్యను ప్రదర్శించటాని ఏర్పరిచిన కచేరి అభాసుపాలు కావటం చూసి దొరగారు హతాశులవటంతో కథ ముగుస్తుంది. కడుపునిండిన బేరం చందంగా గుడి వాయిద్య గాళ్ళ ప్రవర్తన మానవ ప్రవృత్తికి ఒక ఉదాహరణగా రచయిత చెప్పటం జరిగింది.

20.పచ్చగడ్డి భగ్గుమంది
*ముఖ్య పాత్రలు-లచ్మి,రాములుమామ
*బాపు బొమ్మ లచ్మి నెత్తిమీదకు గడ్డి మోపు ఎత్తుతూ సహాయ పడుతున్న రాములుమామను లచ్మి మురిపంగా చూస్తూండటం కథకు భావయుక్తంగా చిత్రించారు బాపు.
*కథ-ఒక పల్లెటూరి పడచు జాలి గాధ. లచ్మి చక్కటి పిల్ల, నలుగురితో కలసిపొయ్యేది, గడ్డికోసి అమ్ముకుంటూ గౌరవంగా తాను బ్రతకటమేగాక, తాగుబోతు తండ్రిని కూడ పోషిస్తూ ఉంటుంది. గడ్డి ధర అడుగుతూ నర్మగర్భంగా "రూపాయేనంటే నీ ధర! ఐదురూపాయలిస్తా తీస్కో" అన్న ఆకతాయి పోలాయికి, కీలెరిగి వాతపెట్టినట్టు "బాబూ గడ్డి గొడ్లకా? మీకా?" అని బదులిచ్చి నోరుమూయిస్తుంది. వయసుగాడైన రాములుమామ లచ్మి ఒకరిమీద ఒకరు మనసుపడ్డప్పటికీ, కట్నం డబ్బులకు బ్రమిసి సీతాలుని పెళ్ళాడ్తాడు రాములు. తాగుపోతు తండ్రి తంత్రంతో అరవై ఏళ్ళ పైబడ్డ ముసలివాడికి మూడో భార్య అయ్యి, ఆరునెలలు తిరగకుండా బొట్టులేకుండా తిరిగొస్తుంది లచ్మి. పచ్చగడ్డిలాగ చక్కగా ఉండవలసిన ఆమె జీవతం ఆవిధంగా భగ్నం కావటమే, "పచ్చగడ్డి భగ్గుమంది" అని పేరు పెట్టడంలోని ఔచిత్యం. "ఇప్పుడా లచ్మి ముఖంలో నవ్వు లేదయ్యా! ఇపుడా లచ్మి ముఖంలో బొట్టు లేదయ్యా! అని అతి తక్కువ మాటలతో గుండేల్ని పిండేసే కరుణరసాన్ని పండించటమే కాక, కథలో మరొక చోట "రంగు రంగుల చీరలు కట్టుకుని రండి!రండి! అని పిలిచే కొమ్మలు" అని వ్రాసి "కొమ్మ" పదానికి " మగువ లేదా స్త్రీ అనే అర్ధం కూడ ఉన్నదని (సామాన్యంగా పద్యాలలో వాడతారలా) చదువరులకు తెలియచేసారు రచయిత.

3 కామెంట్‌లు:

  1. అమరావతి కథలు నచ్చని తెలుగువాళ్లు ఎవరుంటారు? ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు.

    చాలా చక్కగా వ్రాస్తున్నారు. ప్రతి టపాకి మీరు వ్రాసే ఉపోద్ఘాతం కూడా బహుచక్కగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. ఇది ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుందండీ ఇలా మంచిరచయితలనీ, కథలనీ అందించండం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. 70ల నాటి సంగతి. అమరావతి కథలు ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికగా వచ్చేవి. మళ్లీ ఇప్పుడు మీ బ్లాగు ద్వారా చూస్తున్నాను. తెలుగు సాహిత్యంలో అత్యుత్తమ కథలలో ఇవి ఒకటి. మీ ద్వారా తిరిగి వీటిని మరోసారి చూసే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.