29, జనవరి 2010, శుక్రవారం

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు - జానపద ధారావాహికా స్రష్ట


కీర్తిశేషులు దాసరి సుబ్రహ్మణ్యం గారు
శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు చందమామలో ఐదు దశాబ్దాల పైగా పని చేసారు. చందమామ ఉన్నతికి ఆయన చేసిన కృషి అనిరతరం. చందమామలో ఆయన నిర్వహించిన అనేకానేక అద్భుత శీర్షికలలో వారు రచించిన ధారావాహికలు తలమానికమైనవి. చందమామకు వన్నె తెచ్చినవి, ఆయన రచించిన పన్నెండు ధారావాహికలు. ధారావాహికలు ఎంత పాఠకాదరణ పొందినాయంటే, అవ్వే సీరియల్స్ చందమామలో పున:ముద్రణ చేస్తున్నారు . తెలుగు పత్రికా చరిత్రలో ఈ విధంగా ధారావాహికలను పున:ముద్రణ చేయటం బహుశా వీరివే అయ్యి ఉంటాయి. ఆయన సృష్టించిన జానపద కథా పాత్రలు పిల్లల మనస్సుల్లో చెరగని ముద్రలు వేశాయి. నేను కూడ, ఆయన ధారావాహికలు చదువుతూ పెరిగిన వాడినే. ఆయన మరణ వార్త వినగానే కలిగిన విచారం, ఆ విచారాన్ని మరవటానికి ఆయన పాత్రలే ఆయనకు నివాళి అర్పించటం వ్రాసుకున్నాను. ఆ కథనాన్నే ఈ కింద ఇస్తున్నాను.

ఈ కథనం ప్రచురణ తరువాత, చందమామ వారు నన్ను సంప్రతించి, ఈ కథనాన్ని యధాతధంగా ఆన్ లైను చందమామలో ప్రచురించారు. చందమామలో ప్రచురితమైన కథనాన్ని కింద లింకు నొక్కి చూడవచ్చు.

జానపద కథా బ్రహ్మ

నా బ్లాగులో నేను వ్రాసిన వ్యాసం, ఒక పత్రికలో ప్రచురించబడటం ఇదే మొదటిసారి, అదీ నా అభిమాన పత్రిక చందమామలో అవ్వటం నాకు ఎంతగానో ఆనందంగానూ గర్వంగానూ ఉన్నది.
======================================================================
"ఖడ్గవర్మా ఆగు ఆగు నేను కూడ వస్తున్నాను" అని పరుగు పరుగున వచ్చి చేరుకున్నాడు శిఖిముఖి. "ఏమిటి ఖడ్గావర్మా, నిన్న గాక మొన్న వచ్చారు మా గూడెంలోకి ఇక్కడ ఉన్న జీవదత్తుని చూడటానికి, అప్పుడే ఏమిటీ తొందర వెళ్లిపోవటానికి ? అరే జీవదత్తా! నువ్వు కూడ వెళ్ళిపోతున్నావా, ఇదేమి పని ఖడ్గావర్మా, నువ్వోచ్చి ఈయన్ని కూడ లాక్కెళ్ళి పోతున్నావే ?" అన్నాడు శిఖిముఖి కొంచెం నిష్టూరంగా శిఖీ! ఏమిటి నీకు ఇంకా తెలియదా, విక్రమకేసరి ఇప్పుడే కబురు పంపాడు, పూజ్యులు, మనందరినీ సృష్టించిన మన దాసరి సుబ్రహ్మణ్యంగారు ఇక లేరట. నిన్న రాత్రి అనారోగ్యంతో నగరంలో మరణించారుట. విక్రమకేసరి కబురు పెట్టాడు. దూమక సోమకులూ, పింళుడు, తరువాత రాకాసి లోయ లో కుర్రాళ్ళు జయమల్లుడు, కేశవుడు కూడ ఇప్పటికే అక్కడకు చేరి ఉంటారు. మన మిగిలిన వాళ్ళందరూ కూడ ఆయన్ని చూడటానికి బయలుదేరారుట. పద పద మనం కూడ వెళ్లి మన గురువుగారిని చివరి చూపు చూసుకుందాము.

ఈ వార్త వినంగానే శిఖిముఖి వలవలా ఏడిచేశాడు. అయ్యో ఆయ్న అప్పుడే వెళ్ళిపోయారా అని రోదించాడు. జీవదత్తుడు, ఖడ్గవర్మ అతన్ని అనునయించారు. జీవదత్తుడు స్వాంతన వ్యాక్యాలు పలికాడు. అలా వీళ్ళు విచారంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. జీవదత్తుడు అన్నాడు, దాసరి వారు మధ్య వరకూ కూడ బాగానే ఉన్నారుట, వేణు అని ఒకాయన మధ్యనే వెళ్లి ఆయన్ను చూసి వచ్చి, ఆయన గురించి వ్రాసారు. ఇప్పటికీ ఏదో ఒకటి వ్రాసుకుంటూనే ఉన్నారుట. కాని పాపం వినికిడి పూర్తిగా పోయిందట, కాని ఆరోగ్యంగానే ఉన్నారట.


"సరే జీవదత్తా! నువ్వు విషయాలన్నీ కూడ సేకరించావు కదా . కొంచెం మన సృష్టికర్త గురించి వివరాలు చెప్పగలవా," అని అడిగాడు శిఖిముఖి వచ్చే దు:ఖాన్ని దిగమింగుకుంటూ . అలాగే! వినండి. దాసరి వారు ఎప్పుడు పుట్టారో సంవత్సరం ఆయనకే తెలియదుట. కాని ప్రస్తుతం ఆయన వయస్సు రమారమి 88 సంవత్సరాలు ఉండవచ్చు అని ఆయనే అంచనా వేసి చెప్పినట్టు మన వేణుగారు వ్రాసారు. సుబ్రహ్మణ్యంగారు తన 29 ఏట మన జన్మ స్థలమైన చందమామలో కి వచ్చి చేరారుట. మొట్టమొదట సమరసేనుడు, ఏకాక్షి వంటి వారిని తయారుచేసి తోక చుక్క వ్రాసారుట. మొత్తం మీద చందమామలో ఇరవై నాలుగు సంవత్సరాలలో పన్నెండు ధారావాహికలు వ్రాసారు. మనలాంటి వారిని ఎందరినో తెలుగులో పిల్లలకి పరిచయం చేసారు.

"జీవదత్తుడు గారూ పన్నెండు ధారావాహికలు ఏమిటో చెప్పరూ" కొత్త గొంతు, కొత్త పలకరింపు. ఖడ్గవర్మ దబుక్కున వ్యక్తి చెయ్యి పట్టుకుని, "ఓరి ! అరణ్య పురాణం మౌగ్లీ నువ్వెప్పుడు వచ్చావు. అయినా నీకు దాసరి వారికి బంధుత్వం లేదుగా ? నువ్వేక్కడకి బయలుదేరావు". అన్నాడు. అదేమిటిలే ఖడ్గా, మనందరితో పాటు చందమామలోనే ఉండేవాడు మన మౌగ్లీ ఆ మాత్రం ఆపేక్ష ఉండదూ. సరే మౌగ్లీ విను, దాసరి వారు వ్రాసినవి పన్నెండు ధారావాహికలు. అందులో కొన్ని జంట ధారావాహికలు. అంటే ఒక ధారావాహిక అయిపోయినా, అందులో ఉన్న పాత్రలతోనే మరొక ధారావాహిక వెను వెంటనే వ్రాశేవారు. అలా వ్రాసినవి, తోక చుక్క-మకర దేవత, రాతి రథం-యక్ష పర్వతం. ఇక మిగిలిన ధారావాహికలు, జ్వాలాదీపం, కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, పాతాళ దుర్గం,రాకాసి లోయ, మాయా సరోవరం మనకందరికీ ఇష్టమైన శిధిలాలయం. చిట్టచివరగా ఆయన వ్రాసిన ధారావాహిక భల్లూకమాంత్రికుడు.

మనందరికీ రూప కల్పన చేసినది చిత్రాగారు. ఒరే, మౌగ్లీ నీకు రూపు రేఖలు ఇచ్చినది వడ్డాది పాపయ్య గారు గుర్తుందికదూ". మౌగ్లీ వెంటనే "అయ్యో! లేకపోవటమేమిటి? నేనింత అందంగా ఉండటానికి కారణం ఆ తాతగారేకదా". జీవదత్తుడు చప్పున అందుకుని, సరె మాటలు ఎటో పోతున్నవి, నేను చెప్పొచ్చేదేమిటంటే , దాసరి వారి చివరి ధారావాహిక వచ్చేప్పటికి, చిత్రాగారు లేరు. ఆయన వెళ్ళిపోయారు. అందుకని, భల్లూక మాంత్రికుడు లో వాళ్ళందరూ మనలాగ ఉండరు.

అబ్బాయిలూ ఇలా ధారావాహికలేకాదు, మన దాసరి వారు బహుముఖ ప్రజ్ఞావంతులు. కొన్ని ఇతర కథలు కూడ వ్రాశారుట. అరెరే!! ఎవెరు వీళ్ళు ఇలా కాళ్ళకు అడ్డంపడుతున్నారు. శిఖిముఖీ వీళ్ళను చూడు. ఇలా దగ్గరకు రండిరా" అన్నాడు జీవదత్తుడు. ఓరినీ మీరురా దాసు-వాసు, మీరూ వచ్చేశారా, అట్టమీద బొమ్మల్లో వచ్చేవారు మీరు. సరే పదండి వెళ్ళి మన దాసరి వారిని చివరిసారి దర్శనం చేసుకుందాం.

ఇలా వీళ్ళందరూ నగరానికి వెళ్ళేప్పటికి అక్కడ దు:ఖిస్తూ దాసరివారి పాత్రలన్ని కూడ అక్కడే కూడారు. అందరూ కలసి తమ సృష్టి కర్తకు ఘనంగా నివాళి సమర్పించి వెనుతిరిగారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారి అంత్యక్రియల సందర్భంగా ఖిన్న వదనులై చూస్తున్న విక్రమకేసరి, శిఖిముఖి
===================================================================
ఈలోగా ఆ పైన, అంటే తెలుసుగా. అక్కడన్నమాట. మడమలమీదకు కట్టుకున్న పంచె, లాల్చీ ధరించిన ఒక సన్నటి మనిషి మెల్లిగా మేఘాల మధ్యలో విసుగ్గా నడుచుకుంటూ వచ్చి, "ఏందయ్యా! దాసరీ!! ఇంతకాలానికా రావటం?, ఏముందనబ్బా ఇంతకాల ఉండావు అక్కడా. ఎముండాది?? ఇప్పుడు అంతా కొట్తుకుసస్తా ఉండారే, సరేకాని రా! రా!! ఎంత కాలానికి ఎంతకాలానికి" అని వచ్చి సాదరంగా ముందుకు వచ్చారు. "అయ్యా! చక్రపాణిగారూ నమస్కారం. మీరేమీ మారలేదండి. ఇక్కడి వాతావరణంలో కూడా అలాగే ఉన్నారు" . ఆ ఏముండాది ఇక్కడ ఒక ఆకలీ లేదు పాడూ లేదు, ఈ మేఘాలొకటి మధ్య మధ్యలో దూది పింజలల్లే అడ్డుపడుతూ. ఆ ఇంద్రుడున్నాడంటే ఇంత తాగనూ అట్టా పడి ఉండనూ. చూడు పాపం చిత్రా గారు బొమ్మలు వెయ్యటానికి మంచి కథలు లేక ఎలా బాధపడుతున్నాడో. ఇదిగో రాఘవులూ ఇక మనందరికీ మంచి కాలక్షేపమయ్యా, ఇక కథలే కథలు. దాసరి వచ్చేశాడు మన దగ్గరకి. "అయ్యా దాసరి గారూ,ఎంత కాలమయ్యిందండి మిమ్మల్ని చూసి అంటూ ఆప్యాయంగా వచ్చి కౌగలించుకున్నాడు చిత్రా. దాసరి గారు ఆనందంతో తబ్బిబ్బవుతూ, నాకు కూడ ఎంతో ఆనందంగా ఉన్నది, ఇక్కడకు వచ్చి మీ అందరినీ కలుసుకోవటం. ఏం చిత్రా ఎలా ఉన్నావయ్యా. ఎన్ని సార్లు నీ గురించి జ్ఞాపకాలు. సరే కాని, ఇక్కడేమన్న పత్రిక ఉంటుందా" అన్నారు దాసరి ఆసక్తిగా . "ఆడి బండ పడ ఇంద్రుడేమి పత్రిక పెట్టలా, ఒకటే డాన్సులు తప్ప. ఓయ్! నాగిరెడ్డీ అలా పోతుండావే, మన దాసరి వచ్చేసిండయ్యా . మనం ఇక్కడే మరో పత్రిక పెట్టాలంట. ఏమిటిమరి" అన్నారు చక్రపాణిగారు. "అహాహా !! ఏమిటి ఇవ్వాళ ఎంత బాగున్నది అనుకుంటున్నాను చక్కన్నా, అదీ సంగతి దాసరి గారు వచ్చి చేరిపొయ్యారన్న మాట. సరే సరే అంటానికేమున్నది పెట్టేద్దాం పత్రిక , అందరం ఇక్కడే ఉన్నాంకదా" అన్నారు నాగిరెడ్డిగారు . "మరి మన వపా అదేనండి పాపయ్య గారు ఎక్కడ" అన్నారు దాసరి చుట్టూ చూస్తూ. వెంటనే చక్కన్న అందుకుని, నీకు తెలవందేముంది దాసరీ, అక్కడ ఊర్వసిని చూస్తా ఆవిడ అందం అంతా బొమ్మలోకి ఇరికిస్తా ఉండాల. పదండి ఆయన్ని కూడ కలుపుకుందాం" అంటూ చక్రపాణిగారు ముందుండి దారి తీశారు, అందరూ స్వర్గం లోపలికి వెళుతున్నారు.

ఇక స్వర్గంలో వాళ్ళ అదృష్టం మంచి కథలు, బొమ్మలు, నిజంగా స్వర్గమై పోయింది.
====================================================================

తమ సృష్టికర్త మరణ వార్త విని బాధపడుతున్న ఇతర పాత్రలు













3 కామెంట్‌లు:

  1. eenadu news paperlo laaa baaga edit chesaaru...poyinollandaru mancholluu ,unnollu poyinolla teepiguruthulu..emantaaru

    రిప్లయితొలగించండి
  2. ఆయన వేసిన బొమ్మలను ఎంత సమయోచితం గా ఉపయోగించారండీ!

    మనమిలా ఆయన బొమ్మలతో పెంచుకున్న అనుబంధంతోనే ఇంత బాధ పడుతుంటే ఈనాడు కనీసం మరణ వార్తను కూడా ఇవ్వలేదు. నిజానికి ఆయన బాల పాఠక ప్రపంచానికి చేసిన సేవలకు నివాళిగా ఈ రోజు ఒక ప్రత్యేక వ్యాసం ఇవ్వవలసిన మాట కదా!

    ఇలా ఉన్నాయి పత్రికల ప్రాముఖ్యాలు!

    ఆన మరిక లేరనే వార్త ను జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా అనాయాస మరణం వారికి లభించడం కొంత ఉపశమనం!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.