25, మే 2011, బుధవారం

ఏమిటీ గోల, అల్లరి, రభస

వ్యాసం చదివిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ బాబు గారు పైనున్న చక్కటి కార్టూన్ వేసి పంపారు. వారికి కృతజ్ఞతలు
ఎవరండీ చేస్తున్నది?? ఆశ్చర్యం ఎవరో కాదు మరెవరో కాదు, భావి భారత పౌరులను తయారుచేయాల్సిన విద్యాలయాలు. అవును వాటిని ఇంకా పేరుతోనే వ్యవహరిస్తున్నారు. రకరకాల పేర్లు , తమ భవనాల బయట రంగు రంగుల జండాలను కూడ ఎగరేస్తూ, ఎంతో విచ్చలవిడిగా ఎడా పెడా ఇలాంటి ప్రకటనలు చెయ్యచ్చు చెయ్యకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ తమ పేరు మోగిపోవాలన్న దుగ్ధతో మన సమాజంలో ప్రకటనల పేరుతొ న్యూసెన్స్ చేస్తున్నారు.

ఈ పాటికి మీకు తట్టే ఉండాలి ఎవరి గురించి వ్రాస్తున్నానో! అటు టెంత్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయో లేదో మొదలు ఒక్కటే కాకి గోల టి వి చానేళ్ళల్లో. ఒక్కోడు తమ స్కూలు గొప్పది అంటే, మరొకడు ఇంకా గొప్పది అని మాకిన్ని రాంకులు అంటే మాకింకా ఎక్కువ రాంకులు అంటూ . ఊరికే రెండు, మూడు , పది, పన్నెండు అంటూ బడబడా అంకెలు చదివేస్తూ వాళ్ళ స్కూళ్ళల్లో విద్యార్ధులకు వచ్చిన రాంకుల గురించి ఒకటే రభస.

స్కూళ్ళు కూడ ప్రకటనలు చెయ్యటం అనే నీచ సంస్కృతీ ఈ మధ్యనే మొదలయ్యింది. ఇరవై ఏళ్లక్రితం లేదు. ఏమిటి వీళ్ళు ఇంతగా ఆడిపోతున్నారు ఈ రాంకుల గురించి, తమ స్కూల్లోనే చేరమని ఎందుకు ఇంత అల్లరి ఆగం చేసి చెప్పుకోవటం. ఎంత జుగుప్సాకరంగా ఉన్నది ఈ ప్రకటనలు వింటూ ఉంటే. ఇటువంటి స్కూళ్ళల్లోనా మా పిల్లల్ల్ని చేరిపించాలి అని తల్లితండ్రులు భయభ్రాంతులు అయ్యే విధంగాఉంటున్నాయి ఈ స్కూళ్ళ టి వి ప్రకటనలు.

ఒకడిని చూసి మరొకడు. వీడు వాడు అని లేదు అందరూ కలిసి చానేళ్ళల్లో ఒక్కటే రణగొణ ధ్వనిగా ఉన్నది రెండు మూడు రోజులనుంచి. అన్ని ప్రకటనలూ ఎబ్బెట్టుగానే ఉన్నాయి. చక్కగా హాయిగా చెప్పుకోవటం వీళ్ళ జాతకంలోనే లేదల్లె ఉన్నది. వీళ్ళేనా చదువు చెప్పేది అని బిత్తరపోయి వాళ్ళ వంక భయం భయం గా చూడాల్సి వస్తున్నది.

వీటిల్లో పనిచేసే ఉపాధ్యాయులు అయినా పూనుకుని ఇటువంటి ఛండాలపు సంస్కృతిని ఆపితే బాగుండును. టీచర్ కాబట్టి ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలిసి ఉంటుంది అని ఒక ఆశ. అదీ లేదంటే.......

ఇంత అల్లరి ప్రకటనలు చేయించి విద్యార్ధులను ఆకర్షించాలి అనుకునే వాళ్ళు, ఎటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు, వాళ్ళు చెప్పే చదువు సభ్యతతో కూడినదేనా , అక్కడ చదివిన విద్యార్ధులకు మానసిక వికాసం ఉండి సవ్యమైన పౌరులుగా తయారావుతారా లేక ఉత్తి రాంకుల వీరులేనా, అన్న అనుమానం తప్పకుండా కలుగుతున్నది.

ఒక ప్రవైటు చెప్పుకునే టీచరు ఈ విధంగా ప్రకటనలు చెయ్యగలడా? విద్యాలయాలు చేసేది విద్యార్ధులకు కావలిసిన విద్యను బోధించటం. "బోధించటం" అనేది ఒక సేవే (Service) కాని ఒక వస్తువు కాదు. వస్తువులు అమ్ముకునే వాళ్ళు తమ వస్తువు గురించి వినియోగదారునికి తెలియటానికి తగు మాత్రంగా వాడుకుంటే ఫలితాలను ఇస్తుంది. కాని సేవలు అందించే వాళ్ళందరూ కూడ ఇక వ్యాపార ప్రకటనలు మొదలు పెట్టి ఇలా రోడ్డున పడితే, సమాజంలో ఎవరైనా తీరికగా, అల్లరి లేకుండా ఒక నిర్ణయం తీసుకోగలమా?

ఇక నుంచీ డాక్టర్లు కూడ (వీళ్ళ సమూహాలు అవే కార్పోరేట్ ఆసుపత్రులు కూడ ఇదే దారిన ఇప్పటికే పడుతున్నాయి) అంటే ఎవరికి వాళ్ళు ఒంటరిగా ప్రాక్టీసు చేసుకునే డాక్టర్లు కూడ ప్రకటనలు గుప్పించటం మొదలుపెడితే? రండి రండి నేను భలే కట్టు కడతాను, నొప్పిలేని ఇంజెక్షన్, నా దగ్గిర భలే నర్సు ఉన్నది, నా చెయ్యి పడితే చాలు నీ రోగం కుదురుతుంది, నా చేతి మాత్ర, అద్భుత యాత్ర వంటి ప్రకటనలతో మనందరినీ చీకాకు పెట్టటం మొదలు పెడితే!! ఎంత దుర్భరం?

లాయర్లు. రండి రండి మా దగ్గరకు రండి విడాకులు గ్యారంటీ, ముందస్తు బైల్ చులాగ్గా తెప్పిస్తాం, ఎలాంటి కేసైనా సరే భలే వాదిస్తాను, ఖూనీ చేశారా పర్లేదు రండి నా దగ్గరకు, భయం లేదు మీకు, అంటూప్రకటనలకు పాల్పడితే? ఇక మంగలి చాకలి ఇలా రక రకాల సేవలు అందించేవాళ్ళు కూడ ఎవరి గోల, ఎవరి బాజావాళ్ళు కొట్టుకోవటం మొదలు పెడితే ఇక వినటానికి చూడటానికి ఏమన్నా మిగులుతుందా.

ఈ స్కూళ్ళ పేర్లతో నడుస్తున్న రాంకు కార్ఖానాలు ఇంత అల్లరి ఆగం చేస్తుంటే విద్యా శాఖ ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నది. ఇలా వాళ్ళు బరితెగించి సమాజంలో న్యూసెన్సు చేస్తూ ఒకటే గోలగా చీకాకు పుట్టే ప్రకటనలు దుందుడుకుగా గుప్పిస్తూ ఉంటే ఆపే అవకాశమే లేదా!!!!!

నా ఉద్దేశ్యంలో సేవలకు ఎటువంటి ప్రకటనలూ ఉండకూడదు. పూర్తిగా నిషేధించాలి. సేవలనుపొందిన వినియోగదారుడు తృప్తి చెంది ఆ సేవను అందించిన వారి గురించి మంచిగా చెప్పాలి. అదే పెద్ద ప్రకటన కావాలి. . సేవలు అనేవి ఫ్యాక్టరీలో ఏక మొత్తంగా వేల సంఖ్యలో తయారు చేసే వస్తువులుకాదు, సామాన్యంగా ఒక వ్యక్తి లేదా అతి కొద్ది మంది కలిసి అందించేవి సేవలు. వారు సేవలు అందించగలిగేది, ఏదో ఒక ప్రాంతానికి మాత్రమె పరిమితం అయ్యి కొద్దిమందికి మాత్రమె అందించగలుగుతారు. అటువంటి కొద్ది మందికి మాత్రమె అందించగల సేవలకు ప్రకటనలు అవసరమా? మరీ అంత లేకితనంగా ఉండే ప్రకటనల అవసరం ఏమైనా ఉన్నదా? సభ్య సమాజం ఇటువంటి సామాజిక దుశ్చర్య, కాదు కాదు, సామాజిక కాలుష్యాన్ని అరికట్టటానికి తగిన చర్య తీసుకుని తీరాలి.

ఈ విషయాల గురించి ఒక్క వార్తా పత్రికా వ్రాయదు, సామాజిక న్యాయం అంటూ డబ్బా కొట్టుకునే ఒక్క చానేలూ చెప్పదు. కారణం అలా చేస్తే వాళ్లకు వచ్చే ఆదాయం పోతుంది. ఇవి ప్రస్తుతం ఉన్న పాత్రికేయ విలువలు (Journalistic values)!!

ఇరవై, ఇరవై ఐదేళ్ళ క్రితం, వార పత్రికల్లో క్రాస్ వర్డ్ పజిల్స్ అని ఎంత మంద బుద్ది అయినా చెయ్యగలిగేవి ఇచ్చి పాఠకులను మోసపుచ్చే ప్రకటనలు కుప్ప తిప్పలుగా వచ్చేవి. ఇలాగే ఇరవై రూపాయలకే తుపాకి, లేదా ప్రొజెక్టర్ అంటూ చదువరులను మోసపుచ్సు వ్యాపార ప్రకటనలు అన్ని పత్రికలూ వేసేవి.

చివరకు, ఆంధ్ర భూమి వార పత్రిక వాళ్ళు అనుకుంటాను చొరవ తీసుకుని, అటువంటి ప్రకటనలను వెయ్యటం స్వచ్చందంగా మానేశారు. దాతో మిగిలిన పత్రికలు కూడ కొంత సిగ్గు తెచ్చుకుని అటువంటి మోసపూరిత ప్రకటనలను తమ పత్రికల్లోనూ నిషేధించాయి. అలాగే చానేళ్ళల్లో ప్రకటనలు ఇవ్వి వెయ్యచ్చు ఇవ్వి వెయ్యకూడదు, వేసేవాటికి ఈ విధమైన ప్రమాణాలు ఉండాలి అనే ఇంగిత జ్ఞానం ప్రస్తుతం ఉన్న పత్రికలకు, చానెళ్లకు కలగాలని దేవుణ్ణి ప్రార్ధించటం తప్ప సగటు మనిషి చెయ్యగలిగినది ఏమన్నా ఉన్నదా?!!



ఈ వ్యాపార ప్రకటనల మీద పారడీ చేసిన "వివా" వారి వీడియో. వివా వారికి నా అభినందనలు.
(Updated on 07 09 2016)










10 కామెంట్‌లు:

  1. Sir: I too echo the same. I'm wondering, whether these so called news channels, who strive for better society, has any social responsibility? I believe, it's high time that we should lodge a PIL about the rights of viewers.

    రిప్లయితొలగించండి
  2. Thank you very much Ganeshjee for your supportive comment.

    మనం ఇలా బ్లాగులో బాధ పడటమే PIL కింద తీసుకునే అవకాశం ఉంటే బాగుండును.

    రిప్లయితొలగించండి
  3. అవును!ఆ మూడు రోజులూ.. ఏ చానల్ పెట్టినా... అదే గొడవ. అవి ఒక్కటనే ఏముంది.. దిష్టి యంత్రాలు, తాయత్తులు, అదృష్టం రాళ్ళు, బరువు un natural methods లో తగ్గించే ప్రకటనలు.. ఆవిధం గా ఎన్నో వస్తున్నాయి కదా.. వీటికి పెద్దగా నియంత్రణ లేదు :-(

    ఆట డాన్స్ ప్రోగ్రాం..గురించి మానవ హక్కుల సంఘం డైరెక్ట్ చేసినా నిర్విఘ్నం గా ఆ ప్రోగ్రాం.. జరిగినట్టే గుర్తు...

    రిప్లయితొలగించండి
  4. కృష్ణప్రియ గారూ ధన్యవాదాలు.

    దిష్టి యంత్రాలు, తాయత్తులు, అదృష్టం రాళ్ళు ప్రకటనలు చూస్తుంటే, అందులో వచ్చే ఆ మనుషుల హావ భావాలు చూస్తుంటే వళ్ళు గరిపోడుస్తుంది. కాకపొతే ఆ చెత్త ప్రకటనలను ఈ స్కూళ్ళ ప్రకటనలు వేసినంత తరచుగా మళ్ళి మళ్ళి చూపటం లేదు.

    ఒక పక్క మేమెంత గొప్పవాళ్ళం మాకు ఇలాంటి మూఢ నమ్మాకాలు లేవు అంటూ వామపక్ష పడికట్టు మాటలు ఎప్పుడూ నోట్లో నానుతూ ఉండే జర్నలిస్టులు పనిచేసే చానేళ్ళల్లో ఇలాంటి ప్రకటనలు రావటం వాళ్ళ ద్వంద ప్రవృత్తిని తెలియచేస్తున్నాయి. మీడియా వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం గురించి చెప్పుకునే అవకాశమే లేకుండా ఉన్నది, ఈ బ్లాగుల్లో తప్ప.

    రిప్లయితొలగించండి
  5. ధన్యవాదాలు కనుమూరి జాన్ హైడ్ గారూ.

    రిప్లయితొలగించండి
  6. Sir: I spoke with my lawyer friend(who is a newbie, fresh out from law college). He told me that verdicts in the PILs are just directives/suggestions. Is this true sir? If yes, I don't think that these media houses will follow court suggestions!! Here, I'd like quote one instance showing how biased our media is. Nearly a year back, the dual patent holder was killed when he sued the big corporates for royalties. Eventually, he was killed. But, as expected, media didn't give big attention to it. Please see this blog post.
    http://spicyipindia.blogspot.com/2009/05/do-patents-kill-strange-twist-in.html

    రిప్లయితొలగించండి
  7. Ganeshjee,

    The judgements given in PILs are as much judgements as they are given in any other normal cases. PILs have come into fore with the judicial activism by taking into consideration even a post card as request for taking up a matter and some times suo motto cases were taken up by Judges on several issues.

    రిప్లయితొలగించండి
  8. విద్య కానీ, వైద్యం కానీ వ్యాపారమైనపుడు ప్రకటనలు లేకుండా ఉంటాయా? ‘అత్యాధునికమైన’,‘నాణ్యమైన’ సేవలు చేస్తున్నామని ప్రకటించుకుంటూ ఆ ప్రకటనలకు లక్షలూ, కోట్లూ తమ బడ్జెట్లో కేటాయించి, ఖర్చుపెడుతున్నాయి. దీంతో ఫీజులూ, చికిత్స ఖర్చులూ భారమైపోతున్నాయి. సామాన్యుడికి విద్య, వైద్యం అందుబాటులోకి లేకుండా పోతోంది. అసలు సమస్య వ్యాపారమయం అవటమే. ప్రకటనలు ఇవ్వటం దాని రిఫ్లెక్షన్ మాత్రమే! ఆ ప్రకటనలు సృజనాత్మకంగా ఉంటే సంతోషపడనక్కర్లేదు; చెత్తగా ఉంటే బాధపడనక్కర్లేదు.

    చిన్నచేపను పెద్ద చేప మింగినట్టు చిన్న విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలు కలిపేసుకోవటం జరుగుతూనే ఉంది. విద్యార్థులను చేర్పించటానికి పీఆర్వోలను నియమించుకోవటం, మెరిట్ విద్యార్థులనూ, పేరున్న అధ్యాపకులనూ కొనేసెయ్యటం ...ఇవన్నీ మామూలైపోయాయి. కార్పొరేట్ విద్యాసంస్థల్లాగే కార్పొరేట్ ఆస్పత్రుల భారీ హోర్డింగులు మీరు చూసేవుంటారు! ఈ పరిణామాల గురించి మీ ధర్మాగ్రహం అర్థవంతం. అయితే ఆవేదనకు బదులు ఇవన్నీ సహజమేననే ధోరణికి ప్రజలు వచ్చేస్తున్నారు!

    రిప్లయితొలగించండి
  9. @ Venu

    True Education has sustain itself with proper investment from those who can invest. However, is it necessary that such institutions should tom tom their results in a crass manner, in very unaesthetic advertisements which only pander to the lowest of the low in the upper chamber! Being teaching institutions atleast they can be gentle and innovative in their ads and not so blatantly tasteless.

    For the people who see them, only one feeling comes, that is nausea and nothing else. If anybody is enjoying these advertisements, it must be those who made them . Its because they got money out of it and nobody else.

    My sole point in this is that such tasteless advertisements will not serve the purpose intended, but only create antagonism among the general public and become a source of irritation for anybody who sees and hears them.

    I hope the so called educational institutions realize this and mend their ways, before ultimately Government lashes its whip of control on such so called expression of their commercial intent.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.