17, అక్టోబర్ 2009, శనివారం

అమరావతి కథలు సమీక్ష 5


పండుగలు, పండుగ రోజున పొద్దున్నే తలంట్ల హడావిడి, తరువాత కొత్త బట్టల ధరించటం ఆ కొత్త బట్టల్లో మురిసిపోతూ చుట్టాలింటికి, స్నేహితులదగ్గరకి వెళ్ళటం, ఎంత హాయి అయిన రోజులు-దాదాపు పది, పదిహేను సంవత్సరాలు వచ్చేవరకు ఉంటుంది ఈ అమాయకమైన సంతోషం, ఆనందం. ఆ తరువాత ఏమౌతుందో మరి కనపడదు మాయమైపోతుంది. కారణం, ఎవరికివారికి తనంతట తానుగా అలోచించగలుగుతున్న విషయం తెలియటమా, లేక రేపొకరోజు ఉన్నది, ఇలాగే గడిపెయ్యలేము అన్న నిజం గ్రహింపుకు రావటమా, కొద్ది కొద్దిగా నాది, నేను, లాంటి అలోచనలు చిగురించటమా, లేక వీటన్నిటి కలగలుపా? తెలియదు!!! కాని, ఆనాటి ఆనందాలను మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటూ ఉంటే ఎంతో ఉత్తేజం హుషారు కలుగుతుంది కదూ. అలాంటి అవకాశాలను అమరావతి కథలు అనేకసార్లు కలుగ చేస్తాయి. ఈ దీపావళి పండుగ శుభ సందర్భంగా హాయిగా చదివి ఆనందించుదురు గాక.

ఈ దీపావళీ సందర్భంగా,లక్ష్మీ దేవి మీ అందరిమీద తేజోమయమైన ఆశీస్సులు కురుపించాలని ఆకాక్షిస్తూ, జయదేవ్ గారు నామీద ప్రేమతో పంపిన కార్టూన్ శుభాకాంక్షలను మీ అందరితో పంచుకుంటూ మరొక్క ఐదు "అమరావతి కథలు" అనేటువంటి "మణిపూసలు".

21.లేగదూడ చదువు
ముఖ్య పాత్రలు-చిట్టి, లేగదూడ
బాపు బొమ్మ-అమాయకంగా చిన్నారి చిట్టి తాను నేర్చున్నాననుకున్న అక్షరాలు లేగదూడకు చూపించబోతుంటే, ఆ అక్షరాలను నాకి చెరివేస్తుంటుంది లేగదూడ. ఈబొమ్మ కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండును, ముద్దులొలికే ఈ రెండు ప్రధాన పాత్రలను చక్కగా చూడొచ్చు అనిపించే విధంగా చిత్రించారు.
కథ-గ్రామీణ వాతావరణాన్ని చక్కగా మన కళ్ళముందుంచారు రచయిత. పిల్లలు పొద్దున్నే లేవటం, బడికి వెళ్ళటం, లేగదూడ గంతులు, నాలుగేళ్ళు నిండని చిన్నారి చిట్టి చదువుకోవాలనే తాపత్రయం, చిట్టి-లేగదూడల సాన్నిహిత్యం కథలోని ఆకర్షణలు. గ్రామీణ ప్రాంతంలోని పిల్లల అమాయకత్వం, ముద్దు ముచ్చట్లు ఎత్తిచూపుతూ, చివరలో "బళ్ళోవెయ్యని పసిపాపకటే,నోరులేని లేగదూడకంటే చాలా చదువుకొన్నాం మనం కాని...." అని ముగిస్తూ మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్న ప్రపంచంమీద ఒక చురక వేసి ముగించారు.

22.ఆవతలొడ్డు పొంగింది
ముఖ్య పాత్రలు-పిల్లలు
బాపుబొమ్మ-కృష్ణమ్మ తల్లి శిరోజాలే అలలుగా వాటిమీద పిల్లలుతో నిండిన లంక, పైన పూర్ణ చంద్రుడు, పిల్లల వంక మురిపెంగా చూస్తున్నట్టు కృష్ణమ్మ.
కథ-స్థూలంగా, చీకటిపడేప్పటికి లంకలో చిక్కుకుపోయి గాభరాపడుతున్న ఒక అభాగ్యుణ్ణి రక్షించటానికి పిల్ల సైన్యం మొత్తం ఒక పడవను ఎత్తుకుకుని పోయి ఆ లంకలో వాళ్ళూ చిక్కడిపోవటం, వారిని రక్షించటానికి వారి పెద్దలు పడ్డ ఆరాటం, కంగారు, ఇంతాచేసి చివరకు, పిల్లలంతా పెద్దల్ని చూసినాక, తాము తెచ్చుకున్న ప్రమాద పరిస్థితి మర్చిపోయి, ఆటల్లో మునిగి పోవటం, ఒక దృశ్యకావ్యంగా కనపడుతుంది. అప్పటి కాలంలో పిల్లలు "చర్ పట్టి, కుందులు" అనే ఆటలు ఆడుకునేవారని చదువరులకు తెలుస్తుంది. పిల్లల్లో ఉండే సహజ సాహసాసక్తి, పరోపకార బుద్ధి చక్కగా వర్ణంచబడింది.అంత రాత్రిపూట, ఊళ్ళోని పిల్లలూ పెద్దలూ లంకలోకి చేరటమే ఆవతలొడ్డు పొంగటం.

23.మే! మే! మేకపిల్ల
ముఖ్యపాత్రలు-బాలుడు పోలయ్య, గ్రామీణులు
బాపు బొమ్మ-మెడనున్న తాడుతో సహా పారిపోతున్న మేకపిల్ల ఒక పక్క, అమాయకపు ఆనందంతో తెళ్ళిపోతున్న పోలయ్య మరొకపక్క, మధ్యలో నాలిక బైటపెట్టినా రౌద్రం లేని అమ్మవారు, నాకీ బలులు కావాలా అనుకుంటున్నట్టుగా చక్కటి చిత్రం.
కథ-ఇక్కడకూడ సంఘటనా వర్ణనమే కాని, అంతర్లీనంగా జంతుబలుల గురించిన మానవత్వపు వీక్షణ కనపడుతుంది. ముత్తాలమ్మ జాతర్లో తనకు కావలిసిన దానికోసం దేవుడి పేరు చెప్పి గణాచారి గలాభా, ఇదే సందని గ్రామీణులందరూ తప్పతాగటం, గ్రామీణ జాతర విశేషాలను అద్దంపడతాయి. బలికోసం తేబడ్డ మేక మీద జాలిపడి పోలయ్య దానిని వదిలించటం, అది సురక్షితంగా పారిపోవటం చూసి పోలయ్య అనందించటంతో కథ ముగుస్తుంది.

24.కాకితో కబురు
ముఖ్య పాత్రలు-పల్లె పడచు జువ్వి,చింతాలు మామ,
బొమ్మ-జువ్వి చొట్టూ చేరిన కాకులు, ఉడుతలు, ఛిలుకలు. సూచనప్రాయపు బొమ్మ కాదిది, సీదాగా కధాంశ ప్రతిబింబమే.
కథ-ప్రధానాంశం జువ్వి , చింతాలు మధ్య ఉన్న ప్రేమానురాగాలు. చింతాలు కోసం పరితపించి పోతూ, జువ్వి తన మనోభావాలను కాకులతోనూ, ఉడుతలతోనూ, చిలకలతోనూ అమాయకంగా పంచుకుంటూ ఉంటుంది.చింతాలు మావ కోసం దిగులుతో ఏడ్చి, తానేడ్చినట్టు చింతాలుకి తెలియ కూడదని అనుకుంటుంది. ఆర్ధిక పరంగా సమాజంలో అట్టడుగున ఉన్న చింతాలు-జువ్వి ల ఉదాత్త మనోభావాలు, వారి వారి ప్రేమ వ్యక్తీకరణ చక్కగా మలచారు రచయిత.

25.తులసి తాంబూలం
ముఖ్య పాత్రలు-వామనాచార్లు, ఆయన భార్య తాయారమ్మ
బాపు బొమ్మ-తులసి కోటకు చెరొకపక్క ఆకలితో డస్సిపోయి చేరగిలిపడి ఉన్న వామనాచార్లు-తాయారమ్మ దంపతులు
కథ-ఏ రోజుకారోజు భక్తులు ఇచ్చే కానుకలమీద ఆధారపడి జీవించే ఒక పూజారి దీన గాధ. పాదుకల పళ్ళేంలో పడిన ఒక అర్ధరూపయతో ఆరోజు గడుస్తుందని ఆశ పడిన వామనాచారి, ఆ అర్ధ రూపాయ సుబ్బయ్య పాలిట పడటంతో దిమ్మెరపోతాడు. ఆరోజుకి తిండి లేక పోతే తులసి ఆకులే వారికి ఆహారమవుతాయి. దేవుడిచ్చింది తమకింతేనని తృప్తిపడిన ఆ పేద దంపతులకు తులసి తాంబూలంతోనే నోరు పండిందని చెప్పి కథ ముగిస్తారు రచయిత.

1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.