5, నవంబర్ 2010, శుక్రవారం

చందమామ సంపాదకుని రేడియో జ్ఞాపకాలు

మా రేడియో, మా ప్రపంచమూ...

పల్లె జీవితంలో రేడియో తెల్లవారకముందు అమ్మ పూజ చేస్తూ స్నానం చేసిన తర్వాత పూజ చేస్తూ భక్తి సంగీతం, భక్తి పాటలు వినడంకోసం రేడియో ఆన్ చేయడంతో మా ఇల్లు, పల్లె కూడా తెల్లారేది. సేద్యం పనులు, పొలంపనులు ఉన్నప్పడు వేకువ జామున నాలుగు గంటలకే పల్లె మేల్కొంటుంది. ఎద్దులకు కుడితి తాపి, మడక బండిలో వేసుకుని పొలం కేసి బయలుదేరేముందు చద్ది తాగి ఏడుగంటల వరకు మళ్లో పనిచేయడం..

ఊరి పక్కన పొలాల్లో పనిచేస్తున్నప్పుడయితే సరిగ్గా ఏడున్నరకు కడప రేడియోలో పాటల కోసమో మడి వద్దనుంచి ఏదో ఒక వంక పెట్టుకుని ఇంటికి వచ్చి 15 నిమిషాలు పాత పాటలు వినేసి మళ్లీ పరుగెత్తడం.. ఆ లోపలే నాన్నగాని, తాత గాని చూసారంటే పనిమాని పాటలు వింటున్నందుకు తిట్లు తప్పేవి కాదు మరి.


ఘంటసాల భగవద్గీత
ఎమ్సెస్ రామారావు సుందరకాండ.
పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం (ఆడెనమ్మా శివుడు ఆడెనమ్మా భవుడు అంటూ పుట్టవర్తి వారి స్వరం రేడియోలో తాండవిస్తుంటే శివుడు తాండవమాడుతున్నట్లే అనిపించేది మాకు ఆ వయసులో.. )

ఘంటసాల లలితగీతాలు తలనిండ పూదండ దాల్చిన రాణీ, మొలకా నవ్వుల లోన వినిపించరావే.., బహుదూరపు పా

ఘంటసాల పద్యాలు.. పల్లెటూర్లలో బాల్యాన్ని ఉద్దీపింపజేసిన దివ్యగాన ఝరి


భానుమతి, సుశీల, లీల,జిక్కి, వసంతకుమారి, కోమల, మోహన్‌రాజ్, పిబి శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం,
పాటలతో దివ్యత్వాన్ని అనుభవించిన మధుర భావనలు మాకు రేడియో ద్వారానే అందాయి.

కేవలం రేడియోలో పాటలు వింటూ వాటిని స్పీడుగా రాసుకుంటూ 75 నుంచి 82 వరకు నాలుగు 200 పుటల పుస్తకాలలో 1200 మరపురాని పాటలను ఎక్కించుకున్న బాల్యం నాది.

ఒక సారి విన్నప్పుడు పాటను పూర్తి చేయలేక పోతే మరోసారి ఆ పాట రేడియోలో వచ్చే దాకా కాచుకుని ఉండి రెండో సారి, మూడోసారి పాట వింటూ పూర్తి పాట రాసుకుని ఎగిరి గంతేసేవాడిని..

ఇవ్వాళ ఆ పుస్తకాలు లేవు. ఆ పాటలు లేవు. అమృత సమానమైన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. పై చదువులకు, తర్వాత సామాజిక ఉద్యమాలకు జీవితం మలుపులు తిరిగిన క్రమంలో పాటల పుస్తకాలు పోగొట్టుకున్నాం. 1980 నుంచి 83 దాకా నాలుగేళ్లపాటు డజను నోటు పుస్తకాలలో నిత్యం రాస్తూ వచ్చిన డైరీలూ పోయాయి. రాయచోటిలో శంకరాభరణం సినిమా వస్తే వెర్రి ఉన్మాదంతో రోజు మార్చి రోజు అర్థ రూపాయి టిక్కెట్టుతో నేలమీద కూర్చుని 13 సార్లు చూసి సినిమా హాల్ లోనే పుస్తకంలోని డైలాగులను మొత్తంగా రాసుకుని పదిలంగా కాపాడుకున్న సినిమా డైలాగుల సంపూర్ణ పుస్తకం కూడా పదేళ్ల తర్వాత పోగొట్టుకున్నాను. జీవితంలో ఒక సినిమాను ఇన్ని సార్లు చూడటం అదే మొదటిసారి, చివరి సారి కూడా...

రాయచోటి లైబ్రరీలో ఆరుద్రగారి సమగ్రాంధ్రసాహిత్యం 1,2 3 భాగాలు చూసి నివ్వెరపోయిన క్షణంలో సభ్యత్వం తీసుకుని మరీ ఇంటికి తెచ్చుకుని తెల్లవారేంతవరకు రాస్తూ -మూడు రోజులలోపు పుస్తకం ఇచ్చేయాలి మరి- నాకు నచ్చిన తెలుగు పద్యాలు, ఆ పుస్తకాల్లోని ముఖ్య ఘటనలను 3 నోటు పుస్తకాలలో నింపి పెన్నిదిలాగా దాచుకున్న రోజులవి.

ఇలా ఎన్నని గుర్తుకు తెచ్చుకోవాలి.. నిజంగా అవి నిరుడు కురిసిన హిమసమూహములే.


తెల్లవారకముందే తెలియగ నాస్వామి
మళ్లీ పరుండేవు లేరా... మళ్లీ పరుండేవు లేరా..
ప్రపంచంలో ఏ భాషలో అయినా ఏ ఇంట్లో అయినా ఒక అమ్మ తన కొడుకును ఈ విధంగా నిద్రలేపడం జరుగుతుందంటే నాకయితే నమ్మబుద్ధి కాదు. మన మానసిక ప్రపంచావరణలను మైమరపించి, పరవశింపచేసే ఇంతటి కమనీయ కరుణామయ పాటను ఈనాటికీ వినే భాగ్యం మనకు కలుగుతుందంటే తెలుగు వారిగా మనం చేసుకున్న భాగ్యం అనుకుంటాను. సూర్యుడింకా మొలవని ఉదయ కాలంలో, ఈ పాట వినే భాగ్యానికి నోచుకున్న పిల్లల జన్మ ధన్యం. కాదంటారా?

మా బాల్యాన్ని వెన్నెల చల్లదనం సాక్షిగా చందమామ కథలు వెలిగించడం ఎంత నిజమో కడప రేడియో వారు 70, 80ల మధ్య కాలంలో పాటలతో, పద్యాలతో చక్కటి సంగీతంతో వెలిగించడం కూడా అంతే నిజం. 1963లో తన పెళ్లి సందర్భంగా నాన్న కొన్న ఆ పిలిప్శ్ రేడియో ఓ పది పదిహేనేళ్లు మా పల్లె జీవితాన్ని పండివెన్నెలంత చల్లగా, ఆరుబయట తడిసిన ఇసుక ముద్దలంత చల్లగా పండించింది. ఎలా మర్చిపోగలం.

బిస్మిల్లాఖాన్ విషాద సన్నాయి సంగీతాన్ని మేం మొట్టమొదటగా మా కడప రేడియో ద్వారానే విన్నాం. ఆ సన్నాయి పలికింది ఎవరో తెలియదు.. అమ్మ తర్వాత చెప్పింది. తను ఫలానా అని. మానవ విషాదాన్ని సంగీత ప్రకంపనల ద్వారా నోటితో ఆలపించిన ఆ అమరగానం ఎప్పుడు విన్నా సరే కళ్లు చమరుస్తాయి.

తుషార శీతల సరోవరానా అనంత నీరవ నిశీధిలోనా అంటూ లీల పాడే.. వెన్నులో చలి పుట్టించే ఆ కోమల విషాద స్వరం.. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అంటూ సుశీల దివ్య స్వరంతో పాడుతుంటే రేడియో ముందు తల వాల్చి నిశ్సబ్ద అనిశ్శబ్ద మహా వలయంలోకి ఎటో వెళ్లిపోవడం. గత అరవైఏళ్లుగా మనసున మల్లెల మాలలూగిస్తున్న భానుమతి సహజ సంగీత స్వరం పలికించిన సావిరహే తవదీనా, శ్రీకర కరుణాల వాల వేణుగోపాలా, మనసున మల్లెల మాలలూగనే పాటలలోని దివ్యత్వం...

పగలే వెన్నెలా అంటూ ఒకే ఒక్క పాటతో ప్రపంచంలోని వెన్నెలనంతటినీ పాటల ముద్దగా మార్చి మన చేతికందించిన జానకి నాద స్వరం.. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా...అంటూ ఘంటసాలతో గొంతు కలిపి గత 60 ఏళ్లుగా తెలుగు వాకిళ్లలో దివ్యగానంతో వెన్నెలను ప్రవహింపజేస్తున్న జిక్కి గళంలోని జాణత్వం...

చివరిగా ఎవరి పేరు ఇక్కడ చేర్చకపోతే ఈ మొత్తం వర్ణనకు విలువ లేకుండా పోతుందో ఆ గాన గంధర్వుడు మన ఘంటసాల దివ్య స్వరంలోంచి జాలువారిన అమృతమయమైన పాటలు, పద్యాలు, శ్లోకాలు..ఓహ్. రేడియో తప్ప మరే వినోద వస్తువూ, చివరకూ టేప్ రికార్డర్ కూడా కొనలేని ఆనాటి మాపల్లె బతుకులకు, మా బాల్యానికి వేగు చుక్కలాగా దారి చూపింది రేడియో మాత్రమే.

కృష్ణా ముకుందా మురారీ అంటూ ఘంటసాల వారు పాడిన ఆ విశ్వ గానం ఒక ఎత్తైతే ఆ పాట చివరలో అయిదు నిమిషాల పాటు వచ్చే ఆ విశ్వచలన సంగీతం జీవితంలో మర్చిపోగలమా? ఈ పాటలోని చివరి సంగీతం రేడియోలో వచ్చినా, ఇప్పుడు సిస్టమ్‌లో పెట్టుకుని విన్నా, లేక శ్రీరామ జయంతి వంటి ఉత్సవాల సందర్భంగా పల్లెల్లో గ్రామ్‌ఫోన్ రికార్డు రూపంలో విన్నా నాకు ఆ దివ్య సంగీతం తప్ప ప్రపంచంలో ఇంకేమీ కనిపించదు, వినిపించదు.

తెలుగు పద్యం ఎంత కమనీయంగా ఉంటుందో బాల్యంలో మా పాఠశాలలో తెలుగు టీచర్ సహదేవరెడ్డి గారి పద్య గానం ద్వారా విన్నాను. పాఠశాల వదిలిపెట్టాక ఇంటికి వస్తే రాత్రి, ఉదయం కడప రేడియోలో అదే పద్యాలను ఘంటసాల గొంతు పాడుతుంటే వినడం.. పద్యాన్ని చదవడం కాకుండా పాడి వినిపిస్తే ఎంత గొప్పగా ఉంటుందో మా తెలుగు టీచర్, మా ఘంటసాల బాల్యం సాక్షిగా మాకు రుచి చూపించారు. అందుకే జీవితంలో ఇన్ని దశలు మారి అయిదో దశకం సమీపిస్తున్నా, భావజాలం పరంగా నా ఆలోచనలు ఎన్ని మార్పులకు గురయినా
తెలుగు పద్యాన్ని మర్చిపోవడం నాకు సాధ్యం కావటం లేదు. మా బాల్యాన్ని ఉద్దీపింపజేసిన కమనీయ సంస్కృతి పాట, పద్యం. వీటిని మర్చిపోవడం ఎలా సాధ్యం..

ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ..

అంటరానివాడెవడంటే మా వెంటరాని వారే..
హరిజనులెవరంటే మా అనుంగుసోదరులే

ఇవి మా చిన్నప్పుడు ఆనాటికి మాకు అంతగా అర్థం కాని సామాజిక అసమానతలను, సమస్యలను రేడియో పలికించి వినిపించిన చైతన్య గీతాలు. ఈ దేశం ఇంకా మనుషులతో కూడిన దేశంగా లేదని బానిసలు, బానిస యజమానులు మాత్రమే ఉన్న దేశమని లీలగా, అస్పష్టంగా మాకు తలపించిన పాటలివి.

రేడియోలో పాట వింటూ బాణీపై పట్టు సాధించడం రెండు మూడు సార్లు వినగానే పాటను జ్ఞాపకంలా మార్చుకుని దాన్ని సాధన చేయడం. ఊరిదగ్గర పొలాల్లో సేద్యం పనులు చేసేటప్పుడు, ఊరికి దూరంగా చేలలోకి వేళ్లేటప్పడు. ముఖ్యంగా గుండ్రంగా ఉండే మా ఊరి చెరువు గట్టును దాటుకుంటూ గుట్టల్లో చేలవద్దకు వెళ్లేటప్పుడు నోటికొచ్చిన ప్రతి పాటను, పద్యాన్ని, శ్లోకాన్ని గట్టిగా గొంతెత్తి ఆలపిస్తూ పోవడం. -ఎవరేమనుకున్నా గొంతెత్తి పాటడం ఆపేది లేదు-

కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్..అంటూ శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో రుక్మిణి తన కోసం రథంపై వచ్చిన శ్రీకృష్ణుడిని కనులారా చూసుకుని నిరుత్తరురాలైన సందర్భంగా ఘంటసాల పాడిన పోతన భాగవతంలోని పద్యం. కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్..

నారద తుంబురాది గంధర్వ గాయకులు కమనీయ స్వరాలన్నీ ఒక చోట చేరి అవతరించిన మానవ కరుణామయ స్వరం ఘంటసాలవారిది. ఆయన తన సినీ జీవితంలో పాడిన వందలాది పద్యాలలో అగ్రపీఠం కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ పద్యానికే దక్కుతుంది. ఈ పద్యం ఆడియో వింటూంటేనే ప్రాణం చమరుస్తుంది. ఇక సినిమా లేదా ఆ సినిమాలోని రుక్మిణీ కల్యాణ ఘట్టాన్ని మాత్రమే కట్ చేసుకుని చూస్తూ పద్యం వింటే మనకిక ప్రపంచం ఏదీ గుర్తు ఉండదు. ఘంటసాలవారు పాడిన అన్ని పద్యాల్లో ఈ పద్య గానంతో ఆయన గంధర్వ కంఠం తారాస్థాయికి చేరుకుందనిపిస్తుంది.


కస్తూరీ తిలకం లలాటఫలకే
వందేశంభు ముమాపతిం..
శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం.. సీతాపతిం..
ఏనుగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా..
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు ..
దుర్వారోద్యమ బాహుమూల..
అటజని గాంచి భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహర్ముహుర్లుఠదభంగ తరంగ
పాటునకింతులోర్తురే... కృపారహితాత్మక...
జయత్వదభ్రమద్భుంజగ

నేనొక పూలతోట కడ.. కరుణశ్రీ పుష్ప విలాపం నుండి

శ్రీశ్రీ గేయాలను బట్టీ పట్టి పాడుకునే వరకూ వచ్చింది.


ఆ చిన్న వయసులో ప్రతి పదానికి అర్థం తెలిసినా తెలియకపోయినా ముఖ్యంగా ఘంటసాల, సుశీల పద్యగానామృతాన్ని, జీవితం పొడవునా వెంటాడుతున్న ఆ ఆపాత మధుర సంగీత ఝరిని జుర్రుకుంటూ రేడియో ముందు తలవాల్చి తాదాత్మ్యత చెందిన అద్భుత క్షణాలను ఎలా మరవగలం..

ముఖ్యంగా కనీసం టేప్ రికార్డు కొనడానికి కూడా స్తోమత లేని 70ల కాలంలో పలెల్లో రేడియో ఒక వినోద సాధనంగా పేదవారికి, మధ్యతరగతికి, సకల వర్గాల వారికి పెన్నిధిగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఆరోజుల్లో పేదవారు పెళ్లి చేసుకుంటే కట్నం చదివింపులలో ఇతరత్రా ఏమి వచ్చేవో కాని పెళ్లి కొడుకు చేతుల్లో కొత్త రేడియో మిలమిల మెరిసేది.

మా ఊరికి పక్కనున్న కురవ పల్లిలో కురవ యువకులు పెళ్లి చేసుకున్నాక ఇలా కట్నం రూపంలో సంపాదించుకున్న కొత్త రేడియో పట్టుకుని గొర్రెలు, మేకలు మేపుకుంటూ ఎర్రటి ఎండలో చేలు చెలకల్లో పాటలు పెట్టుకుని వింటూంటే "అబ్బా వీళ్లదిరా జన్మంటే" అని ఎన్ని సార్లు అనుకున్నామో.

దశాబ్దాలుగా విశ్వచలన సంగీతం

విశ్వాంతరాళాల్లోంచి వస్తున్న మౌన విషాద సంగీత ఝరిని వినాలంటే అప్పుడూ,ఇప్పుడూ కూడా ఉదయాన్నే రేడియో కార్యక్రమాలు మొదలు కాకముందే రేడియో పెట్టుకుని వినాల్సిందే.. వందేమాతరం పాటను వేయడానికి ముందే రేడియోలో గత కొన్ని దశాబ్దాలుగా స్వరం లేని మౌన విషాద సంగీతం ఒకటి సంగీత ప్రియుల గుండెలను పిండేస్తూ కొనసాగుతోంది. ఒక్కసారి వింటే దాన్ని ఇక మర్చిపోలేము.

విశ్వరహస్యాలను మనముందు నిశ్శబ్దంగా ఆవిష్కరిస్తున్నట్లు.. సుదూర గ్రహాంతరాళాలనుంచి ఏదో తెలియని ప్రాణి మానవజాతికి సందేశమిస్తున్నట్లుగా గంభీరంగా, విషాదంగా, అమృతోపమానంగా ఉదయాన్నే వినిపించే ఆ మౌన సంగీతం విశ్వ చలన సంగీతంలా మనసును తాకేది. 24 గంటల పాటు ప్రసారాలు నడిచే కాలం కాదు కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రాంతీయ రేడియోలు అప్పట్లో పునఃప్రారంభ సమయంలో ఈ ప్రారంభ సంగీతాన్ని వినిపించేవి.

ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే వెంటాడే సంగీతమది. రేడియోకు దూరమైపోవడంతో ఈ మధ్య కాలంలో దాన్ని వినే భాగ్యం కోల్పోయాం. దాన్ని ఎవరయినా ఎంపీ3 పాటగా మార్చి ఆన్‌లైన్‌లో పెట్టి ఉంటే లింకు చెబితే మరోసారి జన్మ ధన్యమవుతుంది.

గత సంవత్సరం సాక్షి పత్రిక ఫ్యామిలీ ఎడిషన్ తొలి పేజీలో కుడివైపున కాలంలో ఈ రేడియో, ప్రభుత్వ టెలివిజన్ ప్రారంభ సంగీతంపై ఎవరో ఒక పాఠకుడు ఒళ్లు పులకరించే కథనం రాశారు. దాన్ని భద్రంగా తీసి ఉంచాను కాని ఇంట్లో పేపర్ల మోత గుట్టలుగా పేరుకుపోవడంతో నేను లేనప్పుడు, ఆమె యధాప్రకారం దాన్ని కూడా అంగడికి వేసేసింది. - ప్రపంచంలో పుస్తకాలు, అమూల్యమైన సమాచారం పోవడం, పోగొట్టుకోవడం, అంగడిపాలైపోవడం ముందుగా ఇంటినుంచే మొదలవుతుందనుకుంటాను-. పీత బాధలు పీతవి లెండి..

పేపర్లను భద్రంగా కాపాడుకోవడం అందులో పరాయి రాష్ట్రంలో వాటిని భద్రపర్చుకోవడం ఎంత ముఖ్యమో మనం లక్షరకాలుగా వాదిస్తే, వాటిని వదిలించుకోవడం ఎంత ముఖ్యమో, అద్దె ఇళ్లలో స్పేస్ సమస్య పరిష్కారానికి అది ఎంత అవసరమో లక్షన్నర రకాలుగా వారూ వాదిస్తారు కదా... మనం అవేమీ పట్టించుకోం కదా. ఇక్కడే మనం నోరు తెరిచి అడిగే అర్హత కోల్పోతుంటాం..


రేడియో సినిమాలు, నాటికలు

70వ దశాబ్దంలో రేడియో ద్వారా సినిమాలు, నాటికలు వినడం మరో అద్భుతం. పాత సినిమాలు చూడాలంటే ఊర్లలో టెంట్లకు పోతే చాలు. కాని దానికోసం రాత్రి 8 గంటలకు మైలు దూరం నడిచి టెంటు కెళ్లి రాత్రిపూట సినిమా చూసి నడిరేయిలో ఏరు దాటి ఊరు రావాలి. చీకటంటే భయం కాబట్టి అప్పట్లో సినిమా చూడాలంటే పెద్దవాళ్లు రావాలి, వారు అనుమతించాలి. లేకుంటే ఎంత మంచి సినిమా అయినా సరే చూడలేం.

కాని నెలలో మూడో వారమో నాలుగో వారమో మరి గుర్తులేదు నెలకు ఒక్కసారి రేడియోలో పగటి పూటే సినిమా వస్తుంది. దృశ్యం లేకుండా కేవలం ఆడియో రూపంలోనే సినిమాను వినాలంటే రేడియోనే కదా మార్గం. 72 నుంచి 80 వరకు ఒక ఎనిమిదేళ్ల కాలం ఎన్ని చక్కటి పాత సినిమాలు, నాటికలు రేడియో ద్వారా విన్నామో..

నాకు బాగా గుర్తున్న రేడియో సినిమా పూజాఫలం. సినిమా పూర్తయ్యాక చాలా కాలం నన్ను వెంటాడిన సినిమా.. ఇప్పటికీ ఎప్పుడైనా ఈ సినిమా చూశానంటే మతి పోతూంటుంది. సినిమా మొత్తం భావుకత్వం.. ఎంత చక్కటి సాప్ట్ పాత్రలు. హీరో హీరోయిన్‌లకు బదులు కథ కనిపించే సినిమా, అరుపులు, పెడబొబ్బలు లేని చల్లటి, మెత్తటి సినిమా చూడాలంటే పూజాఫలం ఒక్కసారైనా చూడాల్సిందే..

ముఖ్యంగా ఈ సినిమాలోని పగలే వెన్నెలా జగమే ఊయలా పాటను మరవగలమా..! సినీ సంగీతం బతికి ఉన్నంతవరకు తెలుగు వాళ్లకు పగటి వెన్నెలను రుచి చూపిస్తూ ఊగించే పాట. పదేళ్లుగా నా సినీ పాటల కలెక్షన్‌లో మొట్టమొదటి స్థానం దీనికే. దీని తర్వాతే ఏ పాటయినా..

1986లో అనుకుంటాను ప్రాంతీయ టీవీ ఛానెళ్ల మోత లేని కాలంలో ఓ ఆదివారం సాయంత్రం తెలుగు సాహిత్యంపై నా ఎంఫిల్ రీసెర్చ్ పనిమీద రంగనాయకమ్మ గారిని కలవడానికి హైదరాబాద్ వెళితే వనస్థలిపురం ప్రాంతంలో కర్ప్యూ వాతావరణం.. ఎందుకంటే దూరదర్శన్‌లో ఆరోజు పూజాఫలం వస్తోంది. ఇళ్ల బయట జనం కనిపిస్తే ఒట్టు.. అదీ పూజాఫలం సినిమా పవర్...

ఇలా జాతి జాతి సామూహికంగా ఒక వినోదం కోసం చెవులు రిక్కించుకుని వింటూ వచ్చిన ఆ బంగారు రోజులు మళ్లీ వస్తాయా. మన ఇంట్లో మన టీవీ, మన ఆడియో, మన కంప్యూటరూ, మనం కొని తీసుకువచ్చిన స్వంత సీడీ, డీవీడీలలోని సినిమాను ఒకరమో ఇద్దరమో పెట్టుకుని యాంత్రికంగా చూసే కాలంలో పెరుగుతున్నామిప్పుడు.

మనకు నిజంగా సామూహికానందం ఏమిటో ఇప్పుడు తెలియదేమో అనిపిస్తోంటోంది. పల్లెల్లోనూ, పట్నాల్లోనూ జీవితం చప్పిడిగా మారిపోయింది. డబ్బు సంపాదన, అమెరికాకు, కాకపోతే మరో దేశానికో పరుగులు తీయవలసిన వాతావరణంలో ఊరంతా ఒక చోట చేరి ఒక పండుగను, ఒక ఉత్సవాన్ని, ఒక హరికథను, ఒక వినోదపు ఆనంద క్షణాలను మనకు మనంగా, గుంపులో ఒకరుగా విని తరించే అవకాశం మనకు ఏనాటికైనా వస్తుందా?

కొత్త బంగారు లోకాల మాటేమిటో గాని మనదైన పాత బంగారాన్ని మన కళ్లముందే జారవిడుచుకుంటున్నాం.. నిజంగా తల్చుకుంటే బాధేస్తుంది.. 20 ఏళ్ల కాలంలో ఏం కోల్పోయామో, ఏం కోల్పోతున్నామో తల్చుకుని గుండె అవిసేలా ఏడవాలనిపిస్తుంది అప్పుడప్పుడూ.

పనిదినాల్లో అన్ని ఒత్తిళ్లనూ భరించి ఏ శనివారం సాయంత్రమో ఆదివారమో అన్ని పనులూ మానుకుని ఒక గంట సేపు నా పాత పాటల కలెక్షన్ నుంచి నరాలను కాకుండా హృదయాన్ని పిండే మా కాలం పాటలను కళ్లు మూసుకుని వారానికి ఒకసారయినా వినగలిగితే, మనసులోనే పాడుకుంటూ కన్నీళ్లు కార్చగలగితే ఎంత బావుంటుందో.


(శివరాం గారూ, ఇదీ శ్రోతగా నాకు తెలిసిన రేడియో కథ.దీంట్లో చాలా చోట్ల అతుకులను పూరించాలి. రేడియో గురించి చెప్పమంటే దాంతో నా అనుబంధం గోలే ఎక్కువయిందనుకుంటాను. ఫర్వాలేదు..ప్రచురించవచ్చు అనుకుంటే ప్రచురించండి)




















2 కామెంట్‌లు:

  1. మా బాల్యాన్ని వెన్నెల చల్లదనం సాక్షిగా చందమామ కథలు వెలిగించడం baalyam, vennela, chandamama enta amdamina baalyam anati rojulu gurtuchesaru. chala bavundi

    రిప్లయితొలగించండి
  2. AAhhaaaaa.Vennelantha challani jnapakala parimalamlanti rachana.Thanqqqqqqqqq. Naaku dadapu ilanti smruthulu.KADAPA radiotho..Maa ayyagaru PUTTAPARTHIvari sivatandavam, Oho yatrikuda, pata, inka ennenno..Kadapa radiolo TREXga pani chesi, AIR Hyd. lonu Kesavapanthula,Marella,Chinnakka,Ekambaram,Chiranjeevi,Saradasrinivasn, Nanduri vitthal..ila andaritho panicheyatm..naa adrustam..Puttaparthi Nagapadmini

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.