1, మే 2014, గురువారం

అవినీతి-అజ్ఞానం ఒక విషాద గాధ ::సత్యమేవ జయతే

 
  కార్టూన్ కర్టెసీ ఇండిపెండెంట్ ఇండియా వెబ్ సైట్  

  అవినీతి అదే మనం మాట్లాడుకునే "కరప్షన్" గురించి ఎంత వ్రాసినా చదివినా భలేగా ఉంటుంది. చదువుతుంటే మరింత బాగుంటుంది, అది ఇంకెవరి గురించో అని మన దృఢమైన నమ్మకం ఆపైన అభిప్రాయం. మనం ఎవ్వరం కూడా ఈ అవినీతిలో భాగం కాదు. అవినీతిలో భాగం అవ్వటానికి అవినీతే చెయ్యక్కర్లేదు.  కావలిసినంత  "జ్ఞానం" ఉండి  కూడా (ఇక్కడ చదువు,  అక్షరాశ్యత  అనే విషయాలను జ్ఞానంతో ముడిపెట్టే పొరబాటు నేను చెయ్యను). ఎక్కడ అవసరమో అక్కడ   ఆలోచించకపోవటమూ, ప్రశ్నించవలిసిన వాటి గురించి  మిన్నకుండటం కూడా నా దృష్టిలో అవినీతి కిందకే వస్తుంది. ఇంతటి ఆలోచన నాకెక్కడిదీ! 

ఇవ్వాళ ముంబాయిలో శలవు (మహరాష్ట్ర  ఆవిర్భావ దినోత్సవం, గుజరాత్ నుండి విడిపడి, ప్రత్యేక రాష్ట్రం అయిన సందర్భం) అందుకని, బ్లాగులో మధ్య ఏమీ వ్రాయటం లేదు కదా, ఏమన్నా వ్రాద్దామా, నిన్న చిరంజీవిని ఆ కుర్రాడెవరో భలే అడ్డుకుని బుధ్ధి చెప్పాడు,  దేశం మొత్తంలో "సెలబ్రిటీ" అయిపొయ్యాడు, నేనైతే అలా ఆపగలిగేవాడినా అని గతుక్కుమని, భుజాలు తడుముకుని,  అతని గురించి వ్రాద్దామా అంటే చాలామంది ఇప్పటికే వ్రాశారు పైగా నిన్న న్యూస్ చానెళ్ళవాళ్ళు విసుగొచ్చేవరకూ చూపించే ఉంటారు అని ఊరుకున్నాను. సరే ఇంకా ఈ చిరంజీవి ప్రహసనం చూడని వాళ్ళు ఈ  క్రింది లింకు నొక్కి చూడవచ్చు

అలా అనుకుంటూ, మా స్నేహితుడు రికార్డ్ చేసిచ్చిన "సత్యమేవ జయతే" రెండో సీజన్ రికార్డింగులు పెన్ డ్రైవ్లో ఉన్నాయన్న జ్ఞాపకం వచ్చింది. తీసి చూడటం మొదలు పెట్టాను. అమీర్ ఖాన్ బృందం ఈ కార్యక్రమలను అద్భుతంగా తయారు చేస్తున్నారు, అమీర్ ఖాన్ ప్రజెంట్ చేసే విధానం హాయిగా ఉండి అంతటి పెద్ద కార్యక్రమాన్ని(ప్రతి కార్యక్రమం గంటా పైగా ఉన్నాయి) పూర్తిగా చూసేట్టుగా చెయ్యగలుగుతున్నది. నేను చూసిన కార్యక్రమం, అవినీతి మీద. కార్యక్రమాన్ని ఒక కథతో మొదలు పెట్టాడు అమీర్. ఆ కథ చాలా బాగున్నది.  ఆ కార్యక్రమాన్ని చూసి ఆనందించేప్పుడు ఆ కథ మీరు వినవచ్చు.  నన్ను  ఈ కార్యక్రమంలో బాగా ఆకట్టుకున్నవి  మూడు పరిశీలనాత్మక విషయాలు.
  1. ప్రజల అజ్ఞానం-టాక్సులు కట్టటం లేదని, టాక్స్ అంటే ఆదాయపు   పన్నుమాత్రమే అని.
  2. దేశంలో మనమెవ్వరమూ ధనికులం కాదని, దేశ సంపత్తికి మనకు సంబంధం లేదని అదింకెవరిదో అని
  3. అవినీతి ప్రత్యక్ష ఫలితం-ఒక విషాద గాధ   

1.       ప్రజల అజ్ఞానం: అక్కడ సత్యమేవ జయతే కార్యక్రమంలో పాల్గొనటానికి  వచ్చిన ప్రేక్షకుల ను అమీర్ ఒక ప్రశ్న వేశాడు. మీలో ఎంతమంది టాక్సు కట్టటం లేదు అని. అక్కడ చొక్కాలు పాంట్లల్లోకి  దోపుకుని వచ్చినవాళ్ళే ఎక్కువ. అల్లాంటి వాళ్ళే దాదాపుగా సగం మంది చేతులు ఎత్తారు. వాళ్ళెవ్వరూ  టాక్సులు కట్టటం లేదట! మీరు సరే,  దేశంలో చాలా మందిని అడిగాము వాళ్ళు ఏమిచెప్పారో చూడండి అని ఒక వీడియో చూపారు అమీర్. అందులో ఒక బాండ్ మేళం ఆటను కోడా ఉన్నాడు. ఏదో బాండు మేళం వాయించుకునే వాళ్ళం మాకు టాక్సులు ఏమి ఉంటాయి అన్నాడు. మీరు కూడా ఆ వీడియో చూడండి.

     అందరి దృష్టి ఏమంటే టాక్స్ అనంగానే ఆదాయపు పన్ను (Income Tax) అని మాత్రమే! విచిత్రం అన్ని  రంగుల  కాలర్ల వాళ్ళు కూడా ఏక కంఠంతో  చెబుతూ ఉంటే ఆశ్చర్యం కలిగింది. అక్కడ  ఉన్నవాళ్ళకు,  చూస్తున్న టివి ప్రేక్షకులకు తెలియ చెప్పటానికి స్పెషలిస్ట్ ఒకావిణ్ణి తీసుకొచ్చి ఆవిడ చేత ఈ   సామాన్య విషయం అంటే  ప్రత్యక్ష పన్నులు, అప్రత్యక్ష పన్నులు ఉంటాయని, మనం పన్ను అనుకునేది ప్రత్యక్ష పన్ను అంటే ఆదాయపు పన్ను అని, మనం కొనే ప్రతి వస్తువు, మనం వాడుకునే ప్రతి సేవ కూడా పన్నుతో (సేల్స్ టాక్సు, సర్వీస్ టాక్సు మొదలగునవి) కలిపి ధరలో కడుతున్నాము. సరే! మన దగ్గర ఈ పన్నుతో కలిపి ధర తీసుకుని, పన్ను కట్టని వాళ్ళూ  ఉన్నారు అనుకొండి, అది కూడా  అవినీతే. ఏ మినిష్టరూ చెయ్యటం లేదు ఈ దోపిడీ మనకు తెలిసిన, మనలాంటి మనుష్యులే చేస్తున్నారు. ఇంత మందికి రోజూ ఏమి కొన్నా, తిన్నా, తాగినా కూడా టాక్స్ కడుతున్నాము అన్నవిషయం తెలియక పోవటం   ఆశ్చర్యం అదే అజ్ఞానం. దీనివల్లే మనం కట్టిన టాక్సులు "ఘొటాలాలో" దోచుకు పోతూ ఉంటే అదేదో సరదా కబురు లాగా ప్రజలమైన మనం చెప్పుకుంటున్నాము. 


2. దేశ సంపత్తి మరెవరిదో మనది కాదు!:  పై ప్రహసనం అయ్యిన తరువాత, అమీర్ అక్కడి ప్రేక్షకులను,  మీలో  పది లక్షల కంటే ఎక్కువ సంపత్తి ఉన్నవాళ్ళు ఎందరు అంటే  నలుగురో ఐదుగురో చేతులు పైకెత్తారు. మన దేశంలో ఉన్న 120 కోట్ల ప్రజలు కూడా లక్షాధికారులే కాదు, లక్షలకు అధికార్లు అని చెబుతూ అదెలాగో వివరించటానికి ఒకాయన్ను వేదిక మీదకు  తీసుకు వచ్చాడు అమీర్. ఆయన తనకు ఇచ్చిన తక్కువ సమయంలో దేశం మొత్తం  లో ఉన్న సంపద మొత్తం లెక్క కట్టటం తన వల్ల  కాలేదనీ, ఆ సంపదలో సగం మాత్రం లెక్క కడితే మొత్తం ఐదువేల లక్షల కోట్లు (5000000000000000)అనీ, ఆ మొత్తాన్ని ప్రజలందరిది, ఒక్కొక్కరికి నలభై లక్షలు వస్తుందని అమీర్ చేత పైన వ్రాసిన అంకెను సున్నాలు పెట్టిస్తూ ఆసక్తికరంగా వివరించారు. ఈ వ్యవహారం మొత్తం కూడా ఈ కింది వీడియోలో చూడవచ్చు:



 2. అవినీతి ప్రత్యక్ష ఫలితం-ఒక విషాద గాధ: మన ఆంధ్రప్రదేశ్ లో సోషల్ ఆడిట్ ప్రవేశ పెట్టారుట అంటే  ప్రభుత్వం అమలు  పరిచిన పథకాలు ఎంతవరకూ ప్రజల వరకూ వెళ్ళాయో తణిఖీ చేసే విధానం. ఈ విషయంలో అధికారిగా ఉన్న సౌమ్య కిడంబే తాను చేస్తున్న పనికి స్ఫూర్తి ఎక్కడ నుంచి వచ్చింది అని అడిగినప్పుడు, ఆవిడ రాజస్థాన్లో పనిచేస్తున్న రోజుల్లో తన దృష్టికి వచ్చిన అతి దయనీయమైన సంఘటనను దాదాపుగా కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ వివరించారు . ఆ సంఘటనా వివరాలు నేను చెప్పటం కంటే వీడియో చూస్తేనే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.


 ఈ కార్యక్రమం గురించి నేను వ్రాసినది అతి తక్కువ. పూర్తీ కార్యక్రమం చూస్తేనే ఈ అవినీతి, అవినీతి నశించాలి అని ఫ్యాషన్ కోసం అరిచి ఫేస్ బుక్కుల్లో గోల చేసుకోవటం కంటే ఇంకా చెయ్యాల్సినది ఎంతో ఉన్నాడని తెలిసే అవకాశం  ఉన్నది. కాబట్టి, ఈ కార్యక్రమం   పూర్తిగా చూద్దామనుకునే వారికి వీలుగా యు ట్యూబులో ఉన్న ఈ కార్యక్రమం లింకు ఇవ్వబడినది.



అమీర్ ఖాన్ బృందం సమర్పిస్తున్న ఒక అద్భుత కార్యక్రమం                           సత్యమేవ జయతే



















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.