12, ఆగస్టు 2018, ఆదివారం

ఫ్రంటులు-ప్రజాస్వామ్యమూ

 Image result for democracy?
ప్రజాస్వామ్యం, ఎన్నికలు అంటే ఏమిటి! ఫలానా పార్టీని,  మేము కొంతమంది విడి విడిగా నుంచున్న పార్టీలు ప్రభుత్వంలోకి రానివ్వం అని భీకర నినాదాలు చెయ్యటమా! ఫలానా పార్టీ అందరి  కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపొయ్యే అద్భుత సంఖ్య 272 వాళ్ళకు దఖలు పడలేదు. అంతే! ఇక నాటకాలు మొదలు. ఆ ఎక్కువ వచ్చిన వాళ్ళను ఎలా ప్రభుత్వం ఏర్పరచకుండా ఎన్ని పనులు చెయ్యాలో ఎవరితో కలువవచ్చో లేదో చూసుకునే ప్రశ్నే లేదు. ఎవడితోపడితో వాడితో చెయ్యి కలపటం ప్రజాస్వామ్య పరంగా ఎక్కువ సీట్లు వచ్చినవాణ్ణి అణగతొక్కటం. పైగా ఒక వితండ పిడివాదన. మా అందరినీ కలిపితే   మీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి, కాబట్టి ఎక్కువ మంది ప్రజలు మిమ్మల్ని వద్దను కుంటున్నారు అని ప్రవచించటం మనం చూస్తూనే ఉన్నాము.

ఒక పార్టీ ఎడ్డె మంటే, మరొక పార్టీ తెడ్డె మనే  కప్పల తక్కెడ కూటములు మళ్ళీ వీటిల్లో మొదటిదిట, రెండోదిట ఇకేమైనా సరే ఆ ఇద్దర్నీ కాదని మమ్మల్ని వరించమని సింగారించుకుంటున్న, దిక్కూ దివాణం, ముక్కూ ముఖం తెలియని కుల పార్టీలు, భాషా పార్టీలు, ఏక వ్యక్తి  పార్టీలు, వీళ్ళను ఉసికొల్పుతో విదేశీ ఇజాల పార్టీలు కొన్ని,  వాళ్ళ వేషంలో మరికొందరు కొన్ని దేశవాళి పేర్లతో. వీళ్ళుట  ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికట. వాళ్ళ పార్టీల్లో లేని ప్రజాస్వామ్యం దేశంలో తీసుకువస్తారుష

ఒక్కో పార్టీలో ఒక్కో కుటుంబం పాతుకు పోవటం, లేదా ఒక వ్యక్తీ చుట్టూ కొన్ని కొన్ని కారణాల వల్ల ఏర్పడినవి, విదేశాల నుంచి దిగుమతి ఐన ఇజాల పార్టీలు, ఇవి మహా ఘటబంధన్ ట. ఇలాంటి వెర్రి కూటములు 1977 లో అధికారంలోకి వచ్చి నిలబెట్టుకోలేని పిచ్చి జనతా పార్టీతోనే మొదలు కాలేదు ఈ కూటముల "ఆటలు"  స్వాతంత్ర్యం వచ్చినాక కాంగ్రెస్ లో ఇమడలేక, లేదా అక్కడ నిరుద్యోగులైన నాయకులు సుభాషితాలు వల్లిస్తూ అదనీ ఇదనీ పార్టీలు పెట్టి అభాసు పాలవుతూనే ఉన్నారు. "జనతా ఫార్స్"  లోంచి బయటకు వచ్చిన ఒక్కటే పార్టీ కొన్ని దశాబ్దాలు కష్టపడి మొదటి నుంచి అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించే స్థితికి 1990 లకు రాగలిగింది. 

మన   దేశానికి 68 ఏళ్ల  క్రితం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సరిపోతుంది అనుకుని ఆ విధంగా ఏర్పరుచు కున్నాము. కాని పోను పోను ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం వెర్రి తలలు వేసి ప్రజాస్వామ్యాన్నే  అపహాస్యం  చేసి పరిస్థితికి వచ్చిందని నా ఉద్దేశ్యం. 

ఇంగ్లాండ్ ను అనుకరిస్తూ ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం  బదులుగా, అమెరికాలో లాగా దేశానికి అధ్యక్షుణ్ణి , రాష్ట్రానికి గవర్నర్ ను సీదాగా ప్రజలే ఎన్నుకునే పధ్ధతికి  మన రాజ్యాంగాన్నిమారిస్తే తప్ప, ఈ చిల్ల పార్టీలు, విదేశీ ఇజాల పార్టీలు అన్నీ కలిసి చివరకు మన దేశంలో ప్రజాస్వామ్యం అనే మాటకు అర్ధం లేకుండా చేస్తాయి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.