1, అక్టోబర్ 2009, గురువారం

"సురేఖ" ఏమి నీ సొగసు!



సురేఖ అని చూడగానే/వినగానే మహిళ అనిపించే పేరుతో 1958 నుండి వ్యంగ్య చిత్రాలు గీస్తున్న వీరి అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. "సురేఖ" అన్నపేరు పెట్టుకోవటనికి వెనుక కధ, వీరికి మంచి గీతల మీద ఉన్న మమకారం మరియు అప్పటికే పేరు తెచ్చుకున్న బాపు మీద గౌరవం. బాపుకు ఉన్న మరొక కలం పేరు రేఖ (ఎవరికన్నా తెలుసా ఈ విషయం!). ఆ రేఖను తీసుకుని ఆ పదానికి "సు" తగిలించి, సు + రేఖ = సురేఖ గా సంధించి పాఠకుల మీదకు తన వ్యంగ్య చిత్రాలను వదలటం మొదలు పెట్టారు. సురేఖ అంటే మంచి గీత లేదా శుభ్రమైన గీత అని అర్ధం. తన "కుంచె" పేరును సార్ధకం చేసుకుంటూ, మరొక పక్క ఒక పెద్ద బాంకులో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ తనవంతు సాహిత్య సేవ దశాబ్దాలపాటు కొనసాగించారు. పదవీ విరమణ తరువాత తనకున్న అనేక అభిరుచులతో పాటు వ్యంగ్య చిత్ర రచనకూడ కొనసాగిస్తున్నారు .

వ్యక్తిగతం
వీరు ఒంగోలు పట్టణంలో మే 28, 1941న జన్మించారు. వీరి తల్లితండ్రులు మట్టెగుంట వెంకట సుబ్బారావు మరియు మట్టెగుంట సీతాలక్ష్మి. చదువు బి ఏ వరకు జరిగింది. ఆ తరువాత భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేశారు. బాపు అంటే అభిమానంతో కార్టూనింగ్ నేర్చుకోవటానికి ఆద్యమైంది. బొమ్మలు గీస్తూ, వాటికి మంచి సంభాషణలను అతికిస్తూ ఉండేవారు. పదిహేడు సంవత్సరాల వయస్సులో ఇతని మొట్టమొదటి వ్యంగ్య చిత్రం 1958లో ప్రచురితమయ్యింది. వీరి వివాహం 1963లో పద్మతో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు-మాధురి, మాధవి, కుమారుడు సాయికృష్ణ. అంచెలంచెలుగా ఎదుగుతూ, డిప్యూటీ మానేజరుగా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం రాజమహేద్రవరంలో నివశిస్తున్నారు. వీరి అభిరుచులు గ్రామఫోను రికార్డులు సేకరించటం. పాత చందమామ లను చదువుతుండటం (వీరితని దగ్గర 1959 నుండి చందమామలు ఉన్నాయట), స్టాంపులు, పాత నాణాలు కూడ సేకరిస్తూ ఉంటారు. 2004 సంవత్సరం నుండి రాజమండ్రిలో హాసం క్లబ్ నిర్వహిస్తున్నారు. స్వయంగా వ్యంగ్య చిత్రకారులయిన వీరికి అభిమాన కార్టూనిస్టులు బాపు, బాబు, జయదేవ్, శ్రీధర్,సరసి

మొదటి ప్రచురణ
వీరి మొట్టమొదటి వ్యంగ్య చిత్రం 1958లో ఆంధ్రపత్రిక లో ప్రచురితమయ్యింది. ఆ తరువాత మంచి హుషారుగా అసంఖ్యాకంగా అనేక కార్టూన్లు వేసి ఆంధ్ర పాఠక లోకాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. మొదటి కార్టూన్ చూస్తే సంతకం అప్పారావు అని ఆంగ్లంలో చేసినట్లు కనబడుతుంది. తరువాత తరువాత కార్టూన్ల ప్రచురణ పెరిగిన తరువాత, కలం/కుంచె పేరు ను "సురేఖ" గా మార్చుకున్నారు.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకత
ఒకే మాట, వ్రాసే పద్ధతిలో, పలికే పద్ధతిలో రకరకాల అర్ధాల్ని స్పురిస్తాయి. ఒకలాగే కనబడే మాటలు, సందర్భాన్ని బట్టి వేరువేరుగా అర్ధం చేసుకోవాలి. లేకపోతే సమాచార అంతరం (Communication Gap) ఏర్పడి గందరగోళం అవుతుంది. అటువంటి పరిస్థితులను నిశితంగా పరిశీలించి, నిజ జీవితంలోనుండి పెకలించి వ్యంగ్య చిత్రాలలో జొప్పించటం వీరి ప్రత్యేకత. మాటలలోని శ్లేష ను ప్రధానాంశంగా కార్టూన్లు వెయ్యటం అంత సులభంకాదు. వీరి కార్టూన్లు చూస్తే మటుకు సులభమనిపుస్తుంది. కాని, మరొక అటువంటి సంఘటన ఉందా అని పరికిస్తే, ఏమీ తట్టదు. వీరి వ్యంగ్య చిత్రాలు చక్కగా పేరుకు తగ్గట్టుగా శుభ్రంగా ఉంటాయి. బొమ్మలోని మిగిలిన వివరాలకు, పాత్రలకు సరిగ్గా సరిపోయే నిష్పత్తి ఉంటుంది. వీరి కార్టూన్లు, తెలుగులోని అన్ని ప్రముఖ వార/మాస పత్రికలల ప్రచురింబడినాయి. ఆంగ్ల పత్రిక కార్వాన్‌లో కూడ ప్రచురించబడినాయి. వ్యంగ్య చిత్రాలు సంపుటి "సురేఖార్టూన్లు" అన్న పేరుతో వెలువడింది.

చందమామ ప్రియుడు
మరొక ముఖ్య విషయం! ఈయన తెలుగు చందమామకు వీరాభిమాని. ఎంతంటే, చిన్నతనం నుండి చందమామలను పోగుచెయ్యటమే కాకుండా, వాటన్నిటిని చక్కగా బైండు చేయించి, జాగ్రత్తగా కాపాడు కుంటూ వచ్చారు. ఎవరికి పడితే వారికి ఇవ్వరు వారి నిధిలోని చందమామలను. అలా అని ఎవరికీ చూపించకుండా కూడ ఉండరు!! ఈ మధ్య, వారి జన్మదిన సందర్భంగా చందమామల ప్రదర్శన ఏర్పరిచి చందమామ అభిమానులను అలరించారు. సేకరించిన పుస్తకాలను జాగ్రత్తగా పెట్టుకోవటానికి వీరి దగ్గర ఒక అద్భుతమైన నినాదం ఉన్నది-"నా కొత్త పుస్తకం ఎవరికీ ఇవ్వను. అవి ఇప్పుడు మీకు పుస్తకాల షాపులో దొరుకుతాయి కాబట్టి. నా పాత పుస్తకాలు ఎవరికి ఇవ్వను, అవి నాకు ఎక్కడ దొరకవు కాబట్టి".

ప్రముఖుల అభిప్రాయాలు
ముళ్ళపూడి వెంకటరమణ-...."ఆయన రాతా గీతా మిళాయించారు. రాత మీద జొరబడిన గీత - రాత లేకుండా గీతా...ఎన్నో నవ్వులు గుబాళించాయి. బాంకాఫీసరుగా డబ్బుని అప్పులిచ్చి పుచ్చుకున్న అప్పారావుగారు-ఇవి మాత్రం ఎక్కడా అప్పు చేయకుండానే లా-గీయించేశారు......"
జయదేవ్-సురేఖ కార్టూన్లు ఎప్పట్నించో చూస్తూ ఆనందిస్తున్న అనేక వేల తెలుగు పాఠకుల్లో నేనొకణ్ణి. నాకు ఆయన కార్టూన్లలో నచ్చిన అద్భుతమైన వ్యాఖ్య "మా అల్లుళ్ళు మా అమ్మాయిల మాటలు చక్కగా వింటారు! మా వెధవే వాళ్ళావిడ ఎంత చెబితే అంత!!" ఇంత చక్కగా వ్యాఖ్య కార్టూనిస్ట్ బాబు మాత్రమే వ్రాయగలడు.
సరసి-కార్టూనిస్ట్-కార్టూనికి ఐడియా ప్రాణం. ఐడియా వస్తే దాన్ని గీతల్లోకి తర్జుమా చేయడం సులభమే. ఐడియా బాగుంటే 90 శాతం మార్కులు పడిపోతాయి. అలాంటి ఫుల్ మార్కులు కొట్టేసే అద్భుతమైన ఐడియాలు, కార్టూన్లు చూడగానే, ఇంటలెక్చ్యువల్‌ కార్టూన్స్ అని తెలిసిపోతాయి. ఇది వాస్తవం
కర్రి రామారెడ్డి, ప్రముఖ వైద్యులు, రాజమండ్రి - కలం, కుంచే కలిస్తేనే గానీ కార్టూన్ రాదు. కుంచెతో బొమ్మ గీస్తేనే సరిపోదు. దానికి కలంతో ప్రాణం పొయ్యాల్సిందే! మళ్ళీ అందులో 'పంచ్' ఉండాలి. అప్పుడే అది పెదవుల మీద నవ్వులు పూయించే మంచి కార్టూనవుతుంది........ఆయన కార్టూన్‌లంటే చిరునవ్వుకి చిరునామా ప్రతి కార్టూన్‌లోనూ ఏదో ఒక చమక్కుంటుంది. అంతర్లీనంగా ఎవరికో చిన్న చురక లాంటిది పడుతూనే ఉంటుంది. తను నమ్మిన 'పంచ్‌'ని అయనెప్పుడూ వదిలిపెట్టడు. అందుకే సంవత్సరాలు గడిచినా, తరాలు మారినా ఆయన కార్టూన్లు జీవంతో విరాజుల్లుతున్నాయి. ముళ్ళపూడి వారి చేత, బాపు గారి చేత మన అప్పారావుగారు శభాషనిపించుకున్నారంటే, ఇక దానికి మించిన సర్టిఫికెట్ లేనేలేదు. మరి కార్టూనిస్టుగా ఆయన 'గోల్డ్‌మెడల్" సాధించినట్లే.




3 కామెంట్‌లు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.