హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2015, ఆదివారం

స్వర్గంలో కోలాహలం

                            

**************************************** 

ఈరోజున వ్రాసినచిన్న వ్యాసంలో  చాలా మంది పెద్ద రచయితల పేర్లు  వాడటం జరిగింది. పూర్తిగా హాస్యం  కొరకు మాత్రమె అని, ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని, ఆ రచయితలందరికీ నమస్కరిస్తూ,  విన్నవించుకుంటున్నాను.

ఇది చదవటానికి ముందుగా,  ఈ కాస్తా వ్రాయటానికి ప్రేరణ 2011 లో వచ్చిన ఒక వార్త. ఈ వార్త గురించి నేను మూడు వ్యాసాలు ఈ బ్లాగులోనే వ్రాశాను. కానీ ఫలితం శూన్యం. ఆ మూడు వ్యాసాలూ చదివిన తరువాత ఈ కింది హాస్య రచన చదివితే బాగుంటుందని నా అభిప్రాయం.

****************************************

 
 ఎడమ పక్కన పేపరు/చానెళ్ళ వాళ్ళు చూపించిన  సమాధి, కుడి పక్కన తెలుగు వెలుగు పుస్తకంలోని చలం గారి సమాధి  
మునుపు చలంగారి సమాధి గురించి వ్రాసిన మూడు వ్యాసాలూ ఈ కింది లింకులు నొక్కి చదువుకోవచ్చు
  1. చలం గారి సమాధి వివాదం
  2.  చలం గారి సమాధి మరో కోణం 
  3. గవర్నర్ గారి స్పందన 


స్వర్గంలో కోలాహలం
"ఏమిటిది రంభా, నా ఊర్వశి  ఏదీ?" అంటూ గడ్డం నిమురుకుంటూ గుండీలన్నీ తీసేసిన చొక్కా, లోపలి  బనీను కనపడుతూ,  కల్పవృక్షం పక్కనుంచి వచ్చారు చలం. అప్పుడే పొద్దుటి కోటాగా తాగిన కప్పు అమృతం మజాలో ఉన్నారు ఇంకా. "ఏమోనండీ, ఇవ్వాళ డాన్స్ డ్యూటీ ఆవిడగారిదే అనుకుంటాను. ఈ ఇంద్రుడు మమ్మల్ని ప్రతిరోజూ డాన్స్ అంటాడు, చేస్తున్న మాకే విసుగ్గా ఉన్నది, ఆయన, ఆయనతోబాటుగా ఆ గడ్డపాళ్ళు  అదేలెండి మునులు, ఎలా చూస్తున్నారో యుగాలనుంచీ  నాకేమీ అర్ధం కావటంలేదు".

"
రంభా! బాగానే వంటబట్టిందే నా ధోరణి . ఏమిటి,  మాటల్లో ఇంగ్లీషు తెగ దంచేస్తున్నావు డాన్స్, డ్యూటీ అబ్బో చాలా టింగ్లీషే వచ్చిందే! అవున్లే ఎటుచూసినా తెలుగువాళ్ళే ఈ స్వర్గంలో,  నీకు టింగ్లీషు   ఇంతగా వంటబట్టడంలో ఆశ్చర్యం ఏమున్నది.  ఈ సారి, మీ ఇంద్రుడు నిన్ను  భూలోకానికి డ్యూటీ వేస్తే,.....అవునూ చివరిసారి ఎప్పుడు వెళ్ళావూ, ఒక కల్పం అయ్యి ఉండదూ! సరే, మళ్ళి నీకు భూలోకపు డ్యూటీ పడితే, నువ్వు  హాయిగా తెలుగు చానేళ్ళల్లో వార్తలు చదువుతూ బతికెయ్యచ్చు .  సర్లే,  రంభా మీ కష్టాలు మీవి. ఆ సిల్క్ స్మిత ఏమన్నా ఈ స్వర్గంలోకి వచ్చిందా....పోయి ఆవిడను అడుగు కొత్త నాట్య భంగిమలు నేర్పుతుందేమో. ఆవిడ మీద ఒక సినిమా కూడా తీశారుట ఇప్పుడు ఆ భూలోకంలో.  ఆ హాలు పక్కన ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కదా!"

"లేదండీ చలం గారూ, మీరోజుల్లో అంటె సినిమా హాళ్ళు,  ఇళ్ళ మధ్యే ఉండేవి, పైగా అవి అప్పట్లో ఎ సి కూడా కాదు.  కాని,   ఇప్పుడు సినిమా హాళ్ళకి కనుచూపు మేరలో ఇళ్ళు ఉండవు అన్నీ కాంప్లెక్స్ లేనుట. చాలా ఊళ్ళల్లో అవేమిటి మాల్స్ ట అందులోనే ఒక ప్లోరులో ఈ సినిమా హాళ్ళు ఉంటాయట, ఇప్పుడు హాలు అనటం లేదు స్క్రీన్ అని అంటున్నారు".   

"పోనీలే జనం సుఖపడిపోతున్నారు. 1950 వరకూ దుస్సహమైన  ఆ సినీ శబ్దాలు వింటూ బెజవాడలో ఆ లక్ష్మీ టాకీసు పక్కనే  ఎలా ఉన్నానా అని ఇప్పటికీ నా ధైర్యానికి, గుండె బలానికి ఆశ్చర్యపోతూనే ఉంటాను.  అలా అక్కడే భూలోకంలోనే నేను పడ్డ కష్టానికి,  నాకు నరకంలో పడవలసిన శిక్ష అక్కడే అనుభవించటం వల్ల,  నన్ను తెచ్చి ఈ స్వర్గంలో మీ పాలన పడేసి ఉంటారని నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ  ఉంటుంది, ఏమంటావు!!" అన్నారు సరదాగా నవ్వుతూ.

"ఏమిటండీ ఇలా మొదలెట్టారూ.    చలం గారూ,
ఈ మధ్య  మీరు కూడాను, ఎక్కడో  మొదలుపెట్టి మరెక్కడికో వెళ్ళిపోతున్నారు. మీకు కూడా సావాస దోషం ఏదో పట్టినట్టుంది. లేకపోతే, ఎక్కడి సిల్కు స్మిత మీద సినిమా, ఎక్కడెక్కడి పాత పురాణం అంతా విప్పారే. సరె,  నాకెందుకండీ కొత్త భంగిమలూ, ఈ ఇంద్రుడు అక్కడా ఇక్కడా వాణ్ణి చెడగొట్టు వీణ్ణి చెడగొట్టు అని నన్నెప్పుడు పంపాడు.  ఎప్పుడూ ఆ మేనకేగా వెళ్ళేది నాకేమో డబుల్ డ్యూటీ,  ఆవిడ పని నా పని చెయ్యలేక వళ్ళు హూనం, పేరేమో ఆవిడకి.  ఇలాంటి గోలలు లేకుండా ఉంటే, నేను హాయిగా , బోలెడంత ప్రాక్టీసు చేసుకుని అద్భుతమైన డాన్స్ చెయ్యగలనండీ.  సరే కాని, నేను, తిలోత్తమా ఉలూచీ అందరం కలిసి పిక్నిక్ కి వెళ్తున్నాం, మీరుకూడా వస్తారా, శ్రీనాధుడూ, పెద్దన్నా గారు కూడా వస్తారుట. తెనాలి రామలింగం గారు కూడా వస్తానని బెదిరిస్తున్నారు".

"వద్దులే రంభా, వాళ్ళు,  వాళ్ళ పద్యాల చిట్టాలన్నీ  విప్పి చంపుకు తింటారు, నాకు విసుగు. నాకు ఊర్వశి కావాలి" అని కొంటెగా నవ్వుతూ, "సరేకాని రంభా, ఎన్నిసార్లు అడిగినా చెప్పవేమిటి. ఇదేమో మగాళ్ళ స్వర్గం, ఇక్కడ మాక్కావాలిసినవె అన్నీ చూడటానికి మీరందరూ అప్సరసలూ వగైరాలు ఉన్నారు. మరి ఆ పక్కనున్న  ఆడవాళ్ళ స్వర్గంలో ఎలా ఉంటుందో!"

"ఏమో బాబూ నాకేమి తెలుసు. మమ్మల్ని అటుకేసి వెళ్ళనివ్వరు, తొంగి చూసినా తప్పంటారు  బృహస్పతి గారు, మేము చెడిపోతామట, అంటే ఏమిటోకదా.......!"అంటూ వంటికి ఉన్న ఆభరణాలన్నీ గలగలా మొగేట్టుగా రంభ చలంగారికి ఒక పెద్ద దణ్ణంపెట్టి, "మహానుభావా నాకేమీ తెలియదు, మీరసలే రచయితలు, ఆ భూలోకంలో  ఉన్నప్పుడు వాళ్ళను వ్రాసి వ్రాసి హడలగొట్టారు. తరువాత అక్కడే వ్రాయటం మానేసి ఊరుకున్నారు. ఇక్కడికి వచ్చి చిత్రమైన  కబుర్లతో మమ్మల్ని హడలగొట్టకండి. వ్రాయకపోవటమే  అలవాటయ్యి ఇక్కడకొచ్చి కూడా వ్రాయటమే మానారు. వ్రాయటం మొదలెట్టండి చలంగారూ, ఈ ఇంద్రుడూ, బృహస్పతీ,  ఈ మగ దేవతలూ వాళ్ళందరూ మీ రచనలు చదివితే కాని బాగుపడేట్టు లేరు."


"ఈ ముసలాయనకి, ఆడవాళ్ళ స్వర్గం విశేషాలు కావాలిట.........               వి.  శే.  షా.  లు .........." అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.

చెయ్యి కళ్ళమీద పెట్టుకుని దూరానికి చూశారు చలం. అలా దూరానికి చూస్తున్న చలం గారికి, తనవైపే గబగబా వస్తున్న నండూరి సుబ్బారావు గారు కనిపించారు. చలం గారికి కంగారు పుట్టింది, "ఏమిటిది ఇలా వస్తున్నారు మన లాయరు గారు,
కొంపతీసి కొత్త ఎంకి పాటేమీ రాయలేదు కదా! ఈ మధ్య ఈయన వ్రాసే ఎంకి పాటలు చేతకానివాడు  పెట్టే కాఫీ లా ఉంటున్నాయి. చెప్తే వినడు. ఊహూ వ్రాస్తాడు.ఎందుకైనా మంచిది ఈ పొదలో దూరతాను"  అని అందులోకి ఒక కాలు పెట్టి దూరేలోపునే  నండూరి దగ్గరకు రానే వచ్చారు. వస్తూనే సుబ్బారావుగారు, చాలా ఆదుర్దాగా ఉన్నారు. చలం  దగ్గరగా వచ్చి, రహస్యం  చెబుతున్నట్టుగా "చలంగారూ! ఏమిటిదంతా మీ సమాధి తవ్వి పారేస్తారుట, గోల గోలగా చెప్పుకుంటున్నారు" అన్నారు. "నాకు సమాధేమిటి సుబ్బరావు గారూ ఏమిటిది". ఈలోగా అటుగా వెళ్తున్న విశ్వనాథ వారు వీళ్ళ మాటలు విని ఆగారు. సుబ్బారావుగారు చనువుగా సత్యనారాయణ గారూ అని పిలిచారు. విశ్వనాథ గారు, "ఎవరది! చలమా, ఏమి కావలుయును , స్త్రీ స్వాతంత్ర్యము గురించి మరియొక నుపన్యాసము నిలువబెట్టి నాకు జెబ్బుటకు గాదు కదా?"

"ఎంతమాట సత్యనారాయణగారూ . మీకు చెప్పగలనా నేను! ఇదేదో మన నండూరి నా సమాధి తవ్వేస్తునారని...."

"సమాధి అనగా నేమి. అది ఒక చమత్కారమైన స్థితి, ఇటు నిద్రయూ గాదు, అటు మెళుకవా గాదు.బయట జరుగుచుండునవి తెలియుచునే యుండును గాని నీవు ఏమీ చలింపవు. అదియొక ఆలోచనా పధ్ధతి, యోగులకే పట్టివ్వదు మరి...."

"ఆ సమాధి కాదు మహానుభావా, నాకు కట్టిన సమాధిటండీ  బాబూ...."

"మీకు సమాధేమిటి, దహింపబడకుండానే ఈచోటికి వచ్చి ఉన్నారా.  అయినా మీ కన్నా మూడేళ్ళ ముందు ఇక్కడికి వచ్చి ఉన్నవాడను నాకేల తెలియును మీ విషయములు, నన్నేల అడిగెదరు.... థూ.,...థూ...ఇవ్వాళ ఇంద్రుడికి గట్టిగా చెప్పాలి స్వర్గంలోకి ....ప్రతివాడూ వచ్చేయ్యటమే". అంటూ రుసరుసలాడటం మొదలెట్టారు విశ్వనాధ.

"అయ్యా సత్యనారాయణ గారూ, మీ అబ్బాయి అదిగో 'రచయితల సంతానం పేటలో' కూచుని మీ వేయిపడగలు తెలుగులోకి  తర్జుమా చేస్తుంటె ఏదో అనుమానం వచ్చి  మీ కోసం వెతుక్కుంటున్నాడు....చూడండి బాబూ" అన్నారు అప్పుడే అటుకేసి వచ్చిన పాలగుమ్మి పద్మరాజుగారు, చలంగారికేసి చూసి కన్ను మలిపి.

"ఏమిటీ? వేయిపడగలు తెలుగు జేయుటయా! నేనేమి భాషలో వ్రాసితిని? అది తెలుగు కాదేమి?" అని కళ్ళెర్ర చేస్తూ పంచె అంచును విసురుగా  లాల్చీ జేబినందు కూరి,పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నిష్క్రమిస్తున్నారు విశ్వనాథ.

"ఆ వ్రాశారులెండి తెలుగు...అంతా ఇనప గుగ్గిళ్ళూ......." అంటూ చలం ఏదో అనబోతుండగా.....


"గుగ్గిళ్ళు కాదండీ సజ్జలు...సజ్జలు  అనండి" అన్నారు గోపీచందుగారు.  "అదేమిటి మన రామేశ్వరశాస్త్రిగారు అలా...కోపంగా...."

ఇది చెవినబడి విశ్వనాథ గిరుక్కున వెనుతిరిగి ఇదిగో "గోపీచందూ, నాకెప్పటినుండియో అనుమానముగనే ఉన్నది. నీవు పండిత పరమేశ్వరశాస్త్రి  వీలునామా అను ఒక గ్రంధము నన్ను ఊహించుకునే వ్రాసితివి. ఇప్పటికి దొరికినారు. మీరు తప్పక చెప్పవలయును ఎందులకు మీకు నామీద ఇంత.....
" అంటూ  అక్కడనుంచే అరవటం మొదలుపెట్టారు.

"మీ సజ్జలు గూల ఇదెక్కడి గొడవయ్యా బాబు. ఇప్పుడు మీరూ, చలమూ కలిసి సత్యనారాయణగారితో వాదం వేసుకుంటె తెగేదేనా, బ్రహ్మరుద్రాదులు వచ్చినా కూడా మీకు సంధి కుదరదే, ఇప్పుడేమి చెయ్యాలి...... ఇప్పుడు ఎలా......... ఏమండోయ్ కృష్ణశాస్త్రిగారూ...." అంటూ పిలుస్తూ హడావిడి పడుతున్నారు పాలగుమ్మి పద్మరాజు గారు.   

కానీ,  ఈలోగానే పెద్ద కోలాహలంగా పెద్ద గుంపు అటుకేసి వస్తున్నది. వాళ్ళదరూ పడీ పడీ నవ్వుతున్నారు, తుళ్ళుతున్నారు.  ముందుగా భమిడిపాటివారు ఆడుగులువేస్తుంటే, మునిమాణిక్యంగారు, విలాసంగా వక్కపొడి కాబోలు నములుతూ వస్తున్నారు, వారి వెనకనే ముళ్ళపూడి, బాపు ఒకరి భుజం మీద మరొకరు చేతులు వేసుకు వస్తున్నారు. జంధ్యాల ఏదో చెబుతున్నారు, రేలంగి, పద్మనాభం, గిరిజ, శివరావు, రాజబాబు ఇంకా చాలామందే ఉన్నారు. చాలా పెద్ద గుంపే ఉన్నది వాళ్ళ వెనుక.  అప్పుడప్పుడూ జోకు బాగున్నప్పుడల్లా రమణగారు ఘాట్టిగా ఒక్క విజిల్ వేస్తున్నారు. "ఏరా! ఈ భూలోకపు అలవాటు నీకు ఇంకా పోలేదురా" అంటూ బాపుగారు చిద్విలాసంగా నవ్వారు.  "నువ్వు మటుకు ఇక్కడికొచ్చి నీ పైపు గురించి బెంగెట్టుకోలేదూ" అంటూ నవ్వారు ముళ్ళపూడి. వాళ్ళు వేసుకునే జోకులూ వాళ్ళ నవ్వులూ అందులో ఉండే ఆనందం అంతా చూసేప్పటికి అక్కడ వాతావరణం అంతా చల్లపడిపోయింది.

విశ్వనాథవారు,  వారి కోపం కూడా మర్చిపోయి, తన విశ్ణుశర్మ ఇంగ్లీషు చదువు లో కొన్ని జోకులు వాళ్ళకు చెబుతూ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయారు. మిగిలిన అందరూ హమ్మయ్య ఇవ్వాళ్టికి గండం గడిచిందిరా బాబూ అని ఊపిరి పీల్చుకున్నారు.

ఈలోగా శ్రీ శ్రీ అక్కడకు మట మటలడుతూ వచ్చి, "ఏమయ్యా గోపీచందూ ఈ ఇంద్రుడుకి బుధ్ధి ఉన్నట్టు లేదు, మన్ని తీసుకొచ్చి ఈ పాత చింతకాయ పచ్చడి బూర్జువా స్వర్గంలో వీళ్ళతో పెట్టటం ఏమిటయ్యా, మన సమ సమాజపు స్వర్గం ఏదీ!  మన కామ్రెడ్లు ఆ నరకలో పడి ఉంటె మనం ఇక్కడా? మావో లేడు, లెనిన్ లేడు ఏమయ్యారు వీళ్ళందరూ"  అంటూ కోపంగా చకచకా నాలుగు పద్యాలు విసిరారు. 

వడ్డాది పాపయ్య గారు తన కుటీరంలోచి ఈ గోలకి విసుక్కుంటూ వచ్చి, "ఏమయ్యా చలం, ఇలా రా ఒకసారి. నువ్వు ఆ రంభతో సరసాలడుతున్నప్పుడె, నాకు చికాకు పుట్టింది. ఇట్టారా, నీ కథలకు నేను బొమ్మలు వెయ్యను కాని, నీకు ఊర్వశిని చూపిస్తాను, అదేలే నేను వేసిన బొమ్మ".  ఇలా అనంగానే, చలం గారు వ పా గారి కుటీరంలో కి వెళ్ళి ఆయన వేసిన ఊర్వశి బొమ్మ చూసి మత్ర ముగ్ధులు  ఐపొయ్యారు. "సరే చలం,  వాళ్ళేదో నీ సమాధి అంటె నువ్వు కూడా అలా కంగారు పడి విశ్వనాథ వారినా అడిగేది. ఏమీ లేదయ్యా, అక్కడి పేపర్లు ఇవ్వాళ ఏదో ఒకటి పట్టుకుని గోల గోల చెయ్యటం ఆ తరువాత వదిలెయ్యటం. అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం  అదేదో కొత్త గోల ఒకటి ఆ చానెళ్ళ వాళ్ళు  మొదలు పెట్టారు. అరుణాచలం లో మీ సమాధి తవ్వేస్తున్నారానీ దాన్ని రక్షించాలనీనూ. ఇప్పుడు ఆ విషయం ఏమయ్యిందో తెలియదు ఎవరికి వాళ్ళు కిమ్మనకుండా ఉన్నారు. నీకు సమాధి ఎవరు కట్టారయ్యా, మీ అమ్మాయనుకుంటాను నీ భస్మం పట్టుకొచ్చి మీరు ఉన్న ఇంట్లోనే ఒక చెట్టు మొదట్లో ఉంచిందని, ఆ పురాణం సుబ్రహ్మణ్య శర్మ తన తెలుగు వెలుగు పుస్తకలో వ్రాశాడే,  ఏడీ ఆయన"  అంటూ అటూ ఇటూ చూశారు.

"అవునవును నిజం,  నేను ఉన్న విషయమే వ్రాసినది.  అంతే కదా సీతా" అంటూ తన ఇల్లాలి వంక చూశారు సుబ్రహ్మణ్య శర్మ గారు. "సరేకానీ! ముందా సిగిరెట్టు ఆవతల పారెయ్యండి, స్వర్గం వచ్చినా పట్టుకు ఊరేగుతున్నారు" అనారు పురాణం సీత గారు  కోపంగా.      

ఇలా స్వర్గలో కూడా అప్పుడప్పుడూ టీ కప్పులో తుఫానులు వస్తాయి కాబోలు అనుకుంటూ ఉంటున్నాను ఈ లోగా  చూస్తే ఏమున్నది భూలోకంలోనే, రేపు ఆఫీసుకు వెళ్ళాలిరా బాబూ అని దిగులుగా అనుకుంటూ ఆదివారం పొద్దున్నే కలలొంచి బయటపడి  నిద్రలేచాను.  

20, ఆగస్టు 2014, బుధవారం

భగ్నబహుమతులూ-అశృకణాలూ


ఏమిటీ విచిత్ర కాప్షన్ అని చూస్తున్నారా! ముళ్ళపూడివారి నవ్విస్తూ ఏడిపించే హాస్యం నుంచి పుట్టిన ఒక కథ   "భగ్న వీణలు అశృకణాలు".  అలాంటి కాప్షన్ పెట్టి ఒక వ్యాసం వ్రాయాలని తపన. ఇప్పటికి ఆ శీర్షిక కు సరిపడే ఒక అద్భుత ఆడియో  గొల్లపూడి మారుతీ రావుగారు అందించారు. అటు విలనీ చేస్తూనే హాస్యం అందించగల దిట్ట మన గద్ద ముక్కు పంతులుగారు. 

ఈ మధ్యనే వేరే విషయాలు లేక అనుకుంటాను, భారతరత్న ఇప్పుడు సుబాష్ చంద్ర బోసుగారికి, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ  గారికి ఇస్తే, పోనీ మన హాకీ వీరుడు ధ్యాన్ చంద్ కు ఇస్తే! అని ఒక "చమచ్" ఎంబ్లెమ్ కనిపించకుండా  వాటర్ మార్కుగా గల ఒక ఆంగ్ల చానెల్, ఒక చర్చా కార్యక్రమాన్ని నాలుగైదు రాజుల క్రితం ప్రసారం చేసింది. ఏంఖర్ గా ఉన్నా ఆ మహిళా రత్నం అలవాటు ప్రకారం 90 నిమిషాల్లో 88 నిమిషాలు తానే మాట్లేడేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసానని  అనిపించుకున్నది. 

 ప్రస్తుతం కేంద్రం లో ఉన్న ప్రభుత్వానికి ముందు ఒక ప్రభుత్వం ఉండేది "ట", వాళ్ళు తమకు ప్రచారం చెయ్యకపోతాడా అని కాబోలు, లేదా క్రికెట్ వెర్రితో కొట్టుకుంటున్న దేశం మొత్తం-మొత్తం తమకే మళ్ళీ పట్టంకడతారనో పాపం,  సచిన్ టెండుల్కర్ కు భారతరత్న ఇచ్చి పారేశారు.  పైగా అతన్ని రాజ్యసభకూ  నామినేట్ చేసేసారు. అలవాటు లేని పని కదా,   టెండుల్కర్ పార్లమెంటుకు డుంకా కొడుతూనే ఉన్నాడని మరొక చానెల్ ఢంకా బజాయించి దుమ్ము లేగిపొయ్యే ఒక చర్చ పెట్టింది  ఒక పది-పదిహేను రోజుల క్రితం.

పనిలేని మీడియా వాళ్ళు తమ 24 గంటల సమయాన్ని గడుపుకోవటానికి ఎలాంటి చర్చలైనా చెయ్యవచ్చు. కాని వాళ్ళ చర్చలే నిజం చేస్తూ ప్రభుత్వం
మూడున్నర దశాబ్దాల క్రితం అంటే 1979వ సంవత్సరంలో,  తన 79వ ఏట మరణించిన, ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారికి,  బారతరత్న ఇవ్వచ్చు అని 2014లో  ప్రతిపాదించారుట.  హాకీ మన జాతీయ క్రీడ, ఆ ఆటలో అత్యంత ప్రతిభాశాలికి భారతరత్న ఇవ్వకుండా, క్రికెట్ క్రీడాకారుడికి పూర్వపు ప్రభుత్వం భారతరత్న ఇవ్వటానికి,  రాజకీయ విరుగుడుగా ప్రస్తుతపు ప్రభుత్వం 35 ఏళ్ళ క్రితం మరణించిన ధ్యాన్ చంద్ గారికి ఇప్పుడు భారతరత్న ఇచ్చి గౌరవించే ప్రయత్నం చేస్తున్నది కాబోలు. సంతోషం. 
 
  భీమ్  సేన్ జోషీ గారికి ఫాస్ట్ కార్లు అంటే భలే సరదాట  
   ఫోటో కర్టెసీ TEAM-BHP.COM  

ఇలాగే కొంతకాలం క్రితం, ప్రముఖ హిందూస్తానీ గాయకుడు భీమ్ సేన్ జోషీ గారికి 2009 లో ఆయన పాడటం మానేసిన దశాబ్దం తరువాత, ఆయన 87వ ఏటలో  భారతరత్న ఇచ్చాం అనిపించుకున్నది, పూర్వపు ప్రభుత్వం. పాపం అప్పటికే ఆయన నడవలేని పరిస్థతిలో ఉన్నారుట, ఇల్లు కూడా  వదిలి రాలేని పరిస్థితి. అందుకని,  ప్రభుత్వం వారు "దయతో" తమ ఉన్నతోద్యోగిని ఒకరిని వారింటికి "తోలి", ఆ బహుమతి వారికి ఇచ్చేశారుట. శభాష్! రాష్ట్రపతిగారు అలా సరదాగా కారేసుకుని వారింటికి వెళ్లి ఆ బహుమతేదో ప్రదానం చేస్తే, జోషీ గారు వద్దని ఉంటారా!? ఒక్కటే తృప్తి వారు జీవించి ఉండగా భారతరత్న అందుకున్నారు, అందుకున్న రెండేళ్ళకు పరమపదించారు.

ఈ విషయం విన్న మన గొల్లపూడి మారుతీ రావుగారికి వెంటనే మెరుపల్లే
  శ్రీ గొల్లపూడి మారుతీ రావు ఫోటో కర్టెసీ భారత్ స్టూడెంట్.కాం  
ఒక ఆలోచన వచ్చి ఒక చక్కటి ఆడియో గాల్లోకి వదిలారు. ఏమైనా ఆకాశవాణి వారి ప్రొడక్ట్ ఆ పైన స్వతాహాగా రచయితా మరి. అలా వారు గాల్లోకి వదిలిన ఆ ఆడియో ను మన బ్లాగు గంధర్వ శ్రీ శ్యాం నారాయణ గారు (ఫిరంగిపురం ఇలాకా వారు) వడిసి పట్టుకుని నా అదృష్టం వల్ల  నాకు పంపారు. ఇప్పుడే ఒక గంట క్రితం ఆ ఫైలు మెయిలులో చూసి, శ్యాం పంపితే అందులో తప్పకుండా ప్రత్యేకత ఉండి  తీరుతుంది అని డౌన్లోడ్ చేసి వింటూ ఉంటే నవ్వి నవ్వి కళ్ళంబడి నీళ్ళు వచ్చేసినాయి.  ఆ నీళ్ళు కేవలం అతిగా నవ్వటం వల్ల  మాత్రమే కాదు, మన దేశంలో ఇవ్వబడుతున్న భ్రష్ట బహుమతుల తీరు చూసి కూడా!

ఇప్పుడు మీరు కూడా  వినండి మన గొల్లపూడి మారుతీ రావుగారి అద్భుత హాస్య ప్రసంగం:



ఇంతా చేసి,  ఈ బుల్లి వ్యాసం చదివినాక భీమ్ సేన్ జోషీ గారి గానం వినకపోతే ఎలా! చూస్తూ వినండి


















15, జూన్ 2014, ఆదివారం

అందరి పిల్లలూ ఇలా ఉంటే !

కపిల్ దేవ్ కుమార్తె అమయ దేవ్, కపిల్ దేవ్ కామెడీ విత్ కపిల్ కార్యక్రమంలో
 చివరిదాకా చదివిన వారికి ఒక బోనస్ ఉన్నది 
 ఈ నాటి పిల్లలే రేపటి పౌరులు అని పొడి పొడి మాటలు మాట్లాడుకోవటమే కాని, మన పిల్లలను రేపటి పౌరులుగా తీర్చి దిద్దటానికి మనం అంటే  తల్లితండ్రులం ఎంత ప్రయత్నిస్తున్నాము అని ఒక సారి ఆలోచిస్తే, తక్కువేనేమో అనిపిస్తుంది . ఒక ఎవరేజి తల్లి తండ్రులు చేసేది  ఏమిటి! ట్యూషన్ కార్ఖానాల్లో తమ పిల్లలను చేర్చేయ్యటం, వాళ్ళను కూచో నివ్వకుండా నుంచో కుండా ఊరికే తరమటం తోమటం,రాంక్, రాంక్  అని పాపం పిల్లలకు పిచ్చులు ఎక్కించటం,  ఆపైన అమెరికా తాయిలం చూపించటం, చివరకు వృద్ధాశ్రమంలో పడినాక ఆలోచన!

ఇవ్వాల్టి పిల్లలకు  దేవుడు ఇచ్చిన వరం కావచ్చు, కొంతమంది తల్లి తండ్రులు  వాళ్ళను పెంచిన విధానం కావచ్చును, అద్భుతమైన "ఏటిట్యూడ్"  తో వాళ్ళ జీవనాన్ని కొనసాగించి ఇతరులకు మార్గ దర్శకులు అవుతున్నారు. 

ఇలా వ్రాయటానికి స్పూర్తి కపిల్  దేవ్ కుమార్తె! అప్పటికే రికార్డ్ చెయ్యబడి తీరిక దొరికినప్పుడు చూడటానికి దాచిన (కర్టెసీ టాటా స్కై) కామెడీ విత్ కపిల్ కార్యక్రమాలు నిన్న శనివారం  కావటంతో సావకాశంగా నాకు నచ్చినవి చూశాను. అందులో నాకు బాగా అద్భుతం అనిపించినవి సునీల్ గవాస్కర్ తో ఆపైన అంతకంటే కపిల్ దేవ్ తో  కార్యక్రమం. ఆ ప్రోగ్రామ్ యాంఖర్ పేరు కూడా కపిలే! 

కార్యక్రమం మొత్తం మొత్తం హాస్య ప్రధానం, పేరే కామెడీ విత్ కపిల్ కదా మరి! మాటల్లో యాంఖర్ కపిల్, క్రికెటర్ కపిల్ దేవ్ ను ఒక విషయం గురించి అడిగారు. అదేమిటో ఈ కింది వీడియోలో చూడండి. 
(పైన ఉన్న వీడియో ముక్క కామెడీ విత్ కపిల్ కార్యక్రమం కలర్స్ టి వి వారి కర్టెసీ)
చూశారు కదా వీడియో. నిజంగా కపిల్ దేవ్ కూతురు అమియా ను చూస్తె చాలా ముచ్చట వేసింది. తన తండ్రి చేసిన తప్పు,  అతి చిన్నది,  అది కూడా ట్రాఫిక్ లైటును,  అదీ గ్రీన్ కు రెడ్ కు మధ్యన  ఉన్న ఎల్లో   లైటును దాటి వెళ్ళటం. అయినా సరే తప్పు  తప్పే,తన తండ్రి  అయినా సరే,  చలానా వ్రాయమని పోలీసును అడగటం గొప్ప విషయం. ఆ తరువాత ఆ పోలీసు నిజంగా చలానా వ్రాశాడా లేదా అన్న విషయం కార్యక్రమం లో దాటవేశారు (వ్రాసి ఉండరు) కాని, ఆ పిల్ల అలా అడగటం ఎంతయినా బాగున్నది. 

ఊరికే ఎవరో వెర్రి వాళ్ళు నలుగురు కలిసి పవర్లోకి రావటానికి అవినీతి నశించాలి అని అరవంగానే  వాళ్ళ చుట్టూ చేరి గెంతటం కాదు. ఈ అవినీతి మనవాళ్ళు, మన దగ్గిర వాళ్ళు చేసినా సరే సహించకుండా ఉండటమే నిజమైన పోరాటం. 

తండ్రి తెచ్చే అవినీతి సంపాదనను హాయిగా అనుభవిస్తూ  ఫేస్ బుక్ లో అవినీతి పోవాలని ఎంత వ్రాసి ఏమి  లాభం, బ్లాగుల్లో ఎంత గింజుకుని ఉపయోగం ఏమిటి. ఆప్ పార్టీ చుట్టూ ఎగరటం కాదు, ఒక సేల్స్ టాక్స్ ఆఫీసరు కొడుకు తండ్రిని  నిలదియ్యాలి, లంచాలు తీసుకుని తనను  చదివించ వద్దని, ఒక ట్రాన్స్ పోర్ట్ అధికారి కూతురు తండ్రి తెచ్చిన గిఫ్ట్ లంచం లోంచి కొన్నది  అయితే  విసిరి కొట్టి ఆవతల పారెయ్యాలి,  చెక్ పోస్ట్ అధికారి కొడుకు తండ్రి తెచ్చిన లంచాల డబ్బుతో చడువుకోనని చెప్పి, మూటలు  మోసి  ఆ డబ్బుతో నైట్ కాలేజీలో చదివి చిన్న ఉద్యోగం సంపాయించినా సంతోషంగా ఉంటాడు. అలా పిల్లలు తమ ప్రవర్తనతో, ఋజువర్తనతో తల్లి తండ్రులను మారుస్తారేమో అన్న ఆశ  అప్పుడప్పుడ, ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు పొడచూపటo తప్పేమీ కాదేమో!

ఏదో యువ రక్తం వస్తే రాజకీయాలు బాగుపడతాయని  ఆశ పడ్డాం. కాని జరిగినది ఏమిటి మన రాష్ట్రంలో ఒకానొక యువ నాయకుడు తండ్రిని మించిన వాడయ్యిపొయ్యాడని (అవినీతిలో) రాష్ట్రం రాష్ట్రం నివ్వెరపోయి చూస్తుండగా, దాదాపుగా అంధ్రప్రదేశ్ కు ముఖ్య మంత్రి అయినంత పని అయ్యి ఆ ప్రమాదం కొద్దిలో తప్పింది కదా! విచిత్రం ఆ ప్రమాదం తప్పటానికి కూడా ఒక యువ సినీ నటుడే కారం అంటారు మరి! ఆ సినీ నటుడు ఇకా యువకుడేనా అంటే, వేటగాడు సినిమా, లేదా ప్రేమాభిషేకం సినిమా చూసి తేల్చుకోవాల్సిన విషయమే!

 అలాగే ఉత్తర ప్రదేశ్ లో ఒక యువకుడే ముఖ్య మంత్రి, కాని ఏమిటి లాభం? అక్కడ జరిగే వెధవ పనులన్నిటికీ తన తెలివితేటలన్నీ ఉపయోగించి (అదే తెలివి అని ఆ మనిషి ఉద్దేశ్యం!) సమర్ధించుకుంటున్నాడు. యువకుడైన వాడు తండ్రి పాలించిన చెత్త పధ్ధతిలో కాకుండా పరిపాలనలో మార్పు చూపించి అందరి మన్నన పొందాల్సిoది పోయి, ఆ తండ్రే నయం అనిపించే పరిస్థితి కలిపిస్తున్నాడు ఆ యువ కొడుకు. 

పిల్లలందరూ న్యాయాన్యాయాలు తెలుసుకుని తల్లి తండ్రులను ప్రశ్నించటం  మొదలు పెడితే కాని, తల్లి తండ్రుల అవినీతి ఆలోచనలు,  చర్యలు అరికట్టడం కష్టం. 

ఇంతటి విషయాన్నీ తన కామెడీ షో  లో మెత్తగా హాస్యంతో చక్కగా చొప్పించి చూపిన కపిల్ శర్మ కార్యక్రమం అధ్బుతం, అందరూ చూడతగ్గ కార్యక్రమం. 

  • కపిల్ దేవానంద్ లాగ మిమిక్రీ 
  • కపిల్ వాజ్పేయ్ నడక 
  • కపిల్ దేవానంద్  సినిమా లో పాట పాడటం 
  • కపిల్ భార్య వంటల విన్యాసాల కబుర్లు 
  • ఇంకా ఇలా ఎన్నో సరదాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ఇప్పటికే చూసి ఉండకపోతే,ఈ కింది వీడియోలో పూర్తీ నిడివి కార్యక్రమం చూడండి:
*
***
*

గవాస్కర్ డాన్స్
కామెడీ విత్ కపిల్ కార్యక్రమంలోనే మరొక ఎపిసోడ్ లో గవాస్కర్ ను సెహ్వాగ్ ను పిలిచారు. అందులో, ప్రేక్షకుల్లో ఒకతను, తనకు సెహ్వాగ్ తో విజయోత్సాహంతో నృత్యం చెయ్యాలని ఉన్నదని అడిగాడు. సరే ఆతను వచ్చి సెహ్వాగ్ తో డాన్స్ చెయ్యాలని చూసాడు కాని, సిక్సర్లు బాదే సెహ్వాగ్ డాన్స్ దగ్గర డక్  అయిపోయ్యాడు, ఆ ప్రేక్షక కుర్రాడు సెహ్వాగ్ ను వదిలి గవాస్కర్ ని పట్టుకున్నాడు. ఆశ్చర్యం గవాస్కర్ చక్కగా డాన్స్ చేసి అందరినీ ఆనంద పరిచాడు. ఇంకెందుకు ఆలస్యం చూడండి గవాస్కర్ నృత్యం:

పూర్తి  కార్యక్రమం యు ట్యూబ్లో చూసి ఆనందించండి