30, సెప్టెంబర్ 2009, బుధవారం

అమరావతి - కథలు సమీక్ష 2

పాల మీద మీగడలా, మంచి గులాబీ సువాసనలా, గాలిలో తేలివస్తున్న జాజిపూల పరిమళంలాగ ఉంటాయి సత్యం శంకరమంచి వారి కథలు. ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూసే. మన తెలుగు సాహితీ వేత్తలకు పూనుకుని తోటి రచయితలకు ప్రపంచ ఖ్యాతి తీసుకు రావటం అంతగా తెలియదు లేదా చెయ్యరు. అలా పూనుకుని అమరావతి కథలను నోబెల్ బహుమతి ప్రదాతలకు పంపిస్తే, నోబెల్ బహుమతి రావలిసింది కదండీ. ఇప్పటికైనా ఆలశ్యం కాలేదని నా ఊహ.

ఈ రోజున మరొక ఐదు కథల గురించి.

6.ముక్కోటి కైలాసం
ముఖ్య పాత్రలు-ముసలమ్మ, బిచ్చగాళ్ళు ఎవరికీ పేర్లు పెట్టలేదు
బాపు బొమ్మ-నేలమీద చాలా హీనంగా కూచుని చేతులెత్తి నమస్కరిస్తున్న ముసలిది, ఆకాశంలొనుండి ఒక అద్భుత హస్తం అమె వైపుకు తిరిగి. ఆదిదేవుడే ఆ ముసలమ్మను తన చేత్తో, పూజలే ముఖ్యమయ్యి, తోటి మనిషిని పట్టించుకోని లోకంనుండి, ఒక పర్వదినాన ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్ళబోతున్నట్టు స్పురిస్తుంది
కథ-ఇదికూడా సంఘటనా వర్ణనమే ఒక దిక్కులేని ముసలమ్మ వైకుఠ ఏకాదశి నాడు అమరావతిలో శివాలయం లో దేవదర్శనంకోసం ప్రయత్నించటం, అశేష జనవాహినిలో పడి కొట్టుకుపోయి, ఆ జన సంద్రపు తీరాన విసిరివేయబడటం, అమె అక్కడే తనువు చాలించటం. కథలో బిచ్చగాళ్ళ దీన జీవన గాధ, అంతటి బీదరికంలొనూ వాళ్ళలొ వాళ్ళు తన్నుకోవటం, తమకంటే తక్కువ వాళ్ళను చీదరించుకోవటం, దిక్కులేని ముసలమ్మను పట్టించుకోక పొగా, కసిరి ఆవతలకి పొమ్మనటం, చివరికి ముసలమ్మను "చచ్చిందిరోయ్" అని అనందంగా కనిపెట్టి, ఆ శవాన్నే పణంగా పెట్టి అడుక్కోవటానికి కూడ వెనకాడక పోవటం చాలా హృద్యంగా చిత్రీకరించారు. "ముసలమ్మ ముందు రెండు కొబ్బరిముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది గాని మింగుడు పడలేదు" అన్న వాక్యం మనస్సును ద్రవింపచేస్తుంది.

7.అరేసిన చీర
ముఖ్య పాత్రలు సాంబడు, లచ్చి
బాపు బొమ్మ-సాంబడు లచ్చి, ఇద్దరికి బట్టలతో లంకె, కథలో వారిద్దరు చివరకు ఒకరి మీద మరొకరు ఎలా ఇష్టపడ్డారో తెలియచెప్తుంది
కథ-చాకలి సాంబడు, చాకలి లచ్చి, పెద్దవాళ్ళ బలవంతంమీద పెళ్ళాడుతారు, కాని, వారిద్దరికీ ఇతరులమీద, లచ్చికి కోటేశు మీద, సాంబడికి సీతాలు మీద, మనసు పోతూ ఉటుంది. క్షణం పడదు వాళ్ళీద్దరికీ. ఉతకటానికి వేసిన బట్టల్లోంచి కోటేశుకు చెందిన అత్తాకోడలంచు పంచ లచ్చి, సీతాలుకి చెందిన నెమిలి కంఠం చీర సాంబడు ఉతుకుతారు. సాయంత్రానికి ఉతికిన బట్టల్లోంచి తమకు నచ్చిన బట్టలు - నెమిలి కఠం చీర లచ్చి, అత్తాకోడలంచు పంచ సాంబడు కట్టుకుంటారు. ఆ బట్టల్లో వాళ్ళకి ఒకళ్ళమీద ఒకరికి ఇష్టం కలిగినట్టు సూచించి కథ ముగించారు రచయిత.

8.శివుడు నవ్వాడు
ముఖ్య పాత్రలు గుడ్డి గంగన్న, అర్చకుడు మహదేవయ్య
బాపు బొమ్మ-గుడ్డి గంగన్నలోని పరమేశ్వరుణ్ణి చూస్తూ అతన్ని లేవతీస్తున్న మహదేవయ్య, కథలోని సంఘటనకు అద్దం పడ్తుంది.
కథ-దేవాలయానికి ఆనుకుని ఉన్న గుడ్డి గంగన్న కాళీ స్థలాన్ని, అక్కడ ప్రసాదాలు అమ్మేషాపు పెట్టాలని చులాగ్గా నిర్ణయింస్తారు గుడి గుమాస్తా, ఆఫీసరు. వాళ్ళు గుడ్డి గంగన్న దగ్గరకు వచ్చి ఆ స్తలాన్ని అమ్మమని ఆడుగుతారు, గంగన్న తిరస్కరిస్తాడు. అతనికి రొజూ పెట్టే ప్రసాదం పెట్టటం మానేస్తారు. నాలుగు రోజులు తరువాత, ఆ ప్రసాదం మీదనే బ్రతికే గంగన్న ఆవేశంతో ఆక్రొసిస్తాడు. ఆ క్రమంలో పడిపోతున్న గంగన్నని, అర్చకుల్లో పెద్దవాడైన మహదేవయ్య మడిలో ఉండి కూడ పట్టుకుని ప్రసాదం తినిపించి, అతని ఆకలి తీరటంతో, నాలుగు రోజులనుండి చిరునవ్వు నవ్వని శివుడు నవ్వినట్టు భావించి ఆనందిస్తాడు. బిచ్చగాళ్ళు తన స్తలంలో వండుకుని పడుకొంటున్నారని గమనించిన గంగన్న"ఆ స్తలం నాదే కాని బాబూ! దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబూ"అని అనటం, మడిలో గంగన్నని ముట్టుకున్నందుకు వచ్చిన ఆక్షేపణను మహదేవయ్య "అతనూ మడిగట్టుకునే ఉన్నాడండీ" అన్న ఒక్క మాటతో కొట్టి పారెయ్యటంతో, మానవుల మనసుల్లో కొరవడుతున్న మానవత్వపు విలువలను ఎత్తి చూపారు రచయిత.

9.ఒక రోజెళ్ళి పోయింది
ముఖ్య పాత్ర-పిచ్చయ్యగారు
బాపు బొమ్మ-చాలా అర్ధవంతమైన బొమ్మలలో ఒకటి.అస్తమిస్తున్న సూర్యుడు, ఎగిరిపోతున్న పావురం, కథావిషయాన్ని ఇట్టే చెప్పగల శక్తిగలదీ బొమ్మ
కథ-ఇందులో పిచ్చయ్య గారన్న ఒక సామాన్య వ్యక్తి, ఒకళ్ళ అంటు-సొంటు అక్కర్లేని వ్యక్తి యెక్క దినచర్య, అతను వెళ్ళిపోయిన వైనం. అన్ని విధాలా సంతృప్తిపడగల వ్యక్తి జీవితం ఎంత హాయిగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుందో రచయిత చక్కగా వర్ణించారు. పిచ్చయ్యగారికి "కారం దివ్యంగా ఉండాలి. లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు" అన్న రెండు వాక్యాలు చదువుతుంటే ఆ సంఘటన కళ్ళకు కట్టి నవ్వు తెప్పిస్తుంది. సమాజంలోని ఎంతో మంది తమకు అక్కర్లేని పనులలో తల దూర్చి లేనిపోని చిక్కులు, సమస్యలు(అవి తీరుస్తున్నామన్న భావనతో)తెచ్చుకుంటారో,తెస్తారో(చాలాభాగం సొంత లాభంకోసం), అటువంటివారికి వారికి పూర్తి విభిన్నంగా "పిచ్చయ్యగారు ఏవీ సాధించలేదు. తగాదాలు తీర్చలేదు. సమస్యలు చర్చించలేదు. కానీ, కాలానికి తెలియకుండా కాలంలో కలసిపోయి బతికాడు. అది చాలదా? అది చాలటంలేదు చాలామందికి " అన్న చురుక్కుమనే కొసమెరుపునిచ్చి కథను రచయిత ముగిస్తారు.
(ఈ తొమ్మిదో కథ ఉన్నదే, ఈ కథను ప్రస్తుతం పదవులకోసం కొట్టుకు చస్తున్న రాజకీయ నాయకులకి బలవంతాన ఒక రోజల్లా వినిపిస్తే ఎమన్నా గుణం కనిపిస్తుందేమో? మానసిక వైద్యులు ఎవరైనా విశ్లేషించి తేల్చి చెప్పాలి)
10.హరహర మహాదేవ
ముఖ్య పాత్ర-మోగులూరి ముసలమ్మ
బాపు బొమ్మ-రధంలో ఊరేగుతున్న పరమేశ్వరుడి రధ చక్రంలో మోగులూరి ముసలమ్మను చిత్రీకరించటం, ఆ చక్రాకృతిలోనే ముసలమ్మ దేవుడికి హారతి పట్టడం బొమ్మయెక్క ప్రత్యేకత
కథ-చాలా కాలం క్రితం, (ఈ కథారచనా సమయంలోనె) ఆకాశవాణి వారు శ్రీరామనవమి నాడు భద్రాచలం నుండి అక్కడ ప్రతి సంవత్సరం జరిగే సీతారామ కళ్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసావాళ్ళు. అందులో వ్యాఖ్యాతగా జమ్మలమడక మాధవరాయ శర్మ తన్మయుడయి ఆ కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్టు భక్తి పారవశ్యంతో చెప్పి సకలాంధ్ర శ్రోతలకు ఆనందం కలిగించేవారు. ఈ కథలో,అమరావతిలో మహా శివరాత్రి నాడు జరిగే అమరేశ్వరుని రధ యాత్రను, రచయిత ఆ పంధాలొనే, అక్షర రూపంలోనె మనముందు ఉంచినా, ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలుగ చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చిన మోగులూరి ముసలమ్మ పరమేశ్వర దర్శనం చేసుకోవటం, హారతి ఇచ్చి పరవశించటం ఈ కథకు వన్నె తెచ్చిన అంశం.

28, సెప్టెంబర్ 2009, సోమవారం

శాయపురం మా ఊరు 2

శాయపురం, మా అమ్మ పుట్టిల్లు. ఆ ఊరికి క్రితం సంవత్సరం 2008లో వెళ్ళటం జరిగింది. మా అమ్మ ఆ ఊరిగురించి అనేక కథలు చెప్పేది. కాని నేను ఏనాడు ఆ ఊరు వెళ్ళటం తలపెట్టలేదు. ఆవిడ పోయినాక నేను మా తమ్ముళ్ళు కలసి అసలు ఆ ఊరు చూద్దం అని బయలుదేరి వెళ్ళాం.
==============================================
శాయపురం (Sayapuram), కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామ జనాభా 3000 నుండి 4000 వరకు ఉంటుంది.

గ్రామ చరిత్ర
ఈ గ్రామమునకు ఈ నామము షాహిపురం నుండి వచ్చినది. ఈ ఊరి పెద్దల, వృద్దుల కధనం ప్రకారము 16 శతాబ్దమునందు ఈ గ్రామము ఏర్పడినది అని, ఆ రొజులలొ ఈ ప్రాంతము పరిపాలించుచున్న నవాబు హిందూ దివాను ఇచ్చటికి వచ్చి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆ చెరువునీటి రుచి ఇష్టపడి. అక్కడ ఒక శివాలయము, ఒక విష్ణు ఆలయం కట్టదల్చుకొని అక్కడ మసీదు కడుతున్నట్లు చెప్పి నిధులు తీసుకొని ఆలయములు కట్టించినాడు అని (ఈ కధనముననుసరించి ఇక్కడ విష్ణాలయము, శివాలయములు కలవు).అక్కడికి కొంత దూరంలో మసీదు కూడా కట్టించి తరువాత ఈ ప్రాంతమునకు షాహిపురమని పేరు పెట్టినట్లుగా చెపుతారు. కాలక్రమంలో షాహిపురం శాయపురంగా మారినదిగా ఆ గ్రామ పెద్దలు వివరించారు. ఈ ఊరిపేరుకు, షిరిడి శాయికి గాని, పుట్టపర్తి శాయికి కాని సంబంధంలేదు

దేవాలయములు
పురాతనమైన విష్ణుదేవాలయం కలదు. శిధిలమైన దేవాలయము స్థానమున పునరుద్ధరించబడిన శివాలయము కలదు.




వ్యవసాయ విషయాలు
ఈ గ్రామము నందు ముఖ్యమయిన పంటలు వరి మరియు చెరకు.

విద్యా సౌకర్యాలు
ఈ గ్రామములో ఒక పాఠశాల ఉన్నది. ఈ పాఠశాలలొ రేడియో పాఠాలు విని నేర్చుకొనే సదుపాయం కలుగజేశారు.

రవాణా సదుపాయములు
ఈ గ్రామమునకు ఇప్పటికి కూడ సరయిన ప్రయాణ సదుపాయములు లేవు. విజయవాడ నుండి బస్సులొ నాగాయలంక, అవనిగడ్డ మార్గములో బస్సు ఎక్కి, ఉయ్యూరు దాటిన వెంటనే, గోపువానిపాలెం స్టాపులొ దిగాలి. అక్కడినుంచి ఆటోలొ శాయపురంకు వెళ్ళవచ్చు. ఈ ఊరు విజయవాడకు చాలా దగ్గర.
==============================================
ఆ ఊరు మా తమ్ముళ్ళతో కలసి జనవరి 2008లో మొట్టమొదటి సారి వెళ్లాను. అంతవరకు ఆ ఊరు గురించి మా అమ్మ చెప్పగా వినటమే కాని చూసింది లేదు. అక్కడకు వెళ్ళగానే, కనిపించిన మొదటి వ్యక్తిని, ఇక్కడ శుధ్ధపల్లి రామమూర్తిగారి(మా తాతగారు)ఇల్లు ఎక్కడండి అని అడిగాను. ఆయన వెంటనే, వారు ఈ ఊరు ఒదిలిపెట్టి చాలా రోజులయ్యింది(డెబ్భై సంవత్సరాలయ్యింది) కాని వారి ఇల్లు ఫలానా చోటున ఉండేది అని చెప్పారు. పల్లెటూళ్ళల్లో ఎంత గుర్తు మనుషులమీద! ఇక ఆ ఊళ్ళొనే 83 సంవత్సరాల వృధ్ధుడు చావలి భానుమూర్తిగారిని కలసి పాత విషయాలు అనేకం తిరగేసాం. ఆయనే మాకు శాయపురానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరించారు. అప్పుడు తీసిన వీడియోలో కొంత భాగం ఈ కింద ఇవ్వటం జరిగింది.

కళాపోసన కోసం ఉచితం-అద్భుతం

మనిషన్నాక కొంచెం "కళాపోసన" ఉండాలి అన్న ముళ్ళపూడివారి మాటలు అక్షర సత్యాలు. లేకపోతే గొడ్డుకి మనిషికి తేడా ఉంటుందా? అనికూడ ముత్యాల ముగ్గులో కాంట్రాక్టరు చేత అనిపించారు. ఎంతో కొంత "కళాపోసన" చేస్తున్నవారికోసం ఈ వ్యాసం. సినిమా పిచ్చి అనండి, మంచి సినిమా చూడాలన్న తపన అనండి, లేదా చిక్కటి దర్శకత్వపు నైపుణ్యం మీద ప్రేమ అనండి,మంచి ఫొటోగ్రఫీ అనండి, లేదా మంచి సంగీతం, ఇలా రకరకాలుగా మన అభిరుచులు ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా, మన దగ్గర కొన్ని వందల సిడిలు/డివిడిలు ఉండే అవకాశం ఉన్నది. మనం ఇలా సేకరించటం మొదలు పెట్టినప్పుడు పెద్దగా పట్టించుకోని విషయం, అయా సినిమాలకు ఒక వర్గీకరణ, జాబితా తయారు చేయటం.

కొంతకాలం అయ్యేప్పటికి, మన దగ్గర ఉన్న సినిమా ఏదో, లేని సినిమా ఏదో తెలియని స్థితి. చుట్టమో, స్నేహితుడో పట్టుకుపోయిన సినిమా మళ్ళి ఇచ్చాడో లేదో తెలియక, వారిని అడగలేక సతమతం!!

ఈ విధంగా కొంతకాలం నా సినిమా/సంగీతం సేకరణ ఒక దారి తెన్ను లేక పడి ఉన్నది. రకరకాలుగా ప్రయత్నించాను-ఎక్సెల్ షీట్, రకరకాల కాటలాగర్ సాప్ట్వేర్లు-కాని పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కారణం, నా సినిమాల జాబితా, ఒక్క సినిమా పేర్లే కాకుండా ఇంకా అనేక విషయాలను కూర్చి తయారుచేద్దమని ప్రయత్నించటం. కావల్సినప్పుడు, ఒక దర్శకుని సినిమాలు, ఒక నటుడు నటించినవి, ఒక సంగీత దర్శకుడు సంగీతం సమకూర్చినవి, ఒక రకానికి చెందినవి(కామెడి, వార్ మొదలగునవి).

ఇక ఇలా లాభం లేదని, ఓ మంచి ముహుర్తాన, నెట్ మీదపడి తీవ్రంగా వెతుకులాట మొదలుపెట్టాను. అదృష్టవశాన, కొంతసేపటికే ఒక చక్కటి సాప్ట్వేర్ దొరికింది. అదే ఇపుడు మీ అందరికి చెప్పదల్చున్న "ఉచితం-అద్భుతం".

ఈ సాఫ్ట్వేర్ పేరు పెర్సనల్ వీడియో డాటాబేస్. ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం, మన ఇష్టం వచ్చినన్నాళ్ళు వాడుకోవచ్చు, మన మూవీ కలెక్షన్ బాక్ అప్ తీసుకోవచ్చు. ఈ సాప్ట్వేర్ తయరుచేసిన వ్యక్తి యానిషివ్కే అలెగ్జాండర్(Yanishevskyy Alexander).ఇంత చక్కటి సాప్ట్వేర్ ను తయారు చేసి అందించిన వ్యక్తి గురించి నెట్ లో వెతికితే వివరాలు దొరకలేదు.

ఈ సాప్ట్వేర్ను ఈ కింది లింకునుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

సినిమా జాబితా తయారి


డౌన్లోడ్ చేసుకుని, మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్నాక, మీ దగ్గర ఉన్న సినిమా పేరు ఈ పాకేజిలో టైపు చెయ్యగానే నెట్ మొత్తం వెతికి, ఈ సినిమా గురుంచిన అనేక వివరాలు సంపాయించి పొందుపరుస్తుంది. మీరు సులభంగా ఆ సినిమా ఎక్కడ ఉన్నది అని తెలుసుకోవటానికి, మీడియా లొకేషన్ లో సిడి నంబర్ గాని మరి ఏ ఇతర గుర్తులుగాని వ్రాయవచ్చు. అన్ని సిడిలు ఈ విధంగా తయారు చేసుకున్నాక, ఫలానా సినిమా మనదగ్గర ఎక్కడ ఉన్నది అని చూడలంటే, సెర్చ్ ఆప్షన్ లో ఆ సినిమా పేరును టైపు చెయ్యగానే, మనం ఎక్కడ దాచామో తెలుస్తుంది (మనం దాచిన చోటును ముందే ఎంటర్ చేసి ఉండాలి, ఆ సిడి అక్కడే ఉంచాలి). ఒక నెలరోజుల పాటు ఒక యజ్ఞం లాగ చేసి నా కలెక్షన్ మొత్తానికి, ఈ పాకేజీ పుణ్యమా అని, చక్కటి జాబితా చేసుకున్నాను. నేను నా సిడి/డివిడి లకు వరుస నంబర్లు ఇచ్చి, వాటిని అదే వరుసగా అట్టపెట్టలలో భద్ర పరిచాను. తీసి చూసిన తరువాత మళ్ళి అదే స్థానంలో ఉంచటం వల్ల మళ్ళి మనకు కావల్సినప్పుడు, సులభంగా ఈ పాకేజి ద్వారా తెలుసుకోవచ్చు.అదే విధంగా ఒక దర్శకుని సినిమాలు మన దగ్గర ఏమి ఉన్నయి అని చూసుకోవచ్చు. ఇలాగే అనేక రకాలుగా వెతుకవచ్చు(పైన ఉన్న బొమ్మను నొక్కి పెద్దదిగా చూడండి)

ఇంకొక ముఖ్య విషయం! మనదగ్గర ఉన్న ఉన్న సినిమా ఏదన్నా ఎవరికన్నా ఇచ్చినప్పుడు, మనం ఎవరికి ఇచ్చామో కూడ ఈ పాకేజీలో వ్రాసుకోవచ్చు. వారానికో, నెలకో ఒకసారి ఈ జాబితాను చూసి (ఎవరికి ఇచ్చామో ఒక జాబితా తీసుకోవచ్చు) వాళ్ళను తిరిగి ఇమ్మని అడగవలిసిన గతి పట్టినప్పుడు (సామాన్యంగా తీసుకునేప్పుడున్న ఆత్రం, తిరిగి ఇచ్చేప్పుడు సహజంగా చాలామందికి ఉండదు.అందుకనే మార్క్ ట్వైన్ ఒకసారి వాపోయ్యాడు "ఈ పుస్తకాలు అన్నీ ఇచ్చినవాళ్ళు, పెట్టుకోవటానికి బీరువా ఇచ్చారుకాదు") సులభంగా ఎవరికి చ్చామో వారినే అడుగవచ్చు. మన సినిమా కలెక్షన్ భద్రంగా ఉండి సినిమాలు పోవటం లాంటి ప్రమాదాలు జరుగవు.

కాబట్టి, ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడుకుని మీ "కళాపొసణ" మరింత బాగా చేసుకుంటారు కదూ.

26, సెప్టెంబర్ 2009, శనివారం

మరోసారి పరాభవం!!

తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ గారికి "మరోసారి పరాభవం" ట తెలుగులో అతిపెద్ద అమ్మకపు అంకెలు గల పత్రిక వాపోయింది ఈరోజున (ఇరవై ఆరు సెప్టెంబరు రెండువేల తొమ్మది). ఏమిటిట పరాభవం?? తెలియని పోలీసు ఎవరో ఈ చైర్మన్ కారుని ఆపాడుట వెంటనే వారు కాలినడకన వెళ్ళాల్సి వచ్చిందట. ఇందులో పరాభవమేమిటో నాకైతే అర్థం కావటంలేదు.

తాను అక్కడకు వచ్చింది తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ గా. పోలీసులను పెట్టింది, జనాన్ని మాత్రమే అదుపు చెయ్యటానికి పెట్టింది ఆ దేవస్థానం వారే. పోలీసొకడు, అతను వీరెవరో తెలిసి కూడ, అక్కడి నియమం ప్రకారం కారు అంతకు మించి వెళ్ళకూడదంటే, అటువంటి పోలీసుని మెచ్చుకోవాల్సింది పోయి, అలగటమా. ఎవరిమీద ఈ అలక? దేవస్థానం మీదా లేక దేవుడి మీదా. వార్తలో వ్రాసిన ప్రకారం వారు అలిగి శ్రీవారి వాహనం ముందు హారతి తీసుకునేందుకు నిరాకరించారట!! ఎంతటి అపచారం? దేవుడిముందా ఇటువంటి ప్రవర్తన. మొన్నొక రోజున, విజయవాడ దుర్గగుడిలో కూడ ఇదే పధ్ధతిన మరొకడు వీరంగం వేశాడు. వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటి, దేవుడి గుడి దగ్గర కూడ వీళ్ళ అహంకారాన్ని వదులుకోలేరా?

తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ అయ్యి ఉండి, హుందాగా ప్రవర్తించి, మిగిలిన యాత్రికులకి ఏర్పరిచిన నియమ నిబంధనలన్నిటిని తాను పాటించి చూపించవలసిందిపోయి, ఈ పెద్దమనిషి ఇలా అనుచితంగా ప్రవర్తిస్తాడా!

ఆపైన, శ్రీలంక హై కమిషనరు వచ్చి ఉంటే, ఆయనను లోపలకి ఆహ్వానించటానికి ఎవరూ రాలేదుట. వీరి ఆధ్వర్యం అలా ఏడిచింది మరి. ఆ విషయం మీదకూడ అలగటమే. తన్ని తాను పరిచయం చేసుకుని, ఆ హై కమిషనర్ ని వెంటపెట్టుకుని గుడిలోకి తీసుకుని వెళ్ళాల్సింది. అక్కడి విషయాలను ఆకళింపుచేసుకుని, అన్ని వ్యవహారాలు చక్కదిద్దటానికి చైర్మన్ గాని, అలగటానికి, అక్కడ జరిగే కార్యక్రమాలకు అడ్డు పడటానికి కాకూడదుకదా. పేను పెత్తనం ఇదేనేమో!


ఆపైన మీడియా మరొక్కసారి వార్తలను ఏవిధంగా ప్రచురించాలో తెలియని అజ్ఞానాన్ని ప్రదర్శించింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు తి.ది.దే చైర్మన్ అనుచిత ప్రవర్తన అని శీర్షిక పెట్టాల్సిందిపోయి, పరాభవం అని వ్రాయటం ఏమిటి??పైగా ఏదో గొప్ప పనిచేసినట్టు, ఫొటో కూడ వేసిమరి. అసలు వేయాల్సింది, ఆ పోలీసు ఫొటోని.

మా ఊరు - 1 (వెన్నూతల)

నేను ఈ ఊళ్ళో పుట్టలేదు, పెరగలేదు, నాకు ఇరవై ఏళ్ళు వచ్చేవరకు అక్కడకు వెళ్ళలేదు.కాని, మా నాన్నగారు, వారి పూర్వీకులు, ఈ గ్రామం వారు. మా పూర్వీకుల గ్రామాల గురించి వ్రాద్దామని మొదలు పెట్టి మొదట మా తండ్రి గారి వైపునుండి మొదలుపెట్టాను. మరొక వ్యాసంలో మా అమ్మగారి గ్రామం గురించి . ***********************************************************

వెన్నూతల, కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గ్రామ జనాభా సుమారు 2000-నుండి 3000 వరకు ఉండవఛ్ఛును. ఈ గ్రామము గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయము మరియు వ్యవసాయ సంబంధ వృత్తులపై ఆధారపడి ఉన్నారు. ఇక్కడి వ్యవసాయ కుటుంబాల వారు దాదాపు 3-4 తరాల వెనుక తూర్పు జిల్లాల నుండి వలస వచ్చారని పెద్దలు చెబుతుంటారు.


ప్రయాణ సదుపాయాలు ప్రత్యేకముగా ఈ గ్రామమునకు బస్సు సౌకర్యాములేదు. దగ్గరలోని రైలు స్టేషను తరిగొప్పుల(విజయవాడ-మచిలీపట్నం మార్గము) గన్నవరమునుండి(4-5 కిలోమీటర్ల దూరం) వరకు ఆటోలో వెళ్ళవచ్చును (ఫొటోలో చూడండి),విజయవాడ, ఏలూరు మరియు ఇతర పట్టణాలకు జాతీయ రహదారిపై తిరిగే వాహనాల ద్వారా(గన్నవరం మీదుగా) ప్రయాణం చేయవచ్చును. (అధికంగా బస్సులు). విజయవాడ నుండి ఈ గ్రామము మీదుగా ఒక సిటీ బస్సు (116 నంబరు)నడుస్తున్నది.


వ్యవసాయం
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. ప్రధానమైన పంట వరి.


నీటి వనరులు
వ్యవసాయం కొరకు , కృష్ణా నది నుండి ఈ గ్రామము మీదుగా ఒక కాలువ కలదు.


ఆలయాలు
ఈ ఊరిలొ ఒక పురాతనమైన శివాలయం ఉంది. అది దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. .2006-07లో ఈ ఆలయమును పునరుద్ధరించినారు. ఆ సమయములొ జరిగిన తవ్వకాలలో లభ్యమయిన ఆధారాల ప్రకారము ఈ ఆలయమును 1880 ప్రాంతములో నిర్మించి ఉంటారని తెలుస్తున్నది. ఈ ఆలయమును కప్పగంతు మరియు లొల్లా వారి కుటుంబముల వారు నిర్మించినారని పెద్దలు ఛెప్తారు. ఈ ఆలయము ముందు ఒక పెద్ద కోనేరు(చెరువు) ఉంది.ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కల్యాణం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారి కల్యాణం చూసి ఆనందిస్తుంటారు. ఆలయ ధర్మకర్తలైన ఇటీవల ఊరిలో ఉన్న పురాతనమైన రామాలయంను కూడా పునరుద్ధరించారు. ఈ ఆలయం కూడా కోనేరుని ఆనుకొని వున్నది.

ఇతర సదుపాయాలు కప్పగంతు అచ్యుతరామయ్య గారు గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉన్న కాలములో ఈ గ్రామమునకు రహదారి ఏర్పడింది. కప్పగంతు లక్ష్మినరసింహం గారు రహదారి కొరకు తన పొలమును ప్రభుత్వమునకు ఇచ్చుటకు ముందుకు రావడం వల్ల ఇది సాధ్యమయ్యింది. రహదారి 1967-69లొ పూర్తయ్యింది.


ప్రయాణ సదుపాయాలు ప్రత్యేకముగా ఈ గ్రామమునకు బస్సు సౌకర్యాములేదు. దగ్గరలోని రైలు స్టేషను తరిగొప్పుల(విజయవాడ-మచిలీపట్నం మార్గము) గన్నవరమునుండి(4-5 కిలోమీటర్ల దూరం) వరకు ఆటోలో వెళ్ళవచ్చును (ఫొటోలో చూడండి),విజయవాడ, ఏలూరు మరియు ఇతర పట్టణాలకు జాతీయ రహదారిపై తిరిగే వాహనాల ద్వారా(గన్నవరం మీదుగా) ప్రయాణం చేయవచ్చును. విజయవాడ నుండి ఈ గ్రామము మీదుగా ఒక సిటీ బస్సు (116 నంబరు)నడుస్తున్నది.

అబ్దుల్లా

మా ఊరులో కొంతకాలం మా పొలం కౌలుకి తీసుకుని పంట పండించిన అబ్దుల్లా(మా నాన్నగారికి మంచి స్నేహితుడు),నేను మా ఊరుకి వెళ్ళినప్పుడు, ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక, పక్కనే ఉన్న గన్నవరంలో ఉంటున్నాడని తెలిసింది. ఆయన అనారోగ్యం వల్ల మాట సరిగ్గా రావటంలేదు. ఆయన నాటకాలలొ వేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా హరిశ్చంద్ర లో పద్యాలకు, గ్రామంలో మంచి పేరున్నది.

అంత అనారోగ్యంలోనూ, నన్ను చూసి ఆనందంగా కూచుని మంచి మాటలు నాలుగు మాట్లాడి, అదే ఊపులో పద్యం అందుకున్నాడు.పద్యం పెద్దగా అర్థం కాకపోయినా, ఆయన ఉత్సాహం గమనించాలి.నాకు మా బాబాయిలు ఎంతో ఈయన కూడ అంతే.వీడియో చూసి/విని ఆనందించండి.


24, సెప్టెంబర్ 2009, గురువారం

అమరావతి కథలు - సమీక్ష 1

అమరావతి కథలు 1 నుండి 5 వరకు
నా మాట
పైన సమీక్ష అని వ్రాసాను కాని, అమరావతి కథలమీద సమీక్ష వ్రాసెంతటి శక్తి నాకు లేదని తెలుసు. కాని, ఆ కథలమీద ఇష్టంతో ఆ కథలను నేను ఎలా అర్థం చేసుకున్నానో చెప్పటం ఒక ఉబలాటం, సరదా. అందులో భాగంగా, మొత్తం నూరు కథలగురించి వ్రాద్దామని నిర్ణయించుకున్నాను .ఒకేసారి వ్రాయక పోవచ్చును, వీలు కలిగినప్పుడల్లా వ్రాస్తూ ఉంటాను. వ్యాసం మరీ పెద్దద కాకుండా, తడవకు ఐదు కథల గురించి వ్రాస్తాను. మొదటి విడత ఈ రోజునే.

1.వరద
ముఖ్య పాత్రలు-శాస్త్రిగారు, మాల సంగడు
బాపు బొమ్మ-శాస్త్రిగారు చెయ్యి చాచటం, మాల సంగడు నెయ్యి వేస్తూండటం
కథ: అమరావతిలో వరద వచ్చి అందరూ వీధిన పడిన సమయాన సమిష్టి భోజనాలు కులాతీతంగా అందరూ కలసి వండుకుంటారు. వడ్డన సమయంలో, మాల సంగడు శాస్త్రిగారికి నెయ్యి వడ్డించటానికి సందేహిస్తే, శాస్త్రిగారే సంగణ్ణి పిలిచి " ఒరే సంగా! నీకు ఆకలేస్తుంది, నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపొదురా....వెయ్యరా" అని సంగడి చేత నెయ్యి వేయించుకుంటాడు. "వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లొ మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది" అన్న రచయిత ముక్తాయింపుతో కథ ముగుస్తుంది.

2.సుడిగుండంలొ ముక్కుపుడక
ముఖ్య పాత్రలు :ఎలికలాళ్ళు బాచిగాడు, సింగి; భూస్వామి భూమయ్య, అతని భార్య సూర్యకాంతం
బాపు బొమ్మ- నీటి వలయాలు, అందులో సింగి చేతులో బిడ్డతో నుంచుని, బాచిగాడు పూర్తిగా వంగి నీళ్ళల్లో జల్లెడపడుతుంటాడు, ఆ జల్లెడ సూర్యకాంతం ముఖాకృతి కలిగి ఉంటుంది(వారి అంతర్యాన్ని జల్లెడపట్టి బాచిగాడు గ్రహించినట్టు)
కథ - బాచిగాడు, సింగి ఎలికలోళ్ళు, నీళ్ళల్లొ జల్లెడపట్టి రంగురాళ్ళు ఏరుకొని బతుకుతుంటారు. ఓకరోజు వీరలా వారి పనిలో ఉండగా భూమయ్య, బార్య సూర్యకాంతం ప్రొద్బలంతో, పిలిచి తన భార్య ముక్కుపుడక ఆ నీళ్ళల్లొనె పొయిందని, వాళ్ళకి దొరికినా ఇవ్వలేదని అభియోగం చేసి వెంటనే ఇవ్వమని హూంకరిస్తాడు. బిత్తరపోయిన ఆ దంపతులు, దిక్కుతోచక చివరికి ఆ ముక్కుపుడక వెతికి ఇద్దామని నిర్ణయించుకుని, బాచిగాడు రొజంతా జల్లెడపట్టి ఆ ముక్కుపుడక పట్టి భూమయ్యకు సమర్పించుకుంటాడు. లోకం తెలియని సింగి భూమయ్య ఏమన్న బహుమతి ఇచ్చాడా, కనీసం పప్పన్నం అని అడుగుతుంది పాపం. బాచిగాడు చక్రవర్తి హుందాలో మంచిరాయి దొరకనీయే! మనవే పెడ్దాం అంటాడు. భూమయ్య తన ధనాధికారంతో అశక్తుడైన బాచిగాడ్ని ఎలా వాడుకుని తన పని డాంబికంగా ప్రతిఫలం ఇవ్వకుండా చేయించుకుంటాడో మనసున్న వారికి చివుక్కుమనే రీతిలో రచయిత వ్రాశారు. ఎర్ర మార్కు కథల్లో ఉండే అవేశ కావేశాలు లేకుండా, మానవ ప్రవృత్తి సహజ దర్పణంలో చూపబడింది ఈ కథలో.

3.పుణుకుల బుట్టలో లచ్చితల్లి
ముఖ్య పాత్ర-సుబ్బాయి లేదా సుబ్బారావుగారు
బాపు బొమ్మ- ఒక మాసికల గుడ్డ చిరుగులోంచి ఒక వ్యక్తి ఆ మాసికల గుడ్డకు నమస్కరిస్తూంటాడు
కథ-స్థూలంగా పుణుకులమ్ముకునే సుబ్బాయి సుబ్బరావుగారుగా మారిన వైనం, అలా పెరిగి ధనవంతుడయినా, తన మూలాలు మరవకుండా, తన ఎదుగుదలకు ముఖ్య ఆధారాన్ని పూజిస్తూ ఉండటం. కథలో అంతర్గతంగా పేకాటరాయుళ్ళు, తాగుబోతులు, ఏవిధంగా తమ కాలాన్ని, ధనాన్ని వ్యర్ధపరుస్తూంటారో, ధన పరంగా కొంత ఎదుగుదల తరువాత పాత పేరు రోతగా మారి కొత్త పేరుగా రూపాంతరం చెందటం (సుబ్బాయి సుబ్బరావుగా, అతని మనుమడు బుచ్చయ్య హేమంతకుమార్ గా) చెప్పబడింది. పేకాట ఆడుతున్న చోటు, "పేకాట యజ్ఞవేదిక"గా వర్ణన చక్కటి హాస్యం. పేకాటరాయుళ్ళకు పావలా వడ్డీతొ, తాగుబోతులకు అర్ధరూపాయి వడ్డితో సుబ్బాయి అప్పివ్వడం, రెంటి వడ్డిల్లో ఉన్న పెద్ద అంతరం-సుబ్బాయి తాగుబోతుల బలహీనతను తనకనుకూలంగ ఎలా ద్రవ్యపరుచుకుంటాడో - వడ్డీ వ్యాపారుల మోసకారితనానికి అద్దంపడుతుంది.

4.రెండు గంగలు
ముఖ్య పాత్రలు
వాన, శాస్త్రిగారు
బాపు బొమ్మ- ఆకాశగంగ, భూలోక గంగ పక్కన వానలో అనందిస్తున్న శాస్త్రిగారి భార్య
కథ-శాస్త్రిగారు పొలంవెళ్ళి వస్తుండగా వాన మొదలయ్యి అందులోపూర్తిగా తడిసి సంపూర్ణానందం పొంది, మళ్ళీ మామూలు లోకంలోకి వచ్చి, కొత్తగా కాపురానికి వచ్చిన తన భార్య ఏమయిందోనని ఇంటికి ఆదుర్దాగవచ్చి చూస్తే, ఆమె కూడా దొడ్లో వానలో నుంచుని వాన కృష్ణలో,కృష్ణ వానలో కలవటం (అదే రెండు గంగలు) చూసి అనందిస్తూ ఉంటుంది. కథంతా శాస్త్రిగారుతన 80వ పడిలో మనవలకి చెప్తుంటే మనకు తెలుస్తుంది. ఈ కథలో వాన, వాన పడుతున్న తీరు యెక్క వర్ణన చాలా చక్కగా ఉంటుంది. కథ వింటున్న శాస్త్రిగారి పెద్ద మనవడు "వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్యా" అంటాడు. చదువరులకు కూడా అక్కడకు వచ్చేసరికి, సరిగ్గా అదే అనిపిస్తుంది. పూర్వం, అంటే 20వ శతాబ్దపు మొదటి రోజులలో, భార్యను భర్త "ఓహోయ్" అని పిలిచేవాడని హాస్య పూరకంగా తెలుస్తుంది.అప్పట్లో పట్నవాసం వాళ్ళను పల్లె వాసులు (ఇప్పుడది తిరగబడింది) ఎలా ఆట పట్టించేవారో శాస్త్రిగారు తన భార్య గురించి "అందులో పట్నంలో కచ్చేరీ గుమాస్తాగారి కూతురేమో, వర్షంలో తడిసి జలుబుచేసి ఎక్కడ ముక్కూడగొట్టుకుంటుందో" అనుకోవటం హాస్యోక్తిగా రచయిత మలచారు.


5.బంగారు దొంగ
ముఖ్య పాత్రలు-దొంగ,జానకి రామయ్య, భూషయ్య
బాపు బొమ్మ-వినాయకుడి మీద ఎక్కి కూర్చున్న భూషయ్య,కొంత డబ్బులు పడేస్తుంటే, అనందంతో అవులిస్తూ చేతులు ఎత్తి తీసుకుంటున్న దొంగ. వినాయకుడు విచారంగా తన నెత్తిన ఎక్కిన భూషయ్యను భరిస్తుంటాడు. బొమ్మ అంతర్యం అసలు దొంగ ఎవరో చెప్పటమే.
కథ-ఊళ్ళొ జరిగిన ఒక సంఘటన. గుళ్ళొ దొంగతనం జరుగుతుంటే పసికట్టిన జానకిరామయ్య ఊరివారిని హెచ్చరిస్తాడు. ఊళ్ళోవాళ్ళు, వాడువీడని లేకుండా అందరూ గుడిమీదపడి దోంగను పట్టుకుని, వీరొచితంగా చావగొడతారు భూషయ్యతో సహా. కథ పేరు "బంగారం దొంగ" అని పెట్టకుండా, "బంగారు దొంగ" పెట్టడంలోని చమత్కారం కథలోని కొసమెరుపు. ఆ దొంగ, భూషయ్య చేత నియోగించబడ్డవాడు. వాడికి డబ్బిచ్చి, దొంగతనానికి పురిగొల్పి, బంగారుపూతను సంగ్రహిస్తూ వాడికి నాలుగు రూకలు పడేస్తుంటాడని భూషయ్య-దొంగల సంభాషణలో తెలుస్తుంది. బంగారం దొంగ భూషయ్య, భూషయ్యకు దొంగ (వీడికి పేరులేదు)బంగారు దొంగ. వేసంకాలం మిట్టమధ్యాహ్నం, శివాలయంలో రికామిగా జరుగుతున్న దొంగ పని బయటపెట్టడానికి మొలల వ్యాధిగ్రస్తుడైన జానకిరామయ్య పాత్రను కల్పించి రచయిత హాస్యాన్ని పండించారు.


(ఇంకా ఉంది)
మిగిలిన కథలు వీలు చిక్కినప్పుడల్లా

23, సెప్టెంబర్ 2009, బుధవారం

అమరావతి కథలు

అమరావతి కధలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కధాసంపుటి . అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కధలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి.ఏ కథా కూడ ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో కాయితం (News Print) కరువు ఉండేది. ఆ కారణాన,ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడ రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడ ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు. చక్కని తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ, ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులం వ్రాసారు శంకరమంచి సత్యం .

ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

రచయిత శ్రీ సత్యం శంకరమంచి ఈ కథలు తను ఎలా వ్రాసారో, తన కథా సంపుటి మొదటిలో కృతజ్ఞతలులో ఈవిధంగా తెలియ చేసారు- "ఓ సాయంవేళ పురాణం సుబ్రహ్మణ్య శర్మ (అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక సంచాలకులు) ఉన్నట్టుండి మీరు అమరావతి కథలు అని ఎందుకు
రాయకూడదు? అన్నారు ఓ క్షణం అవాక్కయి పోయాను. ఎప్పటిమాట! పన్నెండేళ్ళ క్రితం జైపూర్ లో పని చేసేటప్పుడు అమరావతి కథల పేరిట కొన్ని కథలు రాద్దామని నోట్సు రాసుకోటమేమి, ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఈయన అడగటమేమి! తేరుకుని వరసగా నాలుగు కథలు ఆశువుగా చెప్పాను." ఆ తరువాత జరిగినది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అనగా 100 వారాలపాటు అమరావతి కథలు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ప్రచురించబడి ఎంతగానో ప్రజాదరణ, సాహిత్యవేత్తల గౌరవం పొందటం.

అమరావతి కథలు అన్న పేరు ఎందుకు?
రచయిత సత్యం శంకరమంచి పుట్టి పెరిగింది అమరావతి గ్రామంలో. ఆయన చిన్నతనంలో ఉన్న సామాజిక పరిస్థితులు, జీవన విధానాలు తో పాటు, ఆ ప్రాంత చరిత్రలో పరిశొధన చేసి వ్రాసిన కథలు అమరావతి కథలు. అన్ని కథలు అమరావతిలో జరిగినవే. ఊహాజనిత గ్రామమో లేక పట్టణమో తన కథలకు వేదికగా రచయిత సత్యం తీసుకోలేదు. తనకు తెలిసిన అమరావతి గ్రామం తరువాత పట్టణమయినా, తన కథలన్ని అక్కడజరిగిన సంఘటనలుగానే తీర్చి దిద్దారు. అందుకనే, ఈ కథలకు మరే పేరు నప్పదు, అమరావతి కథలే సరయిన పేరు. ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ అన్నట్టు, "అమరావతి కథలు అపురూప శిల్పాలు".
కధా వస్తువు
ఈ కథలలోని పాత్రలు రాజులున్నారు, స్వాములవార్లు ఉన్నారు, దొంగలు, భక్తులు, నాస్తికులు, దాతలు, లోభులు ఒకరేమిటి మనకు సామాన్యంగా ప్రతిరోజు తారసపడే వారందరూ ఈ కథలలో పాత్రలే. కథలన్నీ కూడ చాలా చిన్న చిన్నవి. మరింత ఉంటే బాగుండునేమో అనిపించేవే. ఎంతటి సామాన్య ప్రజలను పాత్రలు చేసి కథలు వ్రాసినా, కథాంశం మనిషిలోని ఔన్నత్యాన్ని మాత్రం వదిలి పెట్టదు.


కథలకు బాపు బొమ్మలు"బంగారానికి చక్కటి సువాసన అబ్బితే" అని సామెత చెప్పుకుని ఆశ పడే వారు, ఈ కథా సంపుటిలోని కథలను, వాటికి ప్రముఖ సినీ దర్శకుడు మరియు చిత్రకారుడయిన బాపు వేసిన బొమ్మలు చూసిన తరువాత ఈ సామెత నిజమవ్వచ్చు అనుకోవటంలో తప్పు లేదు. ప్రతి కథకు మొదట బాపు వేసిని బొమ్మ, కథను దాదాపు చెప్పకనే చెప్తుంది. కథ చదివిన తరువాత చూస్తే ఆ బొమ్మ తప్ప మరే బొమ్మయిన వెయ్యగలమా అని చూస్తే ఎమీ తట్టదు. కథలకు బొమ్మలు అంత బాగా సరిపొయ్యాయు. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన బుడుగు కు చక్కటి బొమ్మలు వేసి చిన్నలనే కాక పెద్దలనే ఎక్కువ అలరించిన చిత్రకారులు బాపు, ఈ కథలకు తన ప్రతిభకు పూర్తి తార్కాణంగా, బొమ్మలను వేసి చదువరులను అలరించాడు.

కథాసంపుటి ముఖ చిత్రం చూస్తేనె తెలుస్తుంది బాపు చిలిపితనం, నిండుతనం. రచయిత, పార్వతీ పరమేశ్వరుల సరసన కూర్చుని, చాలా సావకాశంగా, వారికి తన కథలను వినిపిస్తున్నట్టు, తన ఆజ్ఞకానిదే చీమనుకూడ కుట్టనివ్వని పరమేశ్వరుడు, పార్వతీ సమేతుడయి చిద్విలాసంగాను,నందీశ్వరుడు మరియు గోపన్నలు పారవశ్యంగానూ, వింటున్నట్టు చిత్రీకరించారు. అమరావతిలోని అదిదేవుడయిన అమరేశ్వరుడే దిగివచ్చి ఈ కథలు వింటున్నాడని స్పురింప చేశారు.

అమరావతి కథల జాబితా
1.వరద
2.సుడిగుండంలొ ముక్కుపుడక
3.పుణుకుల బుట్టలో లచ్చితల్లి
4.రెండుగంగలు
5.బంగారు దొంగ
6.ముక్కోటి కైలాసం
7.అరేసిన చీర
8.శివుడు నవ్వాడు
9.ఒక రోజెళ్ళి పోయింది
10.హరహర మహాదేవ
11.ధావళీ చిరిగిపోయింది
12.రాగిచెంబులో చేపపిల్ల
13.అద్గద్గో బస్సు
14.పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి
15.పందిరిపట్టి మంచం
16.అన్నపూర్ణ కావిడి
17.చెట్టు కొమ్మనున్న కథ
18.అఖరి వేంకటాద్రినాయుడు
19.ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే
20.పచ్చగడ్డి భగ్గుమంది
21.లేగదూడ చదువు
22.ఆవతలొడ్డు పొంగింది
23.మే!మే! మేకపిల్ల
24.కాకితో కబురు
25.తులసి తాంబూలం
26.భోజన చక్రవర్తి
27.నావెళ్ళిపోయింది
28.నీరు నిలవదు
29.ఎంగిలా?
30.బాకీ సంతతి
31.మాయ
32.నివేదన
33.ధర్మపాలుడు
34.నాన్న-నది
35.కీలుగుర్రం
36.అచ్చోసిన ఆంబోతులు
37.వయసొచ్చింది
38.లంకల్లపుట్టింది లచ్చితల్లి
39.ఇద్దరు మిత్రులు
40.పున్నాగ వాన
41.ఖాళీ కుర్చీ
42.రాజహంస రెక్కలు విప్పింది
43.ఎవరా పోయేది?
44.ముద్దులల్లుడు
45.ముద్దేలనయ్య - మనసు నీదైయుండ
46.వంశాంకురం
47.బలి
48.అటునుంచి కొట్టుకురండి
49.మనసు నిండుకుంది
50.అబద్ధం - చెడిన ఆడది
51.దొంగలో? దొరలో?
52.కానుక
53.తల్లి కడుపు చల్లగా
54.విరిగిన పల్లకి
55.నావెనుక ఎవరో....
56.సిరి - శాంతి
57.గుండె శివుడి కిచ్చుకో
58.సంగమం
59.అంతా సామిదే? నేనెవర్ని ఇవ్వడానికి
60.మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ
61.అంపకం
62.నిండుకుండ బొమ్మ
63.గాయత్రి
64.మౌన శంఖం
65.అదుగో - అల్లదుగో...
66.అప్పడాల అసెంబ్లీ
67.మాట్టి..ఒఠిమట్టి..
68.వేలం సరుకు
69.నిలబడగలవా?
70.సాక్షాత్కారం
71.ఎవరికీ చెప్పమాక!
72.జ్ఞానక్షేత్రం
73.ఏక కథాపితామహ
74.తృప్తి
75.ఆగని ఉయ్యాల
76.తెల్లవారింది
77.తంపులమరి సోమలింగం
78.ఏడాదికో రోజు పులి
79.దూరంగా సారంగధర
80.అమావాస్య వెలిగింది
81.త, థి, తో, న
82.స్తంభన
83.పట్టుత్తరీయం
84.మృత్యోర్మా...
85.అంతా బాగానే ఉంది
86.దీపం - జ్యోతి
87.కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి
88.పూల సుల్తాన్
89.పక్క వీది జన్మంత దూరం
90.టపా రాలేదు బొట్టు చెరగలేదు
91.భొజనాంతే...
92.ఓ నరుడా! వానరుడా!
93.బిందురేఖ
94.నేనూ మేల్కొనే వున్నాను
95.ఏడుపెరగనివాడు
96.అరుగరుగో సుబ్బయ్య మేష్టారు
97.ప్రణవమూర్తి
98.సీతారామాభ్యాం నమ:
99.శిఖరం
100.మహా రుద్రాభిషేకం



అభిప్రాయాలు
ముళ్ళపూడి వెంకటరమణ
-"అమరావతి కథలు అపురూప శిల్పాలు....ఊత్తమశ్రేణి ఆధునిక కధావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే.....వేయిపుటల వేయిపడగల కథలో సత్యనారాయణగారు చిత్రించిన తెలుగుజీవన విశ్వరూపానికి మూడు వాక్యాలో-మూడు మాటలలో ఈ కథలు అద్దం పట్టి చూపాయి......త్యాగరాజస్వామి - కీర్తనలతో, స్వరాలతో, అక్షరాలతో, స్వరాక్షరాలతో, రాగభావాలతో కీర్తనలు అల్లి రామచంద్రుడిని అలంకరించుకున్నట్టే ఈయన అంత జాగ్రత్తగా, ప్రేమతో అమరేశ్వరుడిని, ఆయనను సేవించుకునే తెలుగువాడిని అర్చించారు.....పట్టరాని అనందం కొద్దీ మనసులో వెయ్యి పేజీలు రాసుకున్నాను. చదివిన ప్రతివాళ్ళూ పదివేల పేజీలు రాసుకోగలరు కూడా......తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండజ్యోతి పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివి తీరని అమృత కలశం, అక్షయమైన అక్షరపాత్ర. శిల్ప సౌదర్యానికి పరమావధి, పపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం.


వావిలాల సుబ్బారావు".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు"
**************************************************************

ఈ వ్యాసం ఇంతకు ముందు, తెలుగు వికీపీడియాలో నేను వ్రాసినది, ఇక్కడ పున:ప్రచురణ. చక్కటి ఈ అమరావతి కథలను అన్నిటిని సమీక్షాపూర్వకంగా సంగ్రహంగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను. కొన్ని ఇప్పటికే తెలుగు వికీలో వ్రాసాను, వాటిని నా బ్లాగులో పున:ప్రచురించి, మిగిలిన కథలగురించి కూడా ఇక్కడే వ్రాస్తాను.
**************************************************************

**************************************************************

పరోపకారి పాపన్న-సమీక్ష లాంటి ఇంటర్వ్యూ


పరోపకారి పాపన్న కథలు* చందమామలో ప్రచురించబడిన ధారావాహికల లో ముఖ్యమైనది. ఈ కథలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఎవరైనా కొంచెం మంచికి పోయి సహాయపడితే, అటువంటివారిని పరోపకారి పాపన్నరా వాడు అని పిలవటం వాడుక అయ్యింది. అటువంటి పరోపకారి పాపన్నతో ఈ రోజున సంభాషిద్దాం అని అలా వెతుక్కుంటూ,ఊరంతా తిరిగినాక, ఒక సందులో తెరపగా ఉన్న చిన్న ఇల్లే ఆయనది అని తెలిసింది. గేటు తెరుచుకుని లోపలకి వెళ్ళితే ఒక వయసు మళ్ళినాయన పడక కుర్చీలో పడుకుని చదువుకుంటున్నారు. చందమామలో మనకి పరిచయమేగా, పెద్దవాడయిపోయినా పాపన్నగారిని ఇట్టే గుర్తుపట్టాను.

నేను: ఏమండోయ్ పాపన్నగారూ! నమస్కారం

పాపన్న: ఎవరు నాయనా, వయసు మళ్ళిపోయింది చూపు సరిగ్గా ఆనటంలేదు మీకు నేనేమైనా సహాయం చెయ్యగలనా? చెప్పండి


నేను: లేదండి,సహాయం కాదండీ, నేను మీ అభిమానిని మీతో కాసేపు ముచ్చటిద్దామని మిమ్మల్ని పలకరించాను, మీకు ఇబ్బందేమి లేదుకదా.

పాపన్న: అబ్బే, ఇందులో ఇబ్బందేమున్నది నాయనా, అలా కూర్చో చెప్పు ఏం మాట్లాడుదామనుకుంటున్నావు.

నేను:(కొంచెం బిడియంగా)మీ గురించి నా బ్లాగులో వ్రాద్దామనుకుంటున్నాను, మీ గురించి వివరాలు చెప్పగలరా.

పాపన్న: అడుగు బాబూ, నాకు గుర్తు ఉన్నంతవరకు, తెలిసినంతవరకు చెప్తాను.

నేను: మీరు ఎక్కడి వారండి, మీరు ఎప్పుడు పుట్టారు?
పాపన్న: ఎక్కడివారంటే?? నేను పదహారు ఆణాల తెలుగు వాణ్ణి,ఇప్పుడు మీరు ఏదో జిల్లాలు, ప్రాంతాలు అని కొంచెం బేధించి మాట్లాడుకుంటున్నారనిపిస్తున్నది. అప్పట్లో తెలుగువారందరూ ఒకటే.నేను తెలుగు చందమామలో పుట్టాను. అక్కడే అనేకమందికి సహాయం చేసాను.

నేను: చందమామలో పుట్టారు, ఇంత పేరు తెచ్చుకున్నారు, మిమ్మల్ని సృష్టించిన వారెవ్వరండి, చందమామలో ఎప్పుడు పుట్టారు?

పాపన్న: పేరుదేమున్నది నాయనా! ఆపదలో ఉన్నవారిని, నిస్సహాయులకు సహాయం చెయ్యటమే నాకు తృప్తిని,హాయిని ఇచ్చింది. నన్ను సృష్టించినది, ఎం రంగారావుగారని, చందమామలోనే పనిచేసేవారు. ఆయన చాలా ఊహించి, నన్ను ప్రజలకు ముఖ్యంగా బాలలకు పరిచయించేసారు. సరిగ్గా గుర్తులేదు, 1962 జ్యేష్ట మాసంలో అనుకుంటాను మొదటిసారి నాకు ఈ ప్రపంచాన్ని రంగారావుగారు చూపించారు. అప్పటికే నాకు 14-15 ఏళ్ళు ఉంటాయి.
నేను: మీరు ఎంతవరకు చదువుకున్నరండి. ఎవరిదగ్గర.......

పాపన్న: చదువుదేమున్నది ఏదో చదువుకున్నాను, మా గురువుగారు చెప్పిన పరోపకారం మిదం శరీరం మాత్రం బాగా వంటబట్టింది.

నేను: మీరు భీమన్నను, తాతయ్యగారిని ఎరుగుదురా?

పాపన్న: (నవ్వుతూ) ఆ! ఆ! భీమన్న గురించి చాలా విన్నాను. నాకు ముందటివాడు. తొందరపాటు, అమాయకత్వమేకాని, చాలా మంచివాడని అందరూ చెప్పుకుంటారు. ఇక తాతయ్యగారు నేను కలసి మెలిసి తిరిగాం. నాకంటే చాలా పెద్దవాడు. చాలా నీతిమంతుడు ఎన్ని చక్కటి కథలు చెప్పేవాడు, వాళ్ళమనవలకి, మనవరాళ్ళకే కాకుండా నాకు కూడ. ముఖ్యంగా ఆయన చెప్పిన కథలలో సత్యవాది, అసత్యవాది కథలు ఇప్పటికి గుర్తున్నాయి.
నేను: మీకు పరోపకారి పాపన్న అన్న పేరు ఎందుకు వచ్చిందండి?

పాపన్న: ఇప్పుడంటే పెద్దవాణ్ణయిపోయాను, ఎవరూ నన్ను ఆడగటంలా. ఈ మధ్యవరకూ, అడిగిన వారికి లేదనకుండా నాకు చేతనయినంత ఉపకారం చేశాను. నిస్సహాయులను చేరదీసి ఆదరించాను. అసలు నా సృష్టికర్త రంగారావుగారే, నా కణకణాల్లోనూ పరోపకారం రంగరించి పోశారు. అందుకనే కాబోలు నలుగురూ, ఆయనే పరోపకారి పాపన్న అనుకోవటం విన్నాను. అలా పిలిచినప్పుడల్లా నాకు కొంత ఇబ్బందిగా ఉంటుంది, మనమేదో చేతయినంత చేస్తాం ఆ మాత్రానికే అలా మెచ్చుకోవాలా. నేను చెయ్యలేనిది ఎట్టగో చెయ్యలేనుకదా.

నేను: (లేచి ఆయన చేతులు రెండు కళ్ళకు అద్దుకుని) పాపన్నగారూ, ఎంతమందికి సహాయం చేసినా, మీకు మీరేదో గొప్పపని చేసానని అనుకోవటమే లేదు. అదేనండి మీ గొప్పతనం, మా అందరికీ మీరంటే అభిమానం భక్తి అందువల్లనే కదండీ

పాపన్న: చిరునవ్వు నవ్వి అలా కూచూండి పొయ్యారు.


నేను: పాపన్న గారూ మీకు జీవితంలో కష్టాలు ఏమైనా ఎదురయ్యాయా?
పాపన్న: కష్టాలా, లేదండి, నాకెప్పుడూ అలా అనిపించలేదు. ఏదో నాపని నాది, ఓకళ్ళ జోలికి పోను. నాకు చేతయ్యినపని చేసుకోవటం అంతే.
నేను: మీరు మీ పని మానుకుని ఇతరులకి సహాయం చెయ్యలని ఎందుకు అనుకునేవారండి.
పాపన్న: చూడు నాయనా, పాత కాలం వాణ్ణి, ఇది నా పని, ఈ పని వేరొకరిది అని నాకు తెలియదు. అన్నీ నా పనులే. నా పని ఎప్పుడూ ఆగలేదు, చెడలేదు.

నేను: పరోపకారం వల్ల మీకు ఉపకారం జరిగిందా పాపన్నగారూ.

పాపన్న: ఎంతమాట నాయనా మనకు ఉపకారం జరగాలని ఇతరులకి ఉపకారం చేస్తామా ఎంత తప్పు. సహాయం చెస్తున్నానని ఏనాడు అనుకోలేదు. అది కూడ నాపనే. అందులో ఎంతో ఆనందం ఉన్నది. భగవంతుణ్ణి సేవించటం కంటే ఎంతో తృప్తి నిస్తుంది.

నేను: మీకు చిత్రాగారు గుర్తున్నారండి

పాపన్న: అయ్యెయ్యో
చిత్రాగారు, ఆయన అసలు పేరు రాఘవులు గారు బాబూ. చాలా మంచివాడు. నా రూపు రేఖలన్నీ ఆయన గీసినవే, ఆయన లేకపోతే నేనెక్కడున్నాను. 1979లో కాబోలు స్వర్గస్తులయ్యారు. చాలా బాధపడ్డాను ఆరోజున.

నేను: చివరగా, పాపన్నగారూ, ఇప్పటి తరానికి మీ సందేశం...
పాపన్న: సందేశమా!! నేనేపాటివాణ్ణి సందేశమివ్వటానికి. ఒక రెండు ముక్కలు చెప్తాను భగవంతుదు మన్ని సృష్టించినది ఒకరికొకరు ఉపయోగపడటానికి. ఇందాక చదువు గురించి ఆడిగావుకదా, నేను చదువుకున్నది ఒక్కటే, మన బ్రతుకు మనం బ్రతకటం, ఇతరులకి అడ్డుపడకూడదు. ఎవరి బ్రతుకులు వారివి, ఇంకొకళ్ళకు బాధకలిగించకుండా బ్రతకటమే నిజమైన చదువు. ఉట్టి అక్షరాలు నేర్చుకుని చదువగలిగినంతమాత్రాన అక్షరాస్యుడుకాదనుకుంటున్నాను.

నేను: చాలా చక్కటి విశేషాలు చెప్పరండి, చాలా ధన్యవాదాలు. మరి నాకు శలవు ఇప్పించండి. నమస్కారం.

పాపన్న: అలాగేనాయనా. ఉండు ఉండు నా బండి తీస్తాను, మీ ఇంటిదాకా దిగబెట్టి వస్తాను (అని లేచారు)

పాపన్న గారిని నేను వెళ్ళగలనని ఆయనను సముదాయించి మళ్ళీ కూచోబెట్టి, నేను ఇలా చక్కా వచ్చాను.

****************************************
నాకు తెలుసు మీరు అడుగుతారని, పాపన్న కథలు సినిమాగా తీస్తే ఎవరు వెయ్యగలరు ఈ వేషం అనేకదూ? నా ఉద్దేశ్యంలో బాలయ్య అయితే (మీరు అనుకునే బాలయ్య కాదండి బాబు! అసలు బాలయ్య నేరము శిక్ష లాంటి మంచి సినిమాలు తీసి కొన్ని చక్కటి వేషాలు కూడా వేసాడే ఆయన)

****************************************
*ఈ లింకు నుండి మునుపు డౌన్లోడ్ చేసుకోవటానికి ఆవకాశం ఉండేది. కాని కాపీ రైటు సమస్యలవల్ల ఆ సౌకర్యం తొలగించటం జరిగింది. ఇప్పుడు ఈ ధారావాహిక చదవాలంటే, చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ వారు ఉంచిన పాత చందమామలను తెరిచి చదువుకోవచ్చు.

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

పాపం గుమ్మడిగారు అను ఇంటర్వ్యూ ఆఖ్యానం

ఈ మధ్యనే భక్తి చాన్నెల్‌లో అనుకుంటాను ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారితో ఒక ఇంటర్వ్యూ చూడటం జరిగింది. ఏమి ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ ఎలా చెయ్యకూడదో ఇది ఒక చక్కటి ఉదాహరణ. చానెల్సులో చేరి మంచి పేరు తెచ్చుకుందామనుకొనే ఏంఖర్లు అందరూ చూసి తీరవలసిన ఇంటర్వ్యూ ఇది. కాపోతే, ఎలా ఇంటర్వ్యూ చెయ్యకూడదో నేర్చుకోవచ్చు.

ఇదివరకు దూరదర్శన్ ఏక చత్రాధిపత్యం జరుగుతూ ఉండగా, వాళ్ళ గుమాస్తాలు కూడ ఇలాగే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. పాపం ఆ వచ్చినాయన్ని మాట్టాడనిచ్చేవాళ్ళుకాదు. పూర్తిగా ఒక ఐదు నిమిషాలు ఎదేదో వాగి, అంతేనా అండి అంటే, ఆ వచ్చిన అతిధి అవునండి అని ఒక వెర్రి నవ్వు నవ్వి తల తాడించేవాడు.

ఇప్పుడు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో, భక్తి చానెల్ వాళ్ళు, ప్రముఖ నటుడు గుమ్మడి గారితో ఇలా ఇంటర్వ్యూ ప్రసారం చేస్తారని అనుకోలేదు. ఆ ఇంటరవ్యూ చేసినాయన పెద్ద మాటల రచయిత(ట). ఎంత తాను వ్రాసిన మాటలే నటులు చదువుతారని అనిపించినా, ప్రసుతం తాను ఇంటర్వ్యూ చేస్తున్నాను అని మర్చిపొయ్యాడను కుంటాను.

అరే! గుమ్మడిని మాట్టాడనివ్వడే. పాపం గుమ్మడిగారు ఏదో విషయం చెప్పాలని మొదలు పెట్టగానే పానకంలో పుడకలాగ ఇతగాడు ఆడ్డుపడటం, అనవసరమైన ఒక వ్యాఖ్య చెయ్యటం, చెప్పే మూడ్ అంతా పోయి గుమ్మడిగారు అవునండీ అవునండి అని ముగించటం. చాలా భాధ వేసింది ఆ ఇంటర్వ్యూ పధ్ధతి చూస్తుంటే.

ఇంటర్వ్యూ చేసేవాడికి ఉండవలసిన ముఖ్యమైన ప్రాధమిక లక్షణం వాగుడు తగ్గించుకొని, తాను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని ఎక్కువగా మాట్టాడించి, అనేక విషయాల్ను
ప్రేక్షకులు/శ్రోతలకోసం రాబట్ట్డం. మాటిమాటికి అడ్డుపడి, ఆవతలి మనిషి తాను చెప్పదలుచుకున్న విషయం మర్చిపొయ్యేట్టుగా చెయ్యటం కాదు. ఇంటర్వ్యూ చేసే మనిషికి అనేకం తెలిసి ఉండవచ్చుగాక. కాని ఆ ఇంటార్వ్యూ చేసేది మాలాంటి పామర, అజ్ఞాన జనంకోసం అని గుర్తుపెట్టుకోవాలి. "అంతేకదండి", "అప్పుడు ఫలానా వారు ఇలా ఉన్నారు" "అలా అన్నారు" అని అడ్డుపడకూడదు. ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి విశేషాలను ప్రేక్షకులకు/శ్రోతలకు చెప్తున్నాడు, ఇంటరవ్యూ చేసే పెద్దమనిషికి కాదు. ఆ అపురూపమైన నటుడి నుంచి ఎన్నెన్ని జ్ఞాపకాలను రాబట్టి ప్రేక్షకులకి తెలియ చెప్పాలి అన్న దృక్పథంలోనే ఉండాలి అతని సంభాషణా చాతుర్యం అంతాకూడా. తన దర్పం, తనకున్న జ్ఞానం ఆ పాత విషయాలమీద గుర్తున్నంతవరకు అనవసర ప్రస్థావన చెయ్యకూడదు.

అన్నిటికన్నా ఇంటర్వ్యూ ఇస్తున్న మహా మహుణ్ణి మాట్టడనివ్వాలి, చీటికి మాటికి ఆడ్డుపడకూదదు. దాన్నే, అష్టావధానంలో అసందర్భ ప్రసంగం అని కాబోలు అంటారు.

గుమ్మడిగారితో మరొక్కసారి కాస్త ఓపిక, చక్కగా ఇంటర్వ్యూ చెయ్యగల శక్తి, నైపుణ్యం ఉన్న వ్యక్తి (అతను మనకి పెద్దగా తెలియవసిన అవసరం లేదు) చేత మళ్ళి చేయించి భక్తి చానెల్ వారు ప్రసారం చేస్తే బాగుండును.
=======================================
గుమ్మడిగారిగురించిన చక్కటి విశేషాలను  ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు
గుమ్మడిగారి విశేషాలు


=======================================

19, సెప్టెంబర్ 2009, శనివారం

వ్యాఖ్యా చిత్రాలు

నా బ్లాగులోకి ఒక అతిధి వచ్చింది. మరెవరో కాదు! మా చెల్లెలే. ఇంట్లో కంప్యూటర్ వచ్చేవరకు, ఆ విషయంలో పెద్దగా తెలియదు. పీసీ వచ్చిన కొద్ది రోజులలోనే మంచి ఆసక్తితో, అన్ని విషయాలు నేర్చుకుని, ఫోటో షాపు కిటుకులు కూడా ఆకళింపు చేసుకుని ఫోటోలను తయారు చెయ్యటం మొదలు పెట్టింది. చిన్నప్పటినుంచి, సామెతలు, జాతీయాలు సేకరించటం అభిరుచి. అందులో భాగంగా ఒక పది వ్యాఖ్యా చిత్రాలను పేర్చి నాకు పంపింది. వాటిని అందరికోసం ఇక్కడ గెస్టు కాలం కింద ప్రచురిస్తున్నాను. నాకు బాగా నచ్చినవి మొదటి రెండు












ఈ వ్యాఖ్యా చిత్రాల కూర్పు, విషయ సేకరణ మరియు రూపకల్పన

శ్రీమతి పుచ్చా నాగలక్ష్మి, విజయవాడ

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

ఏమీ దురవస్థ!!!


నిన్న దేవదాసు సినిమా విసిడిలో చూశాను. అలనాటి కళాఖండం దుస్థితి చూసి దు:ఖించటం మినహా చెయ్యగలిగింది ఏమిటనిపించింది. ఆకలిమీద ఉన్నవాడు, ఆశగా కంచంలో ఉన్న పరమాన్నం తిందామని జుర్రుకోగానే పంటికిందకు ఇంగువ వచ్చినట్టయింది ఆ విసిడి క్వాలిటీ చూసేప్పటికి. ఎమిటీ దురవస్థ మన చక్కటి పాత సినిమాలకు. వాటి హక్కులు ఆ కళాఖండాల విలువ తెలియని నిరక్షరాస్యులైన వ్యాపారస్తుల చేతిలోపడి నలిగిపోతున్నాయి. దేవదాసు సినిమా మొత్తం కుడిపక్కన దాదాపు బెత్తెడు వైశాల్యంలో ఒక చతుస్రాకారం సదా కనపడుతుంది.ఎందుకో తెలియదు. అక్కడ మరెవరి పేరో ఉండి ఉంటుంది. అది తీసెయ్యటం దేనికిలే అని దాన్ని కప్పెట్టటానికి ఈ పని! చక్కటి పాటలు, నేపధ్య సంగీతం సంగీతం ఈ సినిమాలో ఉన్నాయి. కాని దురదృష్ట వశాత్తూ సౌండు రికార్డింగు (వి సి డి లో) నాసిరకంగా ఉన్నది. వానాకాలంలో ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు, ఒక చౌక రకమైన ట్రాన్‌సిస్టర్లో పాటలు వినవలసిన గతి పట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నది ఈ విసిడి శబ్ద నాణ్యత.

వి సి డిలుగానో, డివి డీలుగానో, మనకు మార్కెట్టులో పాత సినిమాలన్నీకూడ దొరుకుతున్నాయి. సామాన్యంగా, ఏ పాత సినిమా విసిడి/డివిడిలు తీసుకున్నా సరే, చివరకు మాయా బజారు కూడ, పరమ నాసిరకంగా ఉంటాయి. అనేక సినిమా హాళ్ళల్లో తిరిగి తిరిగి అరిగిపోయి, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరో పడి ఉన్న రీలుని దుమ్ము వీలైతే దులిపి దాంట్లోంచి చేస్తారల్లే ఉన్నది ఈ సిడి/డివిడి లను. అన్ని పాత సినిమా సిడిలు, గీతల మయం, కట్లు, దృశ్యాల ఎత్తివేత, పాటల ఖూనితో మాత్రమే దొరుకుతున్నాయి. కన్యాశుల్కం విసిడి చూస్తే మొదలే లేదు. మొదట పావుగంట దృస్యాలు గెంతుకుంటూ కట్లతో వెళ్ళిపోతాయి. చివరలో, సీన్లు కూడ తారుమారయ్యాయి. ఇదేనా ఆ పాత సినిమాలపట్ల మనం చూపించవలసిన గౌరవం?? డబ్బుచేసుకుందామనేకాని, ఈ సిడి గాళ్ళకు, మంచి నాణ్యంతో వినియోగదార్లకు ఇద్దామని ఏ కోశానా లేదు. అప్పుచేసి పప్పుకూడు సినిమాలో ప్రముఖ పాత్ర ధరించిన మేటి నటుడు సి ఎస్ ఆర్ పేరు సిడి కవరు మీద లేనేలేదు.

ఇలా చెప్పుకుంటూ పొతే, తెలుగు సినిమా సిడి/డివిడి లలో సవాలక్ష చీకాకుపెట్టే అంశాలు ఎన్నో. అస్సలు ఈ సినిమా తీసిన మహానుభావులు, అప్పుడు వారెంతో శ్రమకోర్చి మనకోసం తీసిన సినిమాలు ఇప్పుడు సిడి లరూపంలో పడే దురవస్థ చూసి ఎంత కుళ్ళి కుళ్ళి ఏడుస్తారో కదా. విచిత్రం, టి విలో పాత సినిమా వస్తే అది చక్కగా ఉంటుంది. వాళ్ళకి దొరికిన మంచి కాపి ఈ సిడిగాళ్ళకు ఎందుకు దొరకవు??

నేను బ్రిటిష్ లైబ్రరీలో క్లాసిక్ మెంబర్ని. అక్కడ వాళ్ళ పాత సినిమాలు 1930లు 1940లలో తీసినవి కూడ రీ మాస్టర్ చేసి శ్రధ్ధగా భద్రపరచి అపురూపంగా దాచుకున్నారు. ఇదేదో ప్రభుత్వం చేసిన పని కాదు. అక్కది సిడి/డివిడి వర్తకులే చొరవ చూపి, అప్పటి నెగెటివ్‌లు సంపాయించి, రెస్టోర్ చేసి, చక్కటి డీవిడి లు అందించి, ప్రేక్షకుల మన్నన పొంది తమ సంపాదన చక్కగా చేసుకుంటున్నారు.కొనుక్కున్న వాళ్ళకు తృప్తి, అమ్ముకున్న వాళ్ళకు లాభం. మన ఈ సిడిగాళ్ళకు అటువంటి బుధ్ధి ఏది. నోట్లో తెల్ల చుట్ట, బుర్రంతా దబ్బు సంపాయించాలనే దుగ్ధ తప్ప వినియోగదార్లకు వారిస్తున్న డబ్బుకు తగిన ప్రతిఫలంగా చక్కటి సిడిలు ఇద్దామనే ఇంగిత జ్ఞానం లేని సి డి నిరక్షరాశ్య వర్తకులు. కళకు సంబంధించినంతవరకు వాళ్ళు నిరక్షరాశ్యులే.

పైరసీ పైరసీ అని ఏడవటమే కాని, వాళ్ళు ఎలాంటి నాణ్యంతో సిడి ఇస్తున్నారో గమనించుకోవటంలా. ఇలాంటి చండాలపు సి డిలని ఒక 5-6 సంవత్స్రాలక్రితం 300-350 రూపాయలు ధర పెట్టి మన్ని దోచుకోలా? ఇప్పుడు ఈ పైరసీ పుణ్యమా అని దిగి వచ్చి 30 నుంచి 50కి అదే చెత్తను అమ్ముకుంటున్నారు.

పేర్లెందుకుకాని, ఎన్నో సినిమాలు తీసి కోట్లకు కోట్లు మన దగ్గ్రనుంచి వడుక్కుని సంపాయించిన దురంధరులు మన పరిశ్రమలో దాదాపు పాతికమందిదాక ఉన్నారు. వాళ్ళకు ఏ మాత్రమైనా సినిమా కళ మీద కనీస ఆసక్తి, గౌరవం (కనీసం ఆ కళను అడ్డుపెట్టుకుని బతికేస్తున్నారు కాబట్టి) ఉంటే, ఒక చక్కటి ఫౌడేషన్ స్థాపించి మన కళా ఖండాలన్నీ కూడ నెగెటివ్‌లతో సహా సేకరించి, రెస్టోర్ చేసి, అప్పటి నటీ నటులు ఇంకా బతికి ఉంటే (చాలావరకు వెళ్ళిపోయారు) వాళ్ళ అనుభవాలను, ఇప్పుడు ఉన్న గౌరవించతగిన విమర్శకులు శ్రీ రావి కోడలరావు, శ్రీ గొల్లపూడి మారుతీరావు మున్నగువారి (మహా ప్రభో దివాకర బాబు మాత్రం వద్దండీ! వద్దు!! చంపేస్తున్నాడు అదేదో చానెల్లో భయంకర సుత్తి వేసి) వ్యాఖ్యలతో డివిడిలుగా కొద్ది లాభం వేసుకుని అమ్మితే పైరసీ జోలికి ఎవరు వెళతారు.

ఇలాంటి చెత్త నాణ్యంతో ఎంత 30-35 రూపాయలు పెట్టి విసిడిలు వేసినా, పైరసీ వాడు ఒక్క డివిడిలో 4-5 సినిమాలు (అవి కూడ చక్కటివి)అదే 30-35 అమ్ముతుంటే, ఒరిజినల్ సిడిలో క్వాలిటే లేనప్పుడు, వినియోగదారుడు పైరసీని ప్రోత్సహించవద్దంటే మానతాడా? మన బంగారం మంచిదైతే అన్నట్టుగా, ఈ సిడి వ్యాపారస్తులు కొంత అవలోకనం చేసుకోవాలి. కళకు సంబంధ్జించిన వ్యాపారం పూర్తి వ్యాపరంలాగ చేస్తే కూలి పోతుంది. కళాదృష్టి ఉండి తీరాలి, కోంతలో కొంత సిన్సియారిటీ ఉండాలి. ఏ పత్తి వర్తకుడో, మిరపకాయలు లేదా సాంబ్రాణి పుల్లలు అమ్ముకునే వాడో ఎవత్తెతో సినిమా తీద్దామా అని ఆబగా వచ్చేసి సినిమాలు చుట్టేద్దామా అని మద్రాసుకో హైదరాబాదుకో ఎగబడటంకాదు, పాత సినిమాలని సిడి/డివిడి రూపంలో తెచ్చి అమ్మటం.

మరొక మాట కొంతమంది డివిడి గాళ్ళు, ఒక డివిడిలో 3-4 సినిమాలు వేసి అమ్ముతున్నారు. ఒక సినిమా మంచిది పెట్టి, మిగిలినవి ముష్టి సినిమాలు పెడతారు. అలా కాంబినేషన్ మార్చి, వాళ్ళు కొనుక్కున్న చండాలపు సినిమాలన్నీ మనచేత కొనిపించాలని వాళ్ళ దురాశా ప్రయత్నం. కాని, మన పైరసీ సోదరులు(!) ఈ కిటుకు కనిపెట్టి, ఒక్కే డివిడిలో అన్నీ మంచి సినిమాలు పెట్టి వీళ్ళని దెబ్బకొడుతున్నారు.ఇలా ఎంతవ్రాసి ప్రయోజనం, ఈ సిడి/డివిడి వర్తకులకి నాణ్యత మీద అవగాహన రావాలిగాని-వాళ్ళ వ్యాపారాభివృధ్ధి కోసమే!! అది వచ్చిన నాడు పైరసీ జోలికి వినియోగదారుడు వెళితే ఒట్టు.

12, సెప్టెంబర్ 2009, శనివారం

శిధిలాలయం ధారావాహిక- పరిచయం, సమీక్ష

నా చిన్నతనంలో(నేను సెకండ్ ఫారం అంటే 7వ తరగతి చదుతున్నప్పుడు)జనవరి 1968లో ఈ ధారావాహిక మొదలై, సెప్టెంబరు, 1970 వరకు కొనసాగింది. ఈ ధారావాహికలో ముఖ్య పాత్రలు

1. శిఖిముఖి
2. విక్రమకేసరి
3. శిధిలాలయ పూజారి
4. నాగుమల్లి
5. జాంగ్లా

శిఖిముఖి
నేనొక శబర కుర్రాణ్ణి. మా నాన్న శివాలుడు, మంచివాడు నెమ్మదస్తుడు. కుంభారమిట్ట మా పల్లె, హాయిగా కష్టపడి పనిచేసుకుంటూ అడవి తల్లి ఒడిలో సుఖంగా బ్రతుకుతున్న మాకు ఒక దుష్ట గ్రహం దాపురించింది. వాడే శిధిలాలయ పూజారి. ఓ రోజున నేను నా మంచి అనుచరుడు ఎర్రగండు తో కలసి వేట సాగిస్తున్నాను . ఎవరో రాజకుమారుడల్లే ఉంది, కవచం, శిరస్త్రాణం ధరించి, ఆయుధాలతో గుర్రం మీద వస్తున్నాడు. ఆయన మీదకి ఒక దొంగల గుంపు దాడి చేయ్యటం చూసేప్పటికి నా రక్తం మరిగింది. నేను అతనికి సహాయం వెళ్లాను. ఇద్దరం కలిసి ఆ దొంగలను తరిమి కొట్టిన తరువాత అతన్ని , మా పల్లె తీసుకెళ్ళాను. అప్పటినుంచి మొదలయ్యిన మా స్నేహితం ఎల్ల కాలం కొనసాగింది. పల్లె చేరినాక, అతను మా నాన్న స్నేహితుని మనవడని తెలిసింది. ఈ మధ్యే మా మధ్య తిరుగుతూ, లేనిపోనివన్ని బోధించి ఇతర తెగల కుర్రాళ్ళని చెడగొడుతున్న దుష్ట గ్రహం వ్యక్తే అతనిమీద దాడి చేయించాడట. అతనిదగ్గర మరింకెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న ఆడవిలో శిధిలాలయం గురించిన ఆనవాళ్ళు వెళ్ళే మార్గపు రేఖలు ఉన్నాయట వాటికోసరం. సరే, మా అయ్యా తన స్నేహితుడి మనవడికి సాయం చెయ్యమని చెప్పాడు. ఈలోగా ఈ పూజారిగాడు, మా గ్రామంలో అగ్ని ప్రమాదం సృష్టించి నాకు పూర్తి కోపం తెప్పించాడు. వాడికి ఆశ్రయం ఇస్తున్న గండుపోతు పని పట్టి (ఆయనే నాకు పిల్లనిచ్చిన మామ అయ్యాడు తరువాత), ఆయన కూతురు, నాగుమల్లిని పూజారి బారినుంచి కాపాడి, విక్రమకేసరితో ప్రయాణం కట్టి, మధ్యలో పూజారి కుక్క పెట్టిన అన్ని అడ్డంకులు తొలగించుకుని, శిధిలాలయం కనుగొన్నాము. వారి తాతగారి కోరికను తీర్చాం. నాకు నాగుమల్లికి జరిగిన వివాహానికి రాజుగారుకూడ వచ్చి ఆశీర్వదించారు. నాగుమల్లి ఇంప్పటికి అలుగుతుంటుంది, మా అయ్యను తన్నావుగా, నేను నీతో మాట్లాడను ఫో అని. అన్ని ఉట్టుట్టి కోపాలు! మరంతేగా.

విక్రమకేసరి:
కుంభారమిట్ట, శివాలుడు గారు, శిఖిముఖి ఎంత హాయిగా ఉన్నారు ప్రక్రుతి వడిలో. నేను వచ్చి వాళ్లకు కష్టాలు తెచ్చిపెట్టను. శిఖిముఖి వంటి సాహసవంతున్ని ఇంతవరకూ చూడలేదు. అతనిలాంటి వాళ్ళు ఒక్క పదిమంది మా సైన్యంలో ఉంటేనా !! మా తాతగారిని వెతుక్కుంటూ నేను శిఖిముఖి, శిధిలాలయం ఉన్న ప్రాంతానికి బయలుదేరాం. దారిలో ఎన్ని అడ్డంకులు , అన్ని పూజరి ఏర్పాటు చేసినవే! శిఖిముఖి సాహసం, కొంత నా యుక్తి వాడుకుని అన్నిట్లోంచి బయటపడి చివరకు అనుకున్నది సాధించాం. అమాయకపు పిల్ల నాగుమల్లి, శిఖిముఖిని పూజారి శిఖ కోసి తెమ్మన్నది. ఆమే కోపం చూస్తే నాకు కూడా భయమేసిన మాట నిజం. శిఖిముఖి, ఆ చిన్నదానికిచ్చిన మాటకోసం ప్రాణాలమీదకొచ్చినా సరే, తెగించి ఆమే కోరిన కోరిక తీర్చాడు.

నాగుమల్లి:
మా అయ్యను తన్ని వడ్ల పాత్రలో పడేసిన వాడెవడు అని కోపంగా వెళ్ళాను. మా నాన్న గండుపోతేమో ఆ కుర్రాడితో, వాళ్ల తండ్రితో సరదాగా కబుర్లాడుతున్నాడు. మనాన్నెప్పుడో ఇంతే వస్తే పిచ్చి కోపం, పొగరు లేకపోతే బోళాతనం . అందుకనే శిధిలాలయ పూజారి మాటలు విని, లేనిపోని గొడవలకు కారణమయ్యాడు. శిఖిముఖి మీద ఇప్పటికీ కోపమే, మా నాన్నను అలా అవమానించి, కొట్టి పడేసినందుకు. కాని పాపం నామీద ఎలుగుబంటి దాడి చేసినప్పుడు, వెనుక ముందు చూడకుండా దానిమీద కలియబడి, తన దగ్గర చిన్న చురకత్తి తప్ప ఇంకేమీ లేదు తన దగ్గర, నన్ను రక్షించాడు, ఒళ్లంతా గాయాలు చేసుకున్నాడు. నన్ను పూజారి ముఠావాళ్ళు ఎత్తుకేళ్ళినప్పుడు, ఆ రాజయ్య కొడుకుకు విక్రమకేసరితో కలసి, యుక్తిగా విడిపించాడు శిఖిముఖి. అందుకే అతనంటే ఇష్టం. నాకోసం శిధిలాలయ పూజారి శిఖ కూడ కోసి తెచ్చాడు. ఇప్పుడంతా స్నేహమే, మా రెండు పల్లెలు కలసిపోయి సవర శబరలు ఒక్కటైపోయారు.

శిధిలాలయ పూజారి:
హా హ్వాహా! నేనే శిధిలాలయ పూజారిని, కాళీమాత ఉపాసకుణ్ణి. ఆ కాళీ మాత ప్రసన్నం కోసరం మళ్ళీ ఆవిడకు పూజారినవ్వాలన్న(కిందటి జన్మలో నేనే శిధిలాలయంలో పూజారిని) తపనతో నేను కొన్ని పనులు చెయ్యాల్సి వచ్చింది. ఆ శబర కుర్రాడు, ఏమో అనుకున్నాగాని, మంచి సాహసి. అతనికి తోడు విక్రమకేసరి. ఇద్దరూ కలసి నా పని పట్టారు. నేను వేసిన పన్నాగాలన్నీ విఫలమైపొయ్యాయి. చివరకు నా ప్రాణమే పొయ్యింది. చివరలో జ్ఞానోదయమయ్యింది, నే తలపెట్టిన కార్యం మంచిదే, గొప్పదే. కాని నేను అవలంభించిన మార్గాలు ఒట్టి దగాకోరువి. నా కాళ్ళు రెండు పచ్చడి అయిపోయి, అలా డోలీలో పడుండి, నా తల్లి కాళీమాత ఆలయ శిఖరం బయటకు వస్తుండగా ఇక ఆగలేక దూకేశాను, ఆ శిఖరం మీదపడి పైకొచ్చేశాను. ఇప్పుడంతా ప్రశాంతమే. ఈ బుధ్ధి నాకు మొదట్లోనే ఉంటే దాసరి వారు కథ ఎలా నడిపేవారో మరి.

జాంగ్లా:
నేను పూజారి కి గూఢచారిని. మెరమెచ్చు మాటలతో శిఖిముఖి, విక్రమకేసరి చెంత చేరాను. వారికి మోసం తలపెట్టాను, ఫలితం అనుభవించాను. నా కాలు పోయింది. శిఖిముఖి తోటి అడవి బిడ్డనైన నామీద ఎంత కనికరం చూపించాడు! తమకు ద్రోహం తలపెట్టినా నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను రక్షించాడు. అదే నాలో స్వామి భక్తిని పుట్తేట్టుగా చేసింది. చివరలో పూజారి గాడు పారిపోతుంటే నేనే వాడి శిఖపట్టుకుని, వాడు కత్తితో నా చేతులో పొడిచినా సరే వదలకుండా శిఖిముఖికి వప్పచెప్పి, నా ౠణం తీర్చుకున్నాను. ఇప్పుడు, శికిముఖి చల్లని నీడలో హాయిగా బతుకుతున్నాను.

ఇప్పుడు నేనే మాట్లాడేది. దాసరివారి/చిత్రావారి పాత్రలు కాదు. దాసరివారి కథా కథనం, చిత్రాగారి బొమ్మలు, ఈ ధారావాహికను, ఒక క్లాసిక్ గా మలిచాయి. ఆ బొమ్మలు ఇప్పటికీ చూస్తుంటాను. ధారావాహిక వస్తున్న రోజులలో నేను మా స్నేహితులు రకరకాల ఊహాగానాలు చేసేవాళ్ళం మరుసటి నెల ఏమౌతుందో అని. అసలు శిధిలాలయం సినిమా తీస్తే ఎవరు ఏపాత్ర వేస్తే బాగుంటుందని తర్జన భర్జనలు పడే వాళ్ళం. చివరకు మాకు ఈ కింది విధంగా ఏకాభిప్రాయం కలిగింది:

శిఖిముఖి రామారావు
విక్రమకేసరి కాంతారావు
పూజారి రాజనాల
శివాలుడు నాగయ్య (అతిధి పాత్రలో)
నాగుమల్లి కాంచన
గండుపోతు ఎస్వీ రంగారావు (అతిధి పాత్రలో)
విక్రమకేసరి తాతగా ముక్కామల (ఫొటోలోనే కనబడతారు)
విక్రమకేసరి తండి మిక్కిలినేని అతిధి పాత్రలో
జాంగ్లా నాగభూషణం

ఇలా అనేకమంది హేమాహేమీలను పెట్టి మేము సినిమాని (మా ఊహలలో ) తీసి ఆనందించేవాళ్ళం. సినిమా పరిశ్రమ దురదృష్టం , ఈ చక్కటి జానపదకథను సినిమాగా మలచలేకపోవటం. సరిగ్గా తియ్యగలిగితే , ఒక గొప్ప జానపద చలన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయి, హాలివుడ్ చిత్రాలకు సమానంగా సరితూగి నిలబడేది. కాని, మనకు ప్రాప్తంలేదు.



ఏది ఏమైనప్పటికి చందమామ దారావాహికలలో తలమానికమైనది శిధిలాలయం. కథలో వేగం, ఎన్నెన్నో ప్రాంతాల దర్శనం, అక్కడి ప్రజల పరిచయం, ఇలా దాసరి సుబ్రహ్మణ్యం గారు (ఫోటోలో ఉన్నవారు) తన అఖండమైన కల్పనా శక్తితో, చిక్కటి కథను పిల్లలకోసం కల్పించారు, పెద్దల ఆసక్తిని కూడ చూరగొన్నారు. దాసరి వారు ధన్యులు. దాసరి వారు వ్రాసి చందమామ ధారావాహికలలో కెల్లా ఎక్కువ పేరు తెచ్చుకున్న సీరియల్ ఇది.



మన సినిమాలన్నీ కూడా చివరకి ఒక గ్రూపు ఫోటో మీద శుభం కార్డు వెయ్యటం చూస్తుంటాము. అలాగే మన శిధిలాలయం సమీక్ష కూడా ఈ చక్కటి శిఖిముఖి, నాగుమల్లిల పెళ్లి సందడితో ముగిద్దాం.




మళ్ళీ శిధిలాలయం ధారావాహిక చదవాలని అనిపిస్తున్నదా ? తప్పకుండా మీ కోరిక తీరుతుంది. బ్లాగాగ్నిగారి కానుక ఇది, ఈ కింది లింకు నొక్కి అందుకోవచ్చు
శిధిలాలయం ధారావాహిక


*****************************************
మరిన్ని బొమ్మలు




10, సెప్టెంబర్ 2009, గురువారం

తాగుబోతులే మంచివాళ్ళా!!

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారు వేసిన చక్కటి అర్ధవంతమైన కార్టూన్


తాగుబోతులే మంచివాళ్ళా!!అని అనుమానం రావటానికి అంతకంటే దరిద్రులు, చండాలులు మనకి తారసపడటమే!! ఒక తాగుబోతు తాగి తాగి చస్తాడు, వాడి వల్ల పక్క వాడికి న్యూసెన్సే తప్ప చాలా వరకు ప్రమాదం ఉండదు. వాడి కుటుంబం వాడి ప్రవర్తన వల్ల వాడికున్న తప్పుడు అలవాటువల్ల నాశనమైపోతుంది.

కాని, సిగిరెట్టు తాగేవాళ్ళు తాగుబోతులకంటే ఎంతో ప్రమాదకారులు. కారణం, మన ప్రమేయం లేకుండా వాళ్ళు తాగి వదలిన విషపూరిత, ప్రమాదకర మైన పొగను మనను పీల్పిస్తారు. ఒక తాగుబోతు తాగి ఉండగా నలుగురిలోకి రావటానికి సిగ్గు పడతాడు. సిగిరెట్టు తాగుబోతులకి ఆ సిగ్గులేదు. నిర్భయంగా, నిరాటంకంగా నలుగురిలో కూచుని, తామేదో గొప్ప పని చేస్తున్నట్టు, ఆ వెధవపని చేస్తారు. తమ ఆరోగ్యం ఎల్లాగో నాశనం అవుతుంది, ఇతరుల ఆరోగ్యం చెడగొట్టటానికి వీళ్ళకెవరిచ్చారు అధికారం?

పొగ తాగేవాళ్ళంత అమర్యాదకరపు మనుషులు యెక్కడా ఉండరు. పక్కవాడికి అసౌకర్యమా కాదా అన్న కనీస జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ, రైళ్ళల్లో, బస్సుల్లో, చివరకు సినిమా హాళ్ళల్లో వీళ్ళ అసభ్యకరమైన అలవాటుకు అడ్డుండదు . ఈ ఏ సి బస్సులు, రైళ్ళు, సినిమా హాళ్ళు వచ్చాక, కొంత ఈ ప్రత్యక్ష నరకం తగ్గింది. కాని, ఏ విశ్రాంతి సమయంలోనో, బస్సు ఆగినప్పుడో, అలా బయటకు వెళ్ళి ఆబగా నాలుగు పీకులు దబదబ పీక్కుని, వచ్చి మన పక్కన కూలబడతాడు ఆ నికృష్టుడు. వాడి నోట్లోంచి వచ్చే దుర్ఘంధం మనం భరిస్తూ, తప్పదు కనుక కూచోవాలి.

తాగుబోతు కొంతలో కొంత ఎవరన్నా అదిలిస్తే పోతాడు ఆవతలకి. కాని ఈ సిగిరెట్టు వాడు, ఎవరన్నా ఎంత అబ్యంతర పెడితే అంత ఎక్కువ ఎగబడి కాలుస్తాడు.

అందుకనే ప్రభుత్వం చేసిని మంచి పనులలో మొట్టమొదటిది, నలుగురూ కూడే స్థళాలలో పొగ తాగటం నిషేధించటం. ఎంత నిషేధం ఉన్నప్పటికి, ఇంకా తక్కుతూ తారుతూ మన ఆరోగ్యం పాడు చెయ్యటానికి తమ అనారోగ్యపు అలవాటును కొనసాగించే ఈ సిగిరెట్టు తాగుబోతులను చూస్తుంటే అనిపిస్తుంది, అసలు తాగుబోతులే నయమేమో అని.

ఈ కింద ఇచ్చిన రెండు లింకులతో రెండు చక్కటి వీడియోలు చూడండి. అద్భుతంగా తీశారు. ఇవి చూసినాక కూడ ఇంకా ఎవరన్న నలుగురిలో పబ్లిక్ స్థల్లాల్లో సిగిరెట్టు తాగుతుంటే, ఇక వాళ్ళని బాగుచెయ్యటానికి ప్రయత్నించటం అనవసరం. సంఘంలో ఉండతగరు.


9, సెప్టెంబర్ 2009, బుధవారం

భువన సుందరి & రూపధరుడి యాత్రలు

చందమామలో వేయబడ్డ జంట ధారావాహికలలో విదేశాలకు సంబంధించిన పురాణ గాధ ఇదొక్కటే.

మనకు వ్యాసుడు, వాల్మీకి ఎలాగో, గ్రీకు వారికి హోమర్ అటువంటివారు. ఆయన వ్రాసిన ఇతిహసాల నుండి గ్రహించబడినవి ఈ ధారావాహికలు. మన తెలుగు ప్రజలకు ఆ గ్రీకు పేర్లు అర్థమవ్వటం, నోరు తిరగటం కష్టమని భావించిన చందమామ వారు, ఆ కథలలోని పేర్లను భారతీయకరించారు.

బొమ్మలు. బొమ్మలగురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. చందమామలో ప్రసిధ్ధి చెందిన ప్రముఖ చిత్రకారులు,చిత్రా గారు బొమ్మలను తన నైపుణ్యాన్నంతా వినియోగించి, గ్రీకు వాళ్ళు ఎలా ఉంటారు, అప్పటి పరిసరాలు ఏవిధంగా ఉంటాయి అని పరిశోధన చేసి అద్భుతంగా చిత్రీకరించారు. అప్పటి పాఠకులను ఎంతగానో అలరించిన ధారావాహిక ఈ కింది లంకె నొక్కి చదువవచ్చు.


భువన సుందరి & రూపధరుడి యాత్రలు ఈ లింకు నుండి మునుపు డౌన్లోడ్ చేసుకోవటానికి ఆవకాశం ఉండేది. కాని కాపీ రైటు సమస్యలవల్ల ఆ సౌకర్యం తొలగించటం జరిగింది. ఇప్పుడు ఈ ధారావాహిక చదవాలంటే, చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ వారు ఉంచిన పాత చందమామలను తెరిచి చదువుకోవచ్చు.


8, సెప్టెంబర్ 2009, మంగళవారం

చందమామ అభిమాని - సురేఖ గారు

సురేఖ అన్నారు ఇక్కడ చూస్తె ఒక పెద్దాయన ఫోటో ఉన్నది ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారా!ఏమిటీ చిత్రం అనుకుంటున్నారా!! ఇందులో పెద్ద మిస్టరీ ఏమీ లేదు. చందమామ ప్రియుడైన ఈయన పేరు మట్టెగుంట అప్పారావు గారు. ఈయన "సురేఖ" పేరుతో కొన్ని వేల కార్టూన్లు వేసి ప్రసిధ్ధికెక్కారు( త్వరలో ఆయన కార్టూన్ల గురించి మరొక వ్యాసంలో విషయాలు చెప్తాను ).

అప్పారావుగారు చందమామకు వీరాభిమాని. ఆయన దగ్గర చందమామల నిధి ఉన్నది. దాదాపు మొదటి నుండి 1979-80 లవరకు ఓపికగా సంచికలన్నీ పోగుచేసి వాటన్నిటిని వరుసగా బైండ్లు కట్టించి భద్రపరచారు. ఇంత చక్కగా చందమామ పత్రిక ఆఫిసులో కూడ ఉండి ఉండవు. బాంకులో పని చేసి పదవీ విరమణ చేసిన అప్పారావుగారు, ఆయన ఎంత జాగ్రత్తతీసుకుంటే చందమామలన్నీ ఇంత చక్కగాఉన్నాయి. ఉద్యోగ నిర్వహణలో వచ్చిన అన్ని బదిలీలలోను పాడుకాకుండా ఒక చోటి నుండి మరొక చోటుకు మార్చటంలో ఆయన ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారు.పుస్తక ప్రియులందరూ పాటించవలసిన ఒక చక్కటి నినాదం అప్పారావుగారు సదా చెపుతుంటారు

నా కొత్త పుస్తకం ఎవరికీ ఇవ్వను. అవి ఇప్పుడు మీకు పుస్తకాల షాపులో దొరుకుతాయి కాబట్టి. నా పాత పుస్తకాలు ఎవరికి ఇవ్వను, అవి నాకు ఎక్కడ దొరకవు కాబట్టి


ఇంతే కాకుండా హాసం అని ఒక క్లబ్ స్థాపించి ప్రతి ఆదివారం సభ్యులందరినీ సమావేశపరచి హాస్యాన్ని అస్వాదింపచేస్తుంటారు. ఒక్కటే నియమం, ఈ సమావేశాలకు, సభ్యులు చక్కటి తెలుగు వేష ధారణలోనే రావాలి. మర్చిపొయ్యాను, తెలుగు వేష ధారణ అంటే ఏమిటో చాలమందికి గుర్తు లేదేమో. చక్కగా పంచె లాల్చి ధరించి పైన కండువా వేసుకుని రావాలి అన్నమాట.

ఈ మధ్య తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో భాగంగా, తన దగ్గర ఉన్న చందమామ బైండ్లన్నిటిని చందమామ ప్రియులకోసం ఒక ప్రదర్శన పెట్టారు. అందులో, ఎవరుపడితే వారు పుస్తకాలను అటు ఇటు తిరగేసి నలిపి పారెయ్యకుండా, గ్లాసు అరల కింద ఉంచి చూపించారు. ఎంతో మంది చందమామ ప్రియులు వచ్చి, ఈ ప్రదర్శనను చూసి పులకితులైపొయ్యారు. ఆయన చందమామ ప్రదర్శనను ఈ కింది ఫొటోల ద్వారా చూసి ఆనందించండి.
****************************************


***



***



***




****